Teachers: టీచర్ల బదిలీలకు శ్రీకారం..!
ABN , Publish Date - May 21 , 2025 | 01:20 AM
టీచర్ల బదిలీలకు ప్రభుత్వం బుధవారం శ్రీకారం చుట్టనుంది.విద్యాశాఖ రాష్ట్రస్థాయి అధికారులు మంగళవారం డీఈవోలకు వెబెక్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు.

చిత్తూరు సెంట్రల్, మే20(ఆంధ్రజ్యోతి): టీచర్ల బదిలీలకు ప్రభుత్వం బుధవారం శ్రీకారం చుట్టనుంది.విద్యాశాఖ రాష్ట్రస్థాయి అధికారులు మంగళవారం డీఈవోలకు వెబెక్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. జిల్లా నుంచి డీఈవో వరలక్ష్మి, ఏడీలు సుకుమార్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రాతిపదికన చేపట్టే ఈ బదిలీలకు బుధవారం ట్రాన్స్ఫర్ పోర్టల్ తెరచుకోనుండగా, ప్రక్రియ జూన్ 5 నాటి కి పూర్తి చేయనున్నారు. ప్రభుత్వ పాఠశాలల హెచ్ఎంలు, ఎస్ఏలకు వెబ్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు చేపట్టనుండగా, ఎస్జీటీలకు మాన్యువల్గా నిర్వహించే వీలుంది.ఈ నెలాఖరుకు రెండు సంవత్సరాలు ఒకే చోట పనిచేసిన హెచ్ఎంలు బుధవారం సాయంత్రం 5గంటల్లోపు బదిలీ పోర్టల్లో అప్లై చేయాల్సి ఉంది. స్టడీ లీవ్, సర్ప్లస్ ఉపాధ్యాయులు సైతం బుధవారమే అప్లై చేసుకోవాలి. ప్రిఫరెన్షియల్ కేటగిరిలోని టీచర్లు మెడికల్ బోర్డు వెరిఫికేషన్కు బుధవారంతో గడువు పూర్తి కానుంది. బదిలీల్లోని సమస్యల పరిష్కారం కోసం మండల స్థాయిలో కంట్రోల్ రూం ఏర్పాటు చేయనున్నారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 4916 పాఠశాలలున్నాయి. వీటిలో 3766 ప్రాథమిక, 445 ప్రాథమికోన్నత, 705 ఉన్నత పాఠశాలలు.17,372 మంది టీచర్లకు గాను 15,454 పనిచేస్తున్నారు. 37 విభాగాల్లో 1918 పోస్టులను క్లియర్ వేకెన్సీలుగా చూపించగా, మరో 5082 ఖాళీలుగా చూపించారు. ఒకే పాఠశాలలో ఐదు సంవత్సరాలు పూర్తి చేసిన హెచ్ఎంలు, 8 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు తప్పనిసరిగా బదిలీ కానున్న నేపథ్యంలో 5/8 ఏళ్లు ఒకే చోట పనిచేసిన టీచర్ల ఖాళీలు 3 వేలు చూపగా, మిగులు, (సర్ప్లస్) కింద 500, స్కూల్ కొత్త పోస్టులు (రీఅపోర్షన్), ఒక యాజమాన్య పాఠశాల నుంచి మరో యాజమాన్య పాఠశాలల్లో నెలకొన్న (షిఫ్టెడ్) ఖాళీలు 1582 చూపుతున్నారు.
ఖాళీల వివరాలు
యాజమాన్యం ఖాళీలు
ప్రభుత్వ 125
ఎంపీ/జడ్పీ 1583
మున్సిపల్ కార్పొరేషన్ 135
మున్సిపాలిటీ 75
5/8యేళ్లు ఒకే చోట పనిచేసిన స్థానాలు 3000
మిగులు ఖాళీలు 500
రీఅపోర్షన్/షిఫ్టెడ్ 1582
మొత్తం 7000