Share News

Vijayawada: కొరియర్‌లో ఎండీఎంఏ డ్రగ్స్‌

ABN , Publish Date - Jun 06 , 2025 | 05:45 AM

దేశ రాజధాని ఢిల్లీ నుంచి కొరియర్‌ ద్వారా విజయవాడకు సరఫరా అవుతున్న డ్రగ్‌ వ్యవహారాన్ని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు బట్టబయలు చేశారు. ముగ్గురు యువకులను అరెస్టు చేసి..

Vijayawada: కొరియర్‌లో ఎండీఎంఏ డ్రగ్స్‌

  • ముగ్గురు యువకుల అరెస్టు.. ఢిల్లీ నుంచి వచ్చినట్టుగా గుర్తింపు

విజయవాడ, జూన్‌ 5(ఆంధ్రజ్యోతి): దేశ రాజధాని ఢిల్లీ నుంచి కొరియర్‌ ద్వారా విజయవాడకు సరఫరా అవుతున్న డ్రగ్‌ వ్యవహారాన్ని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు బట్టబయలు చేశారు. ముగ్గురు యువకులను అరెస్టు చేసి, 33 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. అడ్మిన్‌ డీసీపీ కేజీవీ సరిత, సెంట్రల్‌ ఏసీపీ కె.దామోదర్‌, పటమట ఇన్‌స్పెక్టర్‌ వి.పవన్‌కిశోర్‌ గురువారం ఈ కేసు వివరాలను విలేకరులకు వెల్లడించారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం సనత్‌నగర్‌కు చెందిన తిరుమలశెట్టి జీవన్‌కుమార్‌ అలియాస్‌ కిన్ను బీటెక్‌ చదువుకుని ఖాళీ ఉంటున్నాడు. విజయవాడ పటమట ఫన్‌ టైమ్స్‌ క్లబ్‌ వీధికి చెందిన బొంతు నితీ్‌షకుమార్‌ అలియాస్‌ బబ్బు డిగ్రీ పూర్తిచేసి వీసా కన్సల్టెన్సీలో ఉద్యోగం చేస్తున్నాడు. పెనమలూరు మండలం యనమలకుదురుకు చెందిన తూలిమెల్లి తరుణ్‌ప్రసాద్‌ గంగూరులోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ చదువుతున్నాడు. జీవన్‌కుమార్‌, నూజివీడుకు చెందిన మనోహర్‌ అనే యువకుడు ఇంటర్మీడియట్‌ వరకు కలిసి చదువుకున్నారు. తర్వాత మనోహర్‌ ఉత్తరప్రదేశ్‌లోని కాంట్రాక్ట్‌లు చేస్తున్న తన మేనమామ వద్దకు వెళ్లిపోయాడు. అక్కడి నుంచి విజయవాడకు వచ్చినప్పుడు ఎండీఎంఏ డ్రగ్‌ తెచ్చుకునేవాడు. ఆవిధంగా జీవన్‌ డ్రగ్‌ అలవాటు చేసుకున్నాడు. ఇదే క్రమంలో డ్రగ్‌ ఆర్డర్‌ కోసం నోయిడాకు చెందిన రింకు అనే యువకుడ్ని జీవన్‌కు మనోహర్‌ పరిచయం చేశాడు. ఆరు నెలలుగా జీవన్‌ నోయిడా నుంచి ఆర్డర్‌ ఇచ్చి ట్రాక్‌ ఆన్‌, డీటీడీసీ కొరియర్‌ సర్వీసుల ద్వారా డ్రగ్స్‌ను రప్పించుకుంటున్నాడు. ఇందుకోసం హైదరాబాద్‌లో తప్పుడు చిరునామాలు ఇస్తున్నాడు. ఫోన్‌ నంబర్‌ మాత్రం తనదే ఇచ్చాడు. డ్రగ్స్‌ పంపే వ్యక్తి ఎవరికీ అనుమానం రాకుండా గిఫ్ట్‌ప్యాక్‌లా పార్సిల్‌ చేస్తున్నాడు.


కొరియర్‌ సర్వీస్‌ డెలివరీ బాయ్స్‌ ఆ చిరునామాకు వెళ్లి ఫోన్‌ చేయగా విజయవాడ నుంచి జీవన్‌ బయలుదేరి వెళ్లి తీసుకునేవాడు. ఇలా హైదరాబాద్‌ నుంచి తీసుకొచ్చి ఎండీఎంఏను నితీ్‌షకుమార్‌కు ఇచ్చి అమ్మకాలు చేయిస్తున్నాడు. గుంటూరు జిల్లాలో ఉన్న ఓ డీమ్డ్‌ వర్సిటీ, విజయవాడ, కృష్ణా జిల్లాలో ప్రైవేటు ఇంజనీరింగ్‌, డిగ్రీ కళాశాల విద్యార్థులకు గ్రాము రూ.6 వేలకు విక్రయిస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి ఏపీ39ఆర్‌పీ1404, ఏపీ40సీసీ4501 నంబరు గల ద్విచక్రవాహనాలపై ఎండీఎంఏను తీసుకొస్తుండగా రామవరప్పాడు రింగ్‌ వద్ద టాస్క్‌ఫోర్స్‌, పటమట పోలీసులు పట్టుకున్నారు. ఈ ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి 33 గ్రాముల ఎండీఎంఏ, రెండు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - Jun 06 , 2025 | 05:46 AM