Anagani Satya Prasad: బీసీలంటే బలం, చైతన్యం: మంత్రి అనగాని
ABN , Publish Date - Jul 06 , 2025 | 09:06 PM
కూటమి ప్రభుత్వంలో బీసీలు కీలక భూమిక పోషిస్తున్నారని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ తెలిపారు. ఈ ప్రభుత్వంలోని కీలక శాఖలన్నీ బీసీల చేతిలోనే ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.

తిరుపతి, జులై 06: బీసీలు అంటే బలం, చైతన్యమని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ అభివర్ణించారు. అలాంటి బీసీల ఆత్మగౌరవాన్ని గత పాలకులు దెబ్బతీసేలా వ్యవహరించారంటూ వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్పై ఆయన మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీలకు పూర్వ వైభవం వచ్చిందని తెలిపారు. ఆదివారం తిరుపతిలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం, అంబేద్కర్ - పూలే ఫౌండేషన్ ఆధ్వర్యంలో బీసీ ఆత్మగౌరవ సభ నిర్వహించారు.
ఈ సభలో మంత్రులు సవిత, సత్యకుమార్ యాదవ్తోపాటు అనగాని సత్య ప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్య ప్రసాద్ మాట్లాడుతూ.. బీసీలంటే ముందుండి నడిపించే వాళ్ళని ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు నిరూపించారన్నారు. ఈ కూటమి ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాల్లో బీసీలకు అగ్ర పీఠం వేస్తుందని చెప్పారు. అలాగే ఈ కూటమి ప్రభుత్వంలో కీలక శాఖలన్నీ బీసీ నేతల చేతుల్లోనే ఉన్నాయని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
ఇక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ మాట్లాడుతూ.. కుల గణన ద్వారా బీసీలకు ఎంతో మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. బీసీ రిజర్వేషన్ వల్ల అనర్హులకి పట్టం కట్టినట్టు అవుతుందని గతంలో పార్లమెంట్లో రాజీవ్ గాంధీ పేర్కొన్నారని గుర్తు చేశారు. బీసీల కోసం ప్రధాని మోదీ రాజ్యాంగ సవరణలు చాలా చేశారని వివరించారు. గత ప్రభుత్వంలో బీసీలను అణచివేశారని వైఎస్ జగన్పై నిప్పులు చెరిగారు. అలాగే గత జగన్ ప్రభుత్వ హయాంలో బీసీల పట్ల వ్యవహరించిన తీరును ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎండగట్టారు. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో బీసీలకు అగ్రస్థానంలో చోటు ఉందని గుర్తు చేశారు.
Also Read:
ఆ సామాజిక వర్గం వారికి బీసీ డి ధృవీకరణ పత్రాలు జారీకి చర్యలు: మంత్రి సవిత
ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ తెలంగాణ పథకాలు: డిప్యూటీ సీఎం
వందేభారత్కు తృటిలో తప్పిన ప్రమాదం..
For More AndhraPradesh News And Telugu News