Share News

IAS Liquor Scam: ఇదేంది ధనుంజయా

ABN , Publish Date - May 12 , 2025 | 02:53 AM

మాజీ ఐఏఎస్‌ అధికారి ధనుంజయ్‌ రెడ్డి మద్యం స్కామ్‌లో నిందితుడిగా మారి విచారణకు హాజరుకాకుండా పరారయ్యారు. మూడు రాష్ట్రాల్లో పోలీసుల గాలింపు కొనసాగుతోంది

IAS Liquor Scam: ఇదేంది ధనుంజయా

ఐఏఎస్‌గా పనిచేసి పరారా..

  • మద్యం స్కామ్‌ విచారణకు డుమ్మా

  • సర్పంచ్‌ నుంచి ఐఏఎస్‌ స్థాయికి

  • వైఎస్‌ ఆశీర్వాదంతో అండమాన్‌ నుంచి ఆంధ్రాకు.. ఆ కుటుంబానికి అభిమాని

  • గత ప్రభుత్వంలో సీఎంవోలో చక్రం

  • జగన్‌ కోసం ఎన్నో పాపాలు

  • ఇప్పుడు జైలు భయంతో పరార్‌

  • 3 రాష్ట్రాలలో పోలీసుల గాలింపు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఆయన.. ఐఏఎస్‌గా పనిచేశారు. అందులోనూ సాదా సీదా కాదు. ముగ్గురు ముఖ్యమంత్రుల మన్ననలు చూరగొన్న ఆఫీసర్‌. అండమాన్‌లో ఉండాల్సిన వ్యక్తి వైఎస్‌ఆర్‌ చొరవతో ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారు. చంద్రబాబు హయాంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా రెండేళ్లు పనిచేశారు. జగన్‌ హయాంలో సీఎంవోలో చేరి పదవీ విరమణ చెందారు. కాకపోతే వైసీపీ పాలనలో సర్వాధికారాలు తనవే అంటూ చేసిన అక్రమాలు మెడకు చుట్టుకోవడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయనే.. ఉమ్మడి కడప జిల్లాకు చెందిన రిటైర్డ్‌ ఐఏఎస్‌ ధనుంజయ్‌ రెడ్డి. ఒకప్పుడు రాష్ట్ర డీజీపీని, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ను సైతం నిరీక్షింపజేసిన ధనుంజయ్‌ రెడ్డి.. ఇప్పుడు ఎస్‌ఐ, కానిస్టేబుళ్లు ఇంటికొస్తున్నారని తెలిసి పరారయ్యారు. చట్టాలు బాగా తెలిసిన ఆయనకు కేసులో నిందితుడిగా ఉన్నప్పుడు దర్యాప్తు అధికారులకు సహ కరించాలని తెలియదా? విచారణకు రమ్మంటూ నోటీసు ఇస్తే హాజరు కావడం తెలియదా? అంటూ బ్యూరోక్రాట్లలో చర్చ జరుగుతోంది. ఉమ్మడి కడప జిల్లా రాయచోటి సమీపంలోని ఒక పల్లెటూరుకు చెందిన ధనుంజయ్‌ రెడ్డి రాజకీయాలపై ఆసక్తితో విద్యాభ్యాసం పూర్తి కాగానే గ్రామ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ప్రభుత్వ అధికారులకు ఉన్న పవర్‌ ఏమిటో గమనించి కలెక్టర్‌ కావాలనుకున్నారు.


యూపీఎస్‌సీ పరీక్షలో మార్కులు తక్కువ రావడంతో డానిక్స్‌గా పిలిచే ఢిల్లీ అండమాన్‌ నికోబార్‌ సివిల్‌ సర్వీస్‌(ఏపీలో గ్రూప్‌-1 స్థాయి)కు ఎంపికయ్యారు. కడప జిల్లాకు చెందిన వైఎస్‌ రాజశేఖర రెడ్డి ఢిల్లీకి వెళ్లినప్పుడు తరచూ ఆయన్ను కలిసి అభిమానం చాటుకునేవారు. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు వైఎస్‌ఆర్‌ ముఖ్యమంత్రి కావడంతో ఆయన ఆశీర్వాదంతో ఏపీకి వచ్చారు. ఇక్కడే ఐఏఎస్‌ (కన్‌ఫర్డ్‌) అయ్యారు. అదంతా పద్ధతి ప్రకారమే జరిగిందా అనేది పక్కనపెడితే ప్రభుత్వానికి పని చేయాల్సిన ఐఏఎస్‌ వైఎస్‌ కుటుంబానికి అభిమానిలా మారారు. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు కూడా ధనుంజయ్‌ రెడ్డికి ప్రాధాన్యం ఇచ్చారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో జగన్‌ శిబిరంలో చేరారు. గత ప్రభుత్వంలో ఆయన చేయని దందా, దౌర్జన్యం లేదు. తాడేపల్లి ప్యాలెస్‌లో ఉంటూ అవసరమైన వారిని పిలిపించి ఏదో ఒక రూపంలో బెదిరించడమే ఆయన వరస. ఈ క్రమంలో లిక్కర్‌ స్కామ్‌లో తలదూర్చి జగన్‌కు ఆయాచిత లబ్ధి చేకూర్చడంలో కీలక పాత్ర పోషించారనేది ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) అభియోగం. దేశంలోనే అతిపెద్ద మద్యం కుభకోణంలో పలువురిని విచారించిన సిట్‌ అధికారులు ఎవరెవరి పాత్ర ఏంటనే సమాచారాన్ని సేకరించారు. ఏ1 రాజ్‌ కసిరెడ్డితో పాటు మరికొందరు వెల్లడించిన వివరాలకు ఆధారాలు సేకరించి ధనుంజయ్‌ రెడ్డిని నిందితుల(ఏ-31) జాబితాలో చేర్చారు.


