Kurnool Car Accident: ఎల్లెల్సీ కాలువలోకి దూసుకెళ్లిన కారు
ABN , Publish Date - Jul 21 , 2025 | 05:22 AM
తుంగభద్ర ఎల్లెల్సీ లో లెవల్ కెనాల్లో కి కారు దూసుకెళ్లడంతో ఒక యువకుడు మరణించాడు

యువకుడు మృతి.. మరొకరు గల్లంతు
కర్నూలు జిల్లా కౌతాళంలో ప్రమాదం
కౌతాళం/ఎమ్మిగనూరు, జూలై 20(ఆంధ్రజ్యోతి): తుంగభద్ర ఎల్లెల్సీ (లో లెవల్ కెనాల్)లోకి కారు దూసుకెళ్లడంతో ఒక యువకుడు మరణించాడు. మరో యువకుడు గల్లంతయ్యాడు. కర్నూలు జిల్లా కౌతాళం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. కర్ణాటకలో హుబ్లీకి చెందిన సునీల్(21), మణికంఠ, హైదర్, మంజునాథ్, అప్పయ్య, అభిషేక్ అక్కడి ఒక కంపెనీలో కార్మికులుగా పనిచేస్తున్నారు. శని, ఆదివారాల్లో సెలవు కావడంతో రాఘవేంద్రస్వామి దర్శనం కోసం కారులో మంత్రాలయానికి వచ్చారు. శనివారం రాత్రి స్వామివారి దర్శనం చేసుకున్నారు. కొప్పల్ సమీపంలోని గవి మఠాన్ని సందర్శించుకొని అక్కడినుంచి హుబ్లీకి చేరుకోవాలని ఆదివారం మధ్యాహ్నం బయలుదేరారు. కౌతాళం వద్ద వారు ప్రయాణిస్తున్న కారు ఎల్లెల్సీలోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో కాలువగట్టుపై భోజనం చేస్తున్న వ్యవసాయ కూలీలు గొట్టయ్య, గోవర్దన్, రమేష్ వెంటనే కాలువలోకి దిగి అప్పయ్య, మంజునాథ్, హైదర్, అభిషేక్లను కాపాడారు. అప్పటికే సునీల్, మణికంఠ గల్లంతయ్యారు. పోలీసులు ఎక్సకవేటర్ సాయంతో కారును బయటకు తీయించారు. గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టగా సునీల్ మృతదేహం లభించింది. మణికంఠ కోసం గాలింపు కొనసాగుతోంది. సునీల్ మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని సీఐ అశోక్కుమార్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రండి.. ఆంధ్రప్రదేశ్ను నిర్మించుకుందాం: మంత్రి లోకేష్ పిలుపు
ఈ సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చిస్తాం: కిరణ్ రిజిజు
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం
For More AndhraPradesh News And Telugu News