Share News

Tourism Growth Plans: ఏడాదంతా పర్యాటక శోభ

ABN , Publish Date - May 06 , 2025 | 05:25 AM

పర్యాటక రంగంలో 20% వృద్ధి సాధించేందుకు సీఎం చంద్రబాబు అధికారులకు సూచనలు ఇచ్చారు. టూరిజం ఫెస్టివల్‌ క్యాలెండర్‌, నైట్‌ సఫారీ, డాల్ఫిన్‌ షోలు, అరకు కాఫీ స్టాల్స్‌ ఏర్పాటు వంటి పలు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు

Tourism Growth Plans: ఏడాదంతా పర్యాటక శోభ

టూరిజం ఫెస్టివల్‌ క్యాలెండర్‌ సిద్ధం చేయాలి

  • నైట్‌ సఫారీ, డాల్ఫిన్‌ షోల ఏర్పాటును పరిశీలించాలి

  • పర్యాటక రంగంలో 20% వృద్ధి సాధించడమే లక్ష్యం

  • రాష్ట్రంలో 150 అరకు కాఫీ స్టాల్స్‌ ఏర్పాటు చేయాలి

  • టూరిజం అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం

అమరావతి, మే 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి పర్యాటక శోభ తీసుకురావాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందేలా, అందరినీ ఆకర్షించేలా ఏడాది పొడవునా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. దీనికోసం టూరిజం ఫెస్టివల్‌ క్యాలెండర్‌ను రూపొందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని పర్యాటక ప్రదేశాల్లోనూ ఆయా ప్రాంతాల ప్రాముఖ్యతను బట్టి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. సోమవారం పర్యాటక రంగంపై సచివాలయంలో టూరిజం అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి ఎంతో ఆస్కారం ఉందన్నారు. ఈ రంగంలో తప్పనిసరిగా 20 శాతం వృద్ధి సాధించాలని నిర్దేశించారు. సింగపూర్‌ తరహాలో రాష్ట్రంలోనూ నైట్‌ సఫారీ గురించి అధ్యయనం చేయాలని, అందమైన సముద్రతీర ప్రాంతాలను గుర్తించి వాటి అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆక్వాకల్చర్‌లో ఏపీ నంబర్‌వన్‌గా ఉన్నా.. దాన్ని ప్రతిబిబించే ప్రాజెక్టులు ఎక్కడా లేవన్నారు. రాష్ట్రంలోనూ డాల్ఫిన్‌ షోలు ఏర్పాటు చేయాలని సూచించారు.


గండికోటకు యునెస్కో వరల్డ్‌ హెరిటేజ్‌ సైట్‌ గుర్తింపు వచ్చేలా కృషి చేయాలన్నారు. ప్రసాద్‌ పథకం కింద సింహాచలం, అన్నవరంలో చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలన్నారు. రాష్ట్రమంతా 150 అరకు కాఫీ స్టాల్స్‌, ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. భవానీ ఐల్యాండ్‌, హోప్‌ ఐల్యాండ్‌ సహా రాష్ట్రంలోని ఐల్యాండ్‌లన్నింటినీ అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించాలని సీఎం చెప్పారు. కాగా.. కొండపల్లి, కూచిపూడి, కడియం, మంగళగిరి, చీరాల, బాపట్ల అరకు ప్రాంతాల్లో మొత్తం 14 చోట్ల ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు పేర్కొనగా.. వాటిని 50 చోట్ల ఏర్పాటు చేయాలని సీఎం నిర్దేశించారు. మరోవైపు రాష్ట్రంలోని 20 ప్రధాన దేవాలయాల్లో టెంపుల్‌ టూరిజాన్ని, అలానే విశాఖ, అమరావతిలో హెల్త్‌ టూరిజాన్ని ప్రమోట్‌ చేయాలని చెప్పారు. అమరావతిని క్రియేటివ్‌ సిటీ హబ్‌గా చేయాలన్నారు.


టెంట్‌ సిటీస్‌..

రాష్ట్రంలో అరకు, గండికోట సహా 6 ప్రాంతాల్లో 180 టెంట్‌లతో టెంట్‌ సిటీస్‌ ఏర్పాటు చేస్తున్నామని, ఇంకా సీ క్రూయిజ్‌, రివర్‌ క్రూయిజ్‌ సర్వీసులు ప్రవేశ పెడుతున్నామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. రాజమండ్రి, విజయవాడ, బెరంపార్క్‌, సూర్యలంకలో పర్యాటకుల కోసం త్వరలోనే హౌస్‌ బోట్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. రూ.76 కోట్లతో రాష్ట్రంలో పర్యాటక రంగానికి చెందిన 15 హోటళ్లు, రిసార్టులను అప్‌గ్రేడ్‌ చేయగా, మరో 15 హోటళ్లు, రిసార్టులను అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. పర్యాటక రంగాన్ని ఆకట్టుకునేందుకు 8 మెగా ఈవెంట్స్‌, 11 నేషనల్‌ ఫెయిర్స్‌, 10 ఇంటర్నేషనల్‌ ఫెయిర్స్‌ నిర్వహిస్తున్నామని అధికారులు సీఎంకు తెలిపారు. కొత్తగా రోప్‌వేల ఏర్పాటుకు అనుకూలంగా ఉన్న 10 ప్రాంతాలను గుర్తించామని చెప్పారు. రూ.12,565 కోట్ల పెట్టుబడితో 8,073 రూముల సామర్థ్యం కలిగిన హోటళ్లు, రిసార్టులకు సంబంధించి మొత్తం 69 ప్రాజెక్టులు చేపట్టేందుకు వివిధ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయని సీఎం అధికారులకు చెప్పారు.


హోమ్‌స్టే పాలసీతో స్థానికులకు జీవనోపాధి

స్థానికులకు జీవనోపాధి, సంస్కృతి పరిరక్షణ, సుస్థిర పర్యాటకాభివృద్ధి లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా గిరిజన, వారసత్వ, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 500కి పైగా హోమ్‌ స్టేలు గుర్తించామని అధికారులు సీఎంకు తెలిపారు. వంతమూరు, మగడ, కూరిడి, తజంగి వంటి అరకు గిరిజన ప్రాంతాల్లోనూ హోమ్‌స్టేలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. తిరుపతిలో ఇప్పటికే ఉన్న 600కు పైగా హోమ్‌స్టేలను ప్రముఖ సంస్థలైన ఎయిర్‌బీఎన్‌బీ, యాత్రధామ్‌, హోమ్‌స్టేస్‌ ఆఫ్‌ ఇండియా, మేక్‌ మై ట్రిప్‌ తదితర భాగస్వాముల సహకారంతో అప్‌గ్రేడ్‌ చేస్తున్నామన్నారు. దీని కోసం ప్రత్యేకంగా హోమ్‌ స్టే పాలసీ రూపొందించాలని సీఎం అధికారులకు సూచించారు.

Updated Date - May 06 , 2025 | 05:25 AM