ABN: జీవకోన సమగ్రాభివృద్ధికి చర్యలు
ABN , Publish Date - May 21 , 2025 | 01:41 AM
తిరుపతి నగరం జీవకోన సమగ్రాభివృద్ధిపై ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేక దృష్టిపెట్టింది. ‘అక్షరం అండగా.. సమస్యల పరిష్కారమే అజెండాగా’ తిరుపతిలోని జీవకోనలో మూడు నెలల కిందట ఆంధ్రజ్యోతి ఏర్పాటు చేసిన సదస్సులో ప్రజలు లేవనెత్తిన సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కమిషనర్ మౌర్య, ఎస్పీ హర్షవర్ధన్రాజు ప్రత్యేక చొరవ చూపెట్టారు.

రేపు ‘ఆంధ్రజ్యోతి’ విజయోత్సవ సభలో మరికొన్నింటికి భూమిపూజ, ప్రారంభం కానున్న అవుట్ పోస్ట్
తిరుపతి, మే 20 (ఆంధ్రజ్యోతి): తిరుపతి నగరం జీవకోన సమగ్రాభివృద్ధిపై ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేక దృష్టిపెట్టింది. ‘అక్షరం అండగా.. సమస్యల పరిష్కారమే అజెండాగా’ తిరుపతిలోని జీవకోనలో మూడు నెలల కిందట ఆంధ్రజ్యోతి ఏర్పాటు చేసిన సదస్సులో ప్రజలు లేవనెత్తిన సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కమిషనర్ మౌర్య, ఎస్పీ హర్షవర్ధన్రాజు ప్రత్యేక చొరవ చూపెట్టారు. ఎమ్మెల్యే తన సొంత నిధులతో రెండు ఆర్వో వాటర్ ప్లాంట్లు ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. మున్సిపల్ కార్పొరేషన్ అఽధ్వర్యంలో దాదాపు రూ.50 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైన్లు పూర్తిచేశారు. మరో రూ.50 లక్షలతో శ్మశాన వాటికకు ప్రహరీ, సీసీ రోడ్డు, డ్రైన్లు, రోడ్డు ప్యాచ్ వర్క్స్ వంటి పనులు ప్రారంభించనున్నారు. జీవకోనలో గురువారం ఆంధ్రజ్యోతి నిర్వహించే విజయోత్సవ సభలో అభివృద్ధి పనులకు భూమిపూజ చేయనున్నారు. అదేవిధంగా ఎస్పీ హర్షవర్ధన్రాజు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పోలీస్ అవుట్ పోస్టును కూడా ప్రారంభించనున్నారు. తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా)నిధులతో లెప్రసీ కాలనీలో రోడ్డు వేయనున్నట్టు మౌర్య చెప్పారు. రూ.35లక్షలతో రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు ఆమె ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధికి చెప్పారు.
కమిషనర్ పర్యటన
జీవకోనలో జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ పరిధిలోని జీవకోన, రాజీవ్గాంధీ కాలనీ తదితర ప్రాంతాల్లో అభివృద్ధి పనులతో పాటు పారిశుధ్య పనులను ఇంజినీరింగ్, హెల్త్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ అధికారులతో కలసి మంగళవారం ఆమె పరిశీలించారు. జీవకోన వంటి ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన అన్ని అభివృద్ధి పనులు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.
ఇంటింటి చెత్త సేకరణ పక్కాగా చేయాలని, ఎక్కడా చెత్తకుప్పలు లేకుండా పారిశుధ్య పనులు చేపట్టాలన్నారు. డ్రెయినేజీ కాలువలు శుభ్రం చేయాలని అధికారులను ఆదేశించారు. చెత్త తొలగించడం, కాలువలు శుభ్రం చేయడం వంటివి ప్రణాళికాబద్దంగా చేపట్టాలని ఆదేశించారు. కమిషనర్ వెంట ఎస్ఈ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్ గోమతి, తుడా ఈఈ రవీంద్ర, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ అధికారి రవి తదితరులున్నారు.