Share News

TTD: టీటీడీ సీవీఎస్వోగా మురళీకృష్ణ

ABN , Publish Date - May 21 , 2025 | 01:34 AM

తిరుమలలో తరచూ భద్రతా వైఫల్యాలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో నాలుగు నెలలు ఆలస్యంగానైనా ప్రభుత్వం టీటీడీకి రెగ్యులర్‌ సీవీఎస్వోను నియమించింది. విశాఖపట్నంలో ఏపీఎస్పీ 16వ బెటాలియన్‌ కమాండెంట్‌గా పనిచేస్తున్న మురళీకృష్ణను టీటీడీ చీఫ్‌ విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌గా బదిలీ చేసింది.

TTD: టీటీడీ సీవీఎస్వోగా మురళీకృష్ణ
మురళీకృష్ణ

తరచూ వైఫల్యాలతో ఆందోళన

తిరుపతి, ఆంధ్రజ్యోతి: టీటీడీకి సంబంధించి అలిపిరి టోల్‌గేటు మొదలుకుని, తిరుమల దాకా తరచూ ఎక్కడో ఒక చోట ఏదో విధంగా భద్రతా వైఫల్యం వెలుగు చూస్తూనే ఉంటోంది. ఈ ఏడాది జనవరి 8వ తేదీన తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు భక్తులు మరణించడం, సుమారు 40 మంది దాకా గాయపడడం తెలిసిందే. టీటీడీని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కుదిపేసిన ఈ ఘటనకు టీటీడీ సీవీఎస్వో శ్రీధర్‌ను, తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడిని బాధ్యులుగా పరిగణించి ప్రభుత్వం వారిద్దరినీ తక్షణం బదిలీ చేసింది. ఇతర టీటీడీ అధికారులపైనా బదిలీ వేటు పడినా భద్రతాపరంగా ఆ ఇద్దరు ఐపీఎస్‌ అధికారులనే ప్రభుత్వం బాధ్యులుగా పరిగణించింది. చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలును టీటీడీ సీవీఎస్వోగా పూర్తి అదనపు బాధ్యతలతో నియమించింది. చిత్తూరులో ఎస్పీగా పనిచేస్తూ టీటీడీ సీవీఎస్వోగా పనిచేయడం ఇబ్బందిగా మారడంతో గత మార్చి 12న చిత్తూరు ఎస్పీ స్థానంలో తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్‌ రాజును ఎఫ్‌ఏసీ సీవీఎస్వోగా నియమించింది ప్రభుత్వం. తిరుపతి ఎస్పీగా అధిక సమయం ప్రొటోకాల్‌ డ్యూటీలకు కేటాయించాల్సిన అధికారికి టీటీడీ సీవీఎస్వో బాధ్యతలు అప్పగించడం విమర్శలకు దారి తీసింది.

పెరిగిన ‘ఉగ్ర’ముప్పు : ఇటీవల పాకిస్థాన్‌తో యుద్ధ వాతావరణం నెలకొని ఉద్రిక్తతలు తలెత్తిన నేపథ్యంలో తిరుమలకు ఇస్లామిక్‌ ఉగ్రవాదులతో ముప్పు పెరిగిందన్న కేంద్ర నిఘా సంస్థలు హెచ్చరికలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. తిరుమలలో ఆక్టోపస్‌ బలగాలు కొండపైన, తిరుపతిలోనూ మాక్‌ డ్రిల్‌ నిర్వహించాయి. అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో కూడా భద్రత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఏర్పడింది. డ్రోన్‌లతో ముప్పు పెరిగినందున యాంటీ డ్రోన్‌ వ్యవస్థను ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో పడింది టీటీడీ. ఇలాంటి పరిస్థితుల్లో టీటీడీకి పూర్తిస్థాయి సీవీఎస్వో లేకపోవడం విమర్శలకు దారి తీసింది.

రెండేళ్లుగా భద్రతా వైఫల్యాలు

ఈ ఏడాది జరిగిన తొక్కిసలాట ఘటనే కాకుండా అలిపిరి టోల్‌గేటు వద్ద, తిరుమలలోనూ గత రెండేళ్ళుగా తరచూ భద్రతా వైఫల్యాలు సంభవిస్తున్నాయి.

2023 జనవరిలో సర్వే కోసం తిరుమలకు వచ్చిన ఓ సంస్థ సిబ్బంది ఆలయంపై డ్రోన్‌ ఎగురేసి ఆ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్టుచేశారు.

2023 మేలో ఓ యువకుడు ఏకంగా శ్రీవారి ఆలయంలోకి మొబైల్‌ ఫోన్‌ తీసుకెళ్లి ఆనంద నిలయాన్ని వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టారు. ఫ 2024 జనవరిలో అస్సోం నుంచీ వచ్చిన ఓ జంట తిరుమల ఘాట్‌ రోడ్డులో డ్రోన్‌ ఎగురేసింది.

ఈ ఏడాది జనవరి 17న కడపవాసులు ఎగ్‌ బిరియానీ తిరుమలకు తెచ్చి బహిరంగంగా తిన్న ఘటన కలకలం రేపింది.

