Town Bank: తిరుపతి టౌన్ బ్యాంకులో గందరగోళం
ABN , Publish Date - Aug 03 , 2025 | 01:31 AM
తిరుపతి కోఆపరేటివ్ బ్యాంకు (టౌన్ బ్యాంక్) కార్యకలాపాలు గందరగోళంగా మారుతున్నాయి.

బోర్డుకు సంబంధంలేని అంశంపై ఛైర్మన్ జోక్యమేమిటంటున్న సిబ్బంది
తిరుపతి(ఆటోనగర్),ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): తిరుపతి కోఆపరేటివ్ బ్యాంకు (టౌన్ బ్యాంక్) కార్యకలాపాలు గందరగోళంగా మారుతున్నాయి. బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ శివకుమార్రెడ్డికి చైర్మన్ కేతం జయచంద్రారెడ్డి శనివారం షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో ఉద్యోగులు విధులు నిలిపి నిరసన తెలిపే పరిస్థితికి వచ్చింది.దీంతో ఖాతాదారులు అసహనానికి గురికావాల్సి వచ్చింది. రూ.6.92 లక్షలు రుణగ్రస్తుల నుంచి రికవరీ చేయని అంశంపై చీఫ్ మేనేజరు వి.వెంకటేశన్,మేనేజరు పి.వినోద్ బాబుపై ఉన్న సస్పెన్షన్ను ఎండీ రద్దు చేశారు. తన దృష్టికి తీసుకురాకుండా విధుల్లోకి తీసుకున్నందుకు ఆగ్రహం వ్యక్తం చేసిన చైర్మన్ షోకాజ్ నోటీస్ ఇచ్చారు. అయితే సహకార చట్టం 51 మేరకు జిల్లా సహకార శాఖ అధికారులు బ్యాంక్లో జరిగిన ఆర్థిక లావాదేవీలపై విచారణ చేస్తున్నారు. విచారణలో తప్పు ఉంటే జీతం నుంచి రికవరీ చేయవచ్చని నిబంధన మేరకు సస్పెన్షన్ ఎత్తివేసినట్టుగా అధికార వర్గాలు చెబుతున్నాయి.ఇది పూర్తిగా పరిపాలన అంశమని,సహకార చట్టం నిబం ధనల మేరకు నిర్థయం తీసుకునే అధికారం ఎండీకి ఉంటుందని తెలస్తోంది. పాలకమండలి సిఫారసు మేరకు విచారణ జరిగివుంటే వారి దృష్టికి తీసుకెళ్లాలి కానీ వ్యక్తిగత కక్షతో బ్యాంకు పరువు బజారుకీడ్చుతున్నారని సిబ్బంది ఆవేదన చెందుతున్నారు. ఉద్యోగులను ఇబ్బందిపెడితే విధులను బహిష్కరిస్తామని హెచ్చరిస్తున్నారు.