PM JANMAN: ఇది పీఎం, సీఎంల చొరవతోనే సాధ్యమైంది : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ABN , Publish Date - May 31 , 2025 | 09:30 AM
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన PM-JANMAN ఏపీలో అద్భుత ఫలితాలనిస్తోందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. పీఎం మోదీ, సీఎం చంద్రబాబు దార్శనిక నాయకత్వంలో ఇది సాధ్యమౌతోందని పవన్ చెప్పారు.

ఇంటర్నెట్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన PM-JANMAN అద్భుత ఫలితాలనిస్తోందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ పథకం ఫలితంగా అల్లూరి సీతారామరాజు జిల్లా(ASR)లోని లక్కవరం నుండి చీడిగొండ వరకు 1.01 కి.మీ. రహదారిని ₹87.19 లక్షల వ్యయంతో నిర్మించామని పవన్ చెప్పారు. ఈ కొత్త రోడ్డు మార్గం ద్వారా చాలా కాలంగా సరైన సౌకర్యాలు లేని 183 మంది గిరిజన నివాసితులకు ప్రయోజనం చేకూరుతుందని పవన్ కళ్యాణ్ తెలిపారు. గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో ఇది సాధ్యమైందన్నారు. భారతదేశం అంతటా గిరిజన, PVTG వర్గాల జీవితాలను మార్చే దార్శనికత కలిగిన వ్యక్తి ప్రధాని మోదీ అని పవన్ చెప్పారు.
ఆంధ్రప్రదేశ్లో, గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనిక నాయకత్వంలో రూ. 1,000 కోట్లతో అడవి తల్లి బాట కార్యక్రమం గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా ప్రారంభించామని పవన్ తెలిపారు. NDA ప్రభుత్వం చివరి మైలు వరకు చేరుకోవడానికి, కీలకమైన మౌలిక సదుపాయాలు, సమ్మిళిత వృద్ధితో మారుమూల వర్గాలకు సాధికారత కల్పించడానికి కట్టుబడి ఉందని పవన్ ఉద్ఘాటించారు. ఇన్నేళ్లుగా సరైన రోడ్లు లేక వైద్యానికి, అవసరాలకు ఇబ్బందిపడుతున్న గిరిజన గ్రామాలకు రోడ్ల నిర్మాణాన్ని చేయడం ద్వారా వారి ఇబ్బందులు తొలగించి మౌలిక సదుపాయాలు కల్పిస్తూ, వారికి అభివృద్ధిని చేరువ చేస్తోందని పవన్ అన్నారు.