Botsa Satyanarayana: సంబంధం లేని వ్యక్తులను కేసుల్లో ఇరికిస్తున్నారు
ABN , Publish Date - May 25 , 2025 | 04:54 AM
ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ రాష్ట్రంలో అభివృద్ధి లేకపోవడం, సంబంధం లేని వ్యక్తులను కేసుల్లో ఇరికించడం, ఉపాధి కూలీలకు డబ్బులు ఇవ్వకపోవడం వంటి సమస్యలను విమర్శించారు. జూన్ 4న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని ప్రకటించారు.

ఉపాధి కూలీలకు డబ్బులివ్వడం లేదు
జూన్ 4న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు: బొత్స
విజయనగరం, మే 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం లేకపోగా... సంబంధం లేని వ్యక్తులను కేసుల్లో ఇరికించి ఇబ్బంది పెడుతున్నారని శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఈ విషయమై మాజీ సీఎం జగన్ అడిగిన ప్రశ్నలకు కూటమి నుంచి ఎవరూ సమాధానం చెప్పలేకపోతున్నారని అన్నారు. విజయనగరంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని, ఎక్కడ చూసినా ఆరాచకమే కనిపిస్తోందన్నారు. సూపర్ సిక్స్ గురించి గత ఎన్నికలకు ముందు కూటమి నాయకులు వాడవాడలా ప్రచారం చేశారని, ఈ ఏడాది కాలంలో సూపర్ సిక్స్ ఫ్లాప్ అయ్యిందని విమర్శించారు. తల్లికి వందనం ఎప్పుడిస్తారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని ప్రకటించినా ఇంతవరకూ విధివిధానాలు ఖరారు కాలేదని పేర్కొన్నారు. జూన్ 4తో కూటమి ప్రభుత్వానికి ఏడాది కావస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ వైఫల్యాలపై అదే రోజును ‘ప్రజా వంచన దినం’గా భావించి రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శనలు, నిరసనలు చేపడతామని బొత్స తెలిపారు.