చట్టాలు చదివిన అధికారి తీరు ఇదా?

నిజానిజాలు తేల్చేందుకు ధనుంజయ్‌ రెడ్డితో పాటు జగన్‌ ఓఎస్‌డీగా పనిచేసిన కృష్ణమోహన్‌ రెడ్డి(ఏ-32), భారతీ సిమెంట్స్‌ శాశ్వత డైరెక్టర్‌ గోవిందప్ప బాలాజీ(ఏ-33)కి దర్యాప్తు అధికారులు నోటీసులు జారీ చేశారు. వాటిని ఇచ్చేందుకు హైదరాబాద్‌కు మూడు బృందాలు వెళ్లగా, అప్పటికే ధనుంజయ్‌ రెడ్డి ఇంటి నుంచి మాయమయ్యారు. మిగతా ఇద్దరూ అదే బాటలో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో వారి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. బంధువులు, స్నేహితులు, ఆత్మీయుల ఇళ్లకు సైతం వెళ్లి వాకబు చేస్తున్నారు. ధనుంజయ్‌ రెడ్డికి పట్టిన ఈ దుస్థితి చూస్తున్న బ్యూరోక్రాట్లు ‘ఇంత బతుకు బతికీ ఇదేంది ధనుంజయా’ అంటూ చర్చించుకొంటున్నారు. యూపీఎస్‌సీ పాసై, జిల్లా కలెక్టర్‌గా పనిచేసి, సీఎంవోలో ఐదేళ్ల పాటు అధికారం చెలాయించిన అధికారి పారిపోవడం ఏమిటి? ప్యాలెస్‌లో షాడో సీఎంగా అధికారం చెలాయించిన వ్యక్తి ఇప్పుడు ఈ దుస్థితికి రావడం ఏమిటి? అంటూ బ్యూరోక్రాట్లలో కామెంట్లు వినిపిస్తున్నాయి. ముందస్తు బెయిల్‌ అభ్యర్థనను కోర్టులు తిరస్కరించినా ఆయన విచారణకు రావడం లేదు.


విచారణకు డుమ్మా

జగన్మోహన్‌ రెడ్డి నమ్మినబంటు కృష్ణమోహన్‌ రెడ్డి, మాజీ సీఎం కార్యదర్శి ధనుంజయ్‌ రెడ్డి, భారతీ సిమెంట్స్‌ ఆర్థిక లావాదేవీలు చక్కబెట్టే గోవిందప్ప బాలాజీ కోసం ప్రత్యేక బృందాలు మూడు రాష్ట్రాల్లో వెతుకుతున్నాయి. ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో సమాచారం సేకరిస్తున్నాయి. మద్యం కుంభకోణంలో ఈ ముగ్గురినీ ఆదివారం విచారణకు రమ్మంటూ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) నోటీసులు జారీ చేసింది. విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌లోని రెండో అంతస్తులో ఉన్న సిట్‌ కార్యాలయానికి రావాల్సిందిగా హైదరాబాద్‌లో నోటీసులు అందజేసింది. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌కు వెళ్లిన మూడు బృందాలు కృష్ణమోహన్‌ రెడ్డి ఇంటికెళ్లి, ఆయన లేకపోవడంతో కుమారుడు రోహిత్‌ రెడ్డి చేతికి ఇచ్చాయి. గోవిందప్ప బాలాజీ ఇంటికెళ్లి ఆయన భార్యకు, ధనుంజయ్‌ రెడ్డి ఇంట్లో లేకపోవడంతో కుటుంబ సభ్యులకు అందజేసి వచ్చాయి. అప్రమత్తమైన ముగ్గురూ మొదట బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఎలాంటి ఉపశమనం లభించలేదు. దీంతో సిట్‌ అధికారులు ఎప్పుడైనా అరెస్టు చేస్తారనే భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. నోటీసుల్ని తీసుకుని సిట్‌ విచారణకు రాకపోవడంతో ఆ ముగ్గురి కోసం సిట్‌ అధికారులు గాలిస్తున్నారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఆచూకీ కోసం ఆరా తీస్తున్నట్లు తెలిసింది. పక్కా సమాచారం లభిస్తే ముగ్గురినీ అరెస్టు చేసే అవకాశం ఉంది.


ఇవి కూడా చదవండి..

పాక్ లో ప్రస్తుత పరిస్థితి .. చైనా శాటిలైట్ చిత్రాలు

Buddha Venkanna: విషపురుగు.. అందుకే దూరం పెట్టిన చంద్రబాబు

Operation Sindoor: మరికొద్ది గంటల్లో హాట్ లైన్ చర్చలు.. రంగం సిద్ధం..

Operation Sindoor: పాక్ ఆక్రమిత కాశ్మీర్‌పై ప్రధాని సంచలన వ్యాఖ్యలు

India Vs Pakistan: ప్రధాని మోదీకి రాహుల్ కీలక సూచన

Operation Sindoor: భారత సైన్యం రావల్పిండిలోనూ గర్జించింది: రాజ్‌నాథ్ సింగ్

For Andhrapradesh news and Telugu News

Updated Date - May 12 , 2025 | 02:53 AM