Share News

TTD: త్వరలోనే మంచి ఫలితాలు వస్తాయి

ABN , Publish Date - May 21 , 2025 | 01:30 AM

‘టీటీడీ గోశాలలో ప్రతినెలా 14వరకు గోవులు చనిపోతున్నాయని ఇప్పటికే గుర్తించాం. వంద గోవులు ఆసాధారణంగా చనిపోయాయంటూ చేసిన ప్రచారంలో వాస్తవాలు లేవు. త్వరలో మంచి ఫలితాలను అందరూ చూస్తారు’ అని టీటీడీ ఈవో శ్యామలరావు అన్నారు.

TTD: త్వరలోనే మంచి ఫలితాలు వస్తాయి
బోర్డు సమావేశంలో పాల్గొన్న టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు, ఈవో, సభ్యులు

తిరుమల, మే20(ఆంధ్రజ్యోతి): ‘టీటీడీ గోశాలలో ప్రతినెలా 14వరకు గోవులు చనిపోతున్నాయని ఇప్పటికే గుర్తించాం. వంద గోవులు ఆసాధారణంగా చనిపోయాయంటూ చేసిన ప్రచారంలో వాస్తవాలు లేవు. గో మరణాలను తగ్గించేందుకు ప్రత్యేక దృష్టిసారించి ఇప్పటికే చర్యలు తీసుకున్నాం. త్వరలో మంచి ఫలితాలను అందరూ చూస్తారు. గతానికంటే గో పరిరక్షణ మెరుగ్గా మారుస్తాం’ అని టీటీడీ ఈవో శ్యామలరావు అన్నారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం ధర్మకర్తల మండలి సమావేశం ముగిశాక.. ఆ నిర్ణయాలను అదనపు ఈవో వెంకయ్య చౌదరి, సభ్యులు భానుప్రకా్‌షరెడ్డి, శాంతారాం, ఆనంద్‌సాయితో కలిసి మీడియాకు ఈవో వెల్లడించారు.ఏఐ టెక్నాలజీ ద్వారా త్వరితగతిన దర్శనం కల్పనపై గూగుల్‌తో ఎంవోయూ పూర్తయిందన్నారు. టీసీఎస్‌ కూడా స్టడీ చేస్తోందన్నారు. గతంలో అంతా మ్యానువల్‌గా జరిగిందని, ఏఐ వినియోగించాలంటే డేటా అవసరమన్నారు. కొంత టెక్నాలజీ ఉపయోగించి గత పది నెలలుగా డేటాను స్టోర్‌ చేస్తూ వస్తున్నామన్నారు. ఇదో పెద్ద ఛాలెంజ్‌ అన్నారు. ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియను త్వరలో పూర్తిచేస్తామన్నారు. రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌కు సంబంధించి కొన్ని నిర్ణయాలు ఉన్నాయని, దీంతో ఏకాభిప్రాయం కుదరలేదన్నారు. లీగల్‌గా కూడా కొన్ని ఇబ్బందులు ఉన్న క్రమంలో ప్రభుత్వానికి నివేదించామన్నారు. ప్రభుత్వం నుంచి సూచనలు వచ్చిన తర్వాత ప్రమోషన్ల ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు. ఇక, గత ప్రభుత్వంలో తులాభారంలో అక్రమాలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలపై సీవీఎస్వో విచారణ ప్రారంభించారన్నారు. అలిపిరి కాలినడకమార్గంలో దివ్యదర్శన టోకెన్ల జారీపై పరిశీలిస్తున్నట్లు తెలిపారు. గతంలో స్లాటెడ్‌ సర్వదర్శనం(ఎ్‌సఎ్‌సడీ) లేకపోవడంతో రెండు కాలినడకమార్గాల్లో దివ్యదర్శన టోకెన్లు ఇచ్చేవారిని, ప్రస్తుతం ఎస్‌ఎ్‌సడీ ఇస్తున్న క్రమంలో అలిపిరిలో టోకెన్లు ఇవ్వడం సమస్యగా మారిందన్నారు. ఇక, శ్రీవారిమెట్టు మార్గంలోని టోకెన్ల జారీలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, కొందరు ఆటోవాళ్లు భక్తులను ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు గుర్తించామన్నారు. రానున్న పదిరోజుల్లో దీనిపై శాశ్విత పరిష్కారాన్ని అమలుచేస్తామన్నారు. తిరుమలలో మఠాల ఆక్రమణలపై స్టడీ చేస్తున్నట్లు ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. తిరుమలలోని విశ్రాంతి భవనాలకు ఆధ్యాత్మిక పేర్లు ఉండేలా టీటీడీ 75 పేర్లను సూచించిన క్రమంలో 42 భవనాలకు దాతలే పేర్లు మార్చుకున్నారని, మరో రెండింటి పేర్ల మార్పిడి జరగాల్సి ఉందన్నారు. ఇండియన్‌ ఆర్మీకి చెందిన సైనిక్‌ నివాస్‌ పేరు మార్పు విషయంలో చర్చిస్తున్నామన్నారు.

గ్లోబల్‌ లెవల్‌ ఇన్‌స్టిట్యూట్‌గా స్విమ్స్‌

రాయలసీమకే తలమానికంగా ఉంటూ పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న స్విమ్స్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని ‘గ్లోబల్‌ లెవల్‌ ఇన్‌స్టిట్యూట్‌’గా మార్చే లక్ష్యంతో ఉన్నామని టీటీడీ శ్యామలరావు అన్నారు. ఏటా స్విమ్స్‌కు టీటీడీ రూ.60 కోట్ల గ్రాంట్‌, వివిధ రూపాల్లో రూ.వంద కోట్లకుపైగా ఆర్థిక సాయం చేస్తోందని వివరించారు. లక్షలాది మందికి వైద్య సేవలు అందిస్తున్న స్విమ్స్‌ను ఇంకా ఎలా మెరుగుపరచాలనే అంశంపై గతంలో నియమించిన డాక్టర్‌ ఐవీ సుబ్బారావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను టీటీడీ బోర్డు ఆమోదించినట్లు చెప్పారు. ఈ క్రమంలో ఖాళీగా ఉన్న వంద మంది ఫ్యాకల్టీ, 434 నర్సులు, 15 పారామెడికల్‌ స్టాఫ్‌, 48 మంది పరిపాలన విభాగ సిబ్బంది పోస్టుల నియామకానికి తీర్మానం చేశామన్నారు. శ్రీవారివైద్య సేవ కింద అనేక మంది డాక్టర్లు ముందుకు వచ్చి సేవలందిస్తున్నారన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు గైడ్‌గా వ్యవహరించేందుకు ‘వలంటీయర్‌ సేవ’ను కూడా ప్రారంభించామన్నారు.


మరికొన్ని నిర్ణయాలు

తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, అమరావతి శ్రీవారి ఆలయం, నారాయణవనం కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం, కపిలేశ్వరస్వామి ఆలయం, నాగలాపురం వేదనారాయణస్వామి ఆలయం, ఒంటిమిట్ట రామాలయం అభివృద్దికోసం బృహత్‌ ప్రణాళిక తయారు చేసేందుకు ఆర్కిటెక్ట్‌ల నుంచి సాంకేతిక, ఆర్థిక ప్రతిపాదనలు స్వీకరించాలని నిర్ణయం. ఫ ఆకాశగంగ, పాపవినాశనం ప్రాంతాల్లో ఆధ్యాత్మిక, పర్యావరణ, మౌలిక సదుపాయాలను మరింత పెంచేందుకు ప్రణాళిక రూపొందించాలని నిర్ణయం.

Updated Date - May 21 , 2025 | 01:30 AM