Vijayanagaram Terrorism Case: సొంత గడ్డపైనే పేలుళ్లకు కుట్ర..
ABN , