Gangamma: గంగమ్మకు వెంకన్న సారె
ABN , Publish Date - May 11 , 2025 | 01:22 AM
గంగ జాతరను పురస్కరించుకుని వేంకటేశ్వరస్వామి చెల్లెలుగా ప్రసిద్ధికెక్కిన తాతయ్యగుంట గంగమ్మకు టీటీడీ ఆనవాయితీగా అందజేసే మేల్చాట్, పసుపు, కుంకుమ (సారె) శనివారం సాయంత్రం ఆలయానికి చేరుకుంది.

తిరుపతి, మే 10 (ఆంధ్రజ్యోతి) : గంగ జాతరను పురస్కరించుకుని వేంకటేశ్వరస్వామి చెల్లెలుగా ప్రసిద్ధికెక్కిన తాతయ్యగుంట గంగమ్మకు టీటీడీ ఆనవాయితీగా అందజేసే మేల్చాట్, పసుపు, కుంకుమ (సారె) శనివారం సాయంత్రం ఆలయానికి చేరుకుంది. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు సాయంత్రం 4గంటలకు స్థానిక గోవిందరాజ స్వామి ఆలయం వద్ద ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు అందజేశారు. అక్కడి నుంచి కర్నాలవీధి, గాంధీరోడ్డు, బండ్ల వీధి, పెద్దకాపు వీధి మీదుగా అమ్మవారి సారె ఊరేగింపుగా గంగమ్మ ఆలయానికి చేరుకుంది. ఊరేగింపు ముందు కళాకారుల ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకన్నాయి. పలువురు లయబద్ధంగా నాట్యం చేస్తూ ఊరేగింపునకు జాతర కళను తెచ్చిపెట్టారు. ఎమ్మెల్యే కుమారుడు ఆరణి మదన్, అన్న కుమారుడు శివలు నృత్యం చేసి సందడి చేశారు. కాగా, శనివారం భక్తులు దొరవేషంలో అమ్మవారిని దర్శించుకున్నారు. కైకాల కులస్థులు దొర వేషాన్ని, చాకలి కులస్థులు మంత్రి వేషాన్ని వేశారు.
నేడు మాతంగి వేషం
గంగజాతర ఉత్సవాలలో భాగంగా ఆదివారం మాతంగి వేషాన్ని భక్తులు ధరిస్తారు. తలకు పసుపుగుడ్డను జడలా కట్టి కొప్పుముడివేసి దానికి మల్లెపూలను చుట్టుకుంటారు. ఽశరీరమంతా గంధం పూసుకుని తెల్ల చీర, లేదా పసుపు చీర కట్టుకుని రవిక తొడుక్కుంటారు. మెడలో పూలహారం వేసుకుంటారు. ఒడిబాల కట్టుకుని అందులో అక్షింతలు, దువ్వెన, భరిణి, రవిక, పసుపు, కుంకుమలు పెట్టుకుంటారు. మాతంగి వెయ్యికళ్ల దేవతని ముఖానికి, ఒళ్లంతా నల్లని ఎర్రని బొట్లు పెట్టుకుంటారు. పలకలు వాయిస్తూ, కొమ్ములు ఊదుతూ ఉంటే మాతంగి వేషగాళ్లు లయబద్ధంగా చిందులు వేస్తూ వచ్చి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు.
గంగమ్మకు వజ్రపు తిలకం బహూకరణ
తాతయ్యగుంట గంగమ్మకు మంత్ర మహేశ్వరి శ్రీశక్తి పీఠాధీశ్వరి రమ్యానంద భారతి వజ్రపు తిలకాన్ని బహూకరించారు. శనివారం సారె సమర్పించిన ఆమె రూ.2లక్షల విలువైన వజ్రపు తిలకాన్ని ఈవో జయకుమార్కు అందజేశారు.