Minister Nara Lokesh: డీఎస్సీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
ABN , Publish Date - May 06 , 2025 | 05:10 AM
డీఎస్సీ పరీక్షల నిర్వహణ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, టీచర్ల బదిలీలను పారదర్శకంగా చేపట్టాలని మంత్రి లోకేశ్ ఆదేశించారు. అంబేడ్కర్ విదేశీ విద్య పథకాన్ని తిరిగి ప్రారంభించేందుకు, ప్రభుత్వ గ్రంథాలయాల ప్రక్షాళనకు కూడా సూచనలు చేశారు

పారదర్శకంగా టీచర్ల బదిలీలు
విద్యా శాఖపై మంత్రి లోకేశ్ సమీక్ష
అమరావతి, మే 5(ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సన్మానానికి ఏర్పాట్లు చేయాలన్నారు. విద్యా శాఖపై సమీక్షలో మంత్రి మాట్లాడారు. పారదర్శకంగా టీచర్ల బదిలీలు చేపట్టాలని, విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అంబేడ్కర్ విదేశీ విద్య పథకాన్ని తిరిగి ప్రారంభించేందుకు విధివిధానాలు రూపొందించాలని ఆదేశించారు.
డిగ్రీ కాలేజీల్లో త్రీ మేజర్, సింగిల్ మేజర్ సబ్జెక్టుల విధానం అమలుపై సంబంధిత భాగస్వాముల అభిప్రాయాలు తీసుకోవాలన్నారు. యూనివర్సిటీల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపర్చాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 205 ప్రభుత్వ గ్రంథాలయాలను ప్రక్షాళన చేసి నిరుద్యోగ యువత, ప్రజలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దాలన్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్ల బదిలీలకు మంత్రి అంగీకారం తెలిపారు. ఉన్నతాధికారులు కోన శశిధర్, భరత్ గుప్తా, కృతికా శుక్లా, విజయరామరాజు పాల్గొన్నారు.