ఇటీవల అటవీశాఖకు చెందిన వ్యక్తులు టీటీడీ అనుమతి లేకుండా టోల్‌గేట్‌లో భద్రతా సిబ్బందికి కూడా తెలియకుండా పడవలనే తిరుమలకు తీసుకెళ్ళి పాపవినాశనం రిజర్వాయర్‌లో బోటింగ్‌ ట్రయల్స్‌ కూడా నడిపారు.

బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్‌ స్వామీజీలతో కలసి తిరుమలలో ధర్నా చేయడం కలకలం రేపింది.

గత నెల 15న రాజస్థాన్‌కు చెందిన యూట్యూబర్‌ అనుష్మాన్‌ తరేజా శ్రీవారి ఆలయంపై పది నిమిషాల పాటు డ్రోన్‌ ఎగరేసి వీడియో చిత్రీకరించారు. అలిపిరి టోల్‌గేట్‌లో భద్రతా సిబ్బంది తనిఖీల సందర్భంగా డ్రోన్లను గుర్తించకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

ఈ ఏడాది మార్చి 31న రంజాన్‌ రోజు తిరుపతి సింగాలగుంటకు చెందిన అజ్మత్‌ ఖాన్‌ (35) అలిపిరి టోల్‌గేటులో వీఐపీ లైన్‌లో బైక్‌ మీద భద్రతా సిబ్బంది ఆపినా ఆగకుండా తిరుమలకు దూసుకెళ్ళిన ఘటన కలకలం రేపింది. అతడిని తిరుమల జీఎన్‌సీ టోల్‌గేటు వద్ద సిబ్బంది అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అతడి మానసిక పరిస్థితి బాగాలేదని పోలీసులు విచారణలో తేల్చిన సంగతి పక్కన పెడితే అదే వ్యక్తి ఉగ్రవాది అయి ఉంటే అన్న ప్రశ్నకు టీటీడీ అధికారుల వద్ద ఎలాంటి సమాధానం లేదు.

శ్రీవారి సేవకు బదిలీ సంతోషదాయకం: మురళీకృష్ణ

టీటీడీ సీవీఎస్వో పోస్టుకు బదిలీ కావడమంటే శ్రీవారి సేవకు నోచుకోవడమేనని, ఆ అవకాశం రావడం సంతోషదాయకంగా ఉందని మురళీకృష్ణ అన్నారు. మంగళవారం రాత్రి ఆయన్ను ‘ఆంధ్రజ్యోతి’ ఫోన్‌లో పలకరించగా టీటీడీ సీవీఎస్వోగా బదిలీ రావడం శ్రీవారి ఆశీస్సులతోనేనన్నారు. గతంలో తిరుపతి, తిరుమలలో వివిధ హోదాల్లో పనిచేసి ఉన్నందున అక్కడి పరిస్థితుల పట్ల అవగాహన వుందన్నారు. భక్తుల భద్రతకు, టీటీడీ భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రస్తుతం శాఖాపరమైన శిక్షణలో వున్నానని, రెండు రోజుల్లో అది ముగించుకుని టీటీడీ సీవీఎస్వోగా బాధ్యతలు తీసుకుంటానన్నారు.


అనుభవం, కాఠిన్యం కలగలసిన అధికారి కావాలని..

టీటీడీ, తిరుమల వ్యవహారాల పట్ల అనుభవం కలిగివుండడంతో పాటు కఠినంగా వ్యవహరించగలిగిన అధికారిని సీవీఎస్వోగా నియమించాలని ప్రభు త్వం భావించింది.ఆ కోణంలో పరిశీలించిన ప్రభు త్వం విశాఖపట్నంలో ఏపీఎస్పీ 16వ బెటాలియన్‌ కమాండెంట్‌గా పనిచేస్తున్న మురళీకృష్ణను టీటీడీ సీవీఎస్వోగా నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖకు చెందిన ఆయన 2011లో గ్రూప్స్‌ ద్వారా డీఎస్పీగా ఎంపికయ్యారు. డీఎస్పీగా తిరుపతి, తిరుమలలో పనిచేశారు. తిరుమలలో అదనపు ఎస్పీగా కూడా పనిచేశారు. అలాగే తిరుమలలో పనిచేస్తుండగానే ఎస్పీగా పదోన్నతి పొంది మూడు నెలల పాటు అక్కడే కొనసాగారు. తిరుపతిలో రీజనల్‌ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్‌గానూ పనిచేశారు. తిరుపతి, తిరుమల, టీటీడీ వ్యవహారాల పట్ల తగినంత అనుభవం వుంది.దానితో పాటు విధి నిర్వహణలో కఠినంగా వ్యవహరిస్తారన్న పేరుంది. వీటన్నింటికీ మించి శ్రీవారి పట్ల అపరిమిత భక్తిప్రపత్తులు ఉన్నాయి. వీటన్నింటినీ దృష్టిలో వుంచుకుని ప్రభుత్వం టీటీడీ సీవీఎస్వోగా మురళీకృష్ణను ఎంపిక చేసినట్టు భావించాల్సి వస్తోంది.

Updated Date - May 21 , 2025 | 01:34 AM