Fake Encounter: అది బూటకపు ఎన్కౌంటర్
ABN , Publish Date - Jun 07 , 2025 | 04:13 AM
సీపీఐ(మావోయిస్టు) పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ను బూటకపు ఎన్కౌంటర్లో చంపేశారని రాజకీయ ఖైదీల విడుదల కమిటీ నేత బల్లా రవీంధ్రనాథ్ ఆరోపించారు. ఈమేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటన చేశారు.

సుధాకర్ని పట్టుకొని చంపారు.. రాజకీయ ఖైదీల విడుదల కమిటీ ఆరోపణ
పోస్టుమార్టం నిర్వహించాలి.. ఛత్తీస్గఢ్ హైకోర్టుకు ఐఏపీఎల్ లేఖ
అమరావతి, జూన్ 6(ఆంధ్రజ్యోతి): సీపీఐ(మావోయిస్టు) పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ను బూటకపు ఎన్కౌంటర్లో చంపేశారని రాజకీయ ఖైదీల విడుదల కమిటీ నేత బల్లా రవీంధ్రనాథ్ ఆరోపించారు. ఈమేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటన చేశారు. ‘దండకారణ్యంలో కూంబింగ్ ఆపరేషన్ చేస్తోన్న పోలీసులు, సుధాకర్ సహా పలువురు నేతలను ముందుగానే అదుపులోకి తీసుకొన్నారు. ఒక్కొక్కరినీ ఎన్కౌంటర్ పేరిట కాల్చిచంపుతున్నారు. వయస్సులో పెద్దవాడైన సుధాకర్ ఒక్కరే ఎన్కౌంటర్లో మరణించారని ప్రకటించడం, ఆ తర్వాత అదే స్పాట్లో తెలంగాణ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు భాస్కర్ను కాల్చిచంపడం అనేక ప్రత్యక్ష అనుమానాలకు తావిచ్చేలా ఉన్నాయి. కేంద్రం బూటకపు ఎన్కౌంటర్లను ఆపేయాలి. మావోయిస్టు నేతల మృత దేహాలను వారి బంధువులకు అప్పగించాలి. మావోయిస్టులు కోరుతున్నట్లుగా ప్రజల కోసం కేంద్రం శాంతి చర్చలు జరపాలి’ అని రవీంద్రనాథ్ డిమాండ్ చేశారు. కాగా, సుధాకర్ మృతదేహాన్ని భద్రపరిచేలా ఆదేశించాలని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పీపుల్స్ లాయర్స్(ఐఏపీఎల్) సభ్యుడు పిచ్చుక శ్రీనివాస్ ఛత్తీ్సగఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. సుధాకర్ పోస్టుమార్టంను కుటుంబీకుల సమక్షంలో నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.
న్యాయ విచారణ జరిపించాలి: పౌరహక్కుల సంఘం
సుధాకర్ ఎన్కౌంటర్పై న్యాయవిచారణ జరిపించాలని ఏపీసీఎల్సీ అధ్యక్షుడు వేడంగి చిట్టిబాబు, ప్రధాన కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్ ఓ ప్రకటనలో కోరారు. సుధాకర్ను పట్టుకొని కాల్చిచంపారని వారు ఆరోపించారు. లొంగిపోండి లేదా చావండి అనే విధానంతో ముందుకు సాగుతున్న కేంద్రం వృద్ధ నేతలను వెంటాడి మరీ హత్య చేస్తోందని వారు ఆరోపించారు. రేణుక, నంబాల కేశవరావుల మాదిరే, ఇప్పుడు సుధాకర్ను కూడా కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నా పోలీసులు హత్యచేశారని ఆరోపించారు.
సుధాకర్ మృతితో సత్యవోలులో విషాదం
మృతదేహాన్ని రప్పించేందుకు కుటుంబ సభ్యుల ప్రయత్నాలు
మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు తెంటు సుధాకర్ (65) మరణవార్త విన్న ఏలూరు జిల్లా పెదపాడు మండలం సత్యవోలు గ్రామంలో విషాదం అలుముకుంది. మావోయిస్టు పార్టీలో వున్న సుధాకర్ గురించి పలుమార్లు టీవీల్లో, దిన పత్రికల ప్రధాన సంచికల్లో వచ్చే కథనాలను ఆసక్తిగా చదివే ఇక్కడి ప్రజలు... ఆ వ్యక్తి ఇక లేడనే నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయుర్వేద విద్యను అభ్యసించేందుకు విద్యార్థిగా ఇంటి నుంచి అడుగు బయట పెట్టిన తెంటు సింహాచలం అలియాస్ సుధాకర్ ఆ తరువాత మరలా వెనక్కి చూడలేదు.
రాజమండ్రి జైల్లో ఒకసారి కలిశాం...
విజయవాడలో చదువుకునే రోజుల్లో ఉద్యమం వైపు వెళ్లిన నాటి నుంచి నేటి వరకు కుటుంబంతో ఎటువంటి సంబంధాలు లేవని సుధాకర్ అన్న వదినలు తెంటు ఆనందరావు, సత్యవతి తెలిపారు. 1983లో రాజమండ్రి జైలులో సుధాకర్ను ఒకసారి కలసినట్లుగా చెప్పారు. ఈ జీవితాన్ని వదిలిపెట్టమని సుధాకర్ను ఆ సందర్భంలో కోరగా... ‘నా మరణానంతరం నా జెండాను అందిస్తా, మీ కొడుకును పంపండి’ అని అన్నాడని ఆనందరావు గుర్తు చేసుకున్నారు.