Awards: ‘షైనింగ్ స్టార్స్’ అవార్డులు
ABN , Publish Date - Jun 10 , 2025 | 02:34 AM
విద్యార్థుల్లోని ప్రతిభకు పట్టం కట్టేందుకే షైనింగ్ స్టార్స్ అవార్డులను ప్రదానం చేస్తున్నట్లు జిల్లా ఇంచార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు.

ప్రశంసాపత్రం, పతకం, రూ.20 వేల నగదు బహూకరణ
తిరుపతి(విద్య), జూన్ 9 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల్లోని ప్రతిభకు పట్టం కట్టేందుకే షైనింగ్ స్టార్స్ అవార్డులను ప్రదానం చేస్తున్నట్లు జిల్లా ఇంచార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. తిరుపతి మహతి ఆడిటోరియంలో జిల్లా విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో సోమవారం జరిగిన షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యారంగంలో దేశంలోనే మూడో స్థానం నుంచి గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం 19వ స్థానానికి పడిపోయిందని ఆందోళన వ్యక్తంచేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సీఎం చంద్రబాబునాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కేజీ నుంచి పీజీ వరకు విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ విద్యారంగ అభివృద్ధికి ప్రణాళికాబద్దంగా కృషి చేస్తున్నారన్నారు. తిరుపతి, సత్యవేడు ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, ఆదిమూలం మాట్లాడుతూ.. పేదరికం రూపుమాపాలన్నా రాష్ట్రం అభివృద్ధి సాధించాలన్నా విద్యతోనే సాధ్యమని, అందుకే ఆ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్గా తీర్చిదిద్దే క్రమంలోనే ప్రతిభావంతులకు షైనింగ్ స్టార్స్ అవార్డులు ఇస్తున్నారని ఏపీజీబీసీ చైర్పర్సన్ సుగుణమ్మ, హస్తకళల కార్పొరేషన్ పసుపులేటి హరిప్రసాద్, యాదవ కార్పొరేషన్ ఛైర్మన్ నరసింహయాదవ్, నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ రుద్రకోటి సదాశివం అన్నారు. అనంతరం చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తదితరులతో కలిసి మంత్రి అనగాని సత్యప్రసాద్ షైనింగ్ స్టార్స్ అవార్డులను ప్రదానం చేశారు. జిల్లాలో ఈ 2024-25లో అత్యుత్తమ మార్కులు సాధించిన పదో తరగతిలో 207 మంది, ఇంటర్లో 40 మంది విద్యార్థులకు.. ఒక్కొక్కరికి రూ.20 వేల చెక్కు, మెడల్, ప్రశంసా పత్రాన్ని అందజేసి అభినందించారు.
ఇంకా బాగా చదవాలనిపిస్తోంది : షేవిత
నేను ఎర్రావారి పాళెం జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివా. 591 మార్కులతో ప్రభుత్వ పాఠశాలల్లో రాష్ట్రంలో రెండో ర్యాంకును సాధించాను. మంచి మార్కులు సాధించిన విద్యార్థులను షైనింగ్ స్టార్స్గా పరిగణిండం, ఇలాంటి వేదికపై అవార్డులు ఇచ్చి ప్రోత్సహించడంతో మరింత మంచిగా చదవాలనిపిస్తోంది.
పేద విద్యార్థులకు ఎంతో ప్రయోజనం : తుపాకుల శ్రీజ
పుత్తూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివిన నాకు 962 మార్కులు వచ్చాయి. ఇలా మంచి మార్కులు వచ్చిన వారిని ప్రైవేటు కళాశాలల్లోనే ప్రోత్సహించేవారు. ఇప్పుడు షైనింగ్ స్టార్స్ పేరిట ప్రభుత్వ కళాశాలల్లో ప్రతిభావంతులైన విద్యార్థులకు రూ.20 వేల చొప్పున ఇవ్వడం నాలాంటి పేదలకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. మాలాంటి విద్యార్థులను ప్రోత్సహిస్తున్న విద్యాశాఖ మంత్రి నారా లోకశ్కు థ్యాంక్స్. బాగా చదువుకుని స్థిరపడ్డాక నేనూ ఇలా ఇతరులకు ప్రోత్సాహం అందిస్తా.