TTD: కాలినడక భక్తుల భద్రతపై టీటీడీ మరో ముందడుగు
ABN , Publish Date - May 30 , 2025 | 12:50 AM
తిరుమల శ్రీవారి దర్శనార్థం కాలినడకన వచ్చే భక్తుల భద్రతపై టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది.

మంగళం, మే 29 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి దర్శనార్థం కాలినడకన వచ్చే భక్తుల భద్రతపై టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అలిపిరి- తిరుమల నడక మార్గంలోని ఏడో మైలు సమీప ప్రాంతాల్లో చిరుతలు, ఎలుగుబంట్ల సంచారం ఎక్కువగా ఉందని గుర్తించింది. అందుకని ఇక్కడే శాశ్వత ప్రతిపాదికన కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటుకు సిద్ధమైంది. గతంలో అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే ఈ నడకమార్గంలో భక్తులపై చిరుతలు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ఒక చిన్నారి తీవ్రంగా గాయపడగా, లక్షిత అనే బాలిక ప్రాణాలు కోల్పోయింది. అప్పట్లో కాలినడకన వెళ్లే భక్తులకు టీటీడీ కర్రలూ అందించింది. సాయంత్రం 6గంటల పైన నడకమార్గాన్ని మూసివేసింది. బోన్లు ఏర్పాటు చేసి నడకదారికి సమీపంలో వచ్చే చిరుతలను బంధించి కొన్నింటిని సుదూర అటవీప్రాంతాల్లో వదిలిపెట్టగా, మరికొన్నింటిని ఎస్వీ జూపార్కుకు తరలించారు. అటవీశాఖ ఆధ్వర్యంలో 26 సోలార్ లైవ్ కెమెరాలనూ ఆ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ఈ కెమెరాల్లో చిరుత, దాని పిల్ల చిక్కాయి. మరో కెమెరాలో రెండు పిల్లలతో ఉన్న ఎలుగుబంటి దృశ్యం రికార్డు అయింది. ఈ ప్రాంతంలో తరచూ ఎలుగుబంట్లు, చిరుతలు రాత్రి వేళలో ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే కమాండ్ కంట్రోల్రూమ్ను ఏడో మైలు వద్ద ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
కంట్రోల్ రూమ్లోనే మానిటర్, రెస్క్యూటీం
ఇప్పటి వరకు నడక మార్గంలో రెస్క్యూటీంగా కొందరు ఉంటున్నారు. ఎక్కడైనా చిరుత, ఎలుగుబంట్లు ఉన్నట్లుగాని, నడక మార్గానికి దగ్గరగా వచ్చినట్లు గానీ తిరుపతిలోని బయోట్రిమ్ కార్యాలయానికి అందే సమాచారంతో వీరు అక్కడికి చేరుకుని వాటిని అడవిలోకి తరిమేలా చర్యలు తీసుకునేవారు.
ఇప్పుడు కంట్రోల్ రూమ్ ఏర్పాటైతే ప్రభుత్వ అటవీశాఖలోని ఇద్దరు బయాలజిస్టులు, పదిమంది సిబ్బంది, టీటీడీ అటవీశాఖ, విజిలెన్సు సిబ్బంది దాదాపు 30మంది ఇక్కడే ఉంటారు. కంట్రోల్ రూమ్లోని మానిటర్లో ఉన్న కెమెరాల ద్వారా వన్యప్రాణుల కదలికలను వీరు ఎప్పటికప్పుడు గమనిస్తూ చర్యలు తీసుకుంటారు. గతంలో ఇక్కడ ఎలివేటెడ్ పాస్ ఏర్పాటు చేస్తే మంచిదన్న నిపుణుల అభిప్రాయాలను మాత్రం ప్రస్తుతానికి టీటీడీ పక్కన పెట్టిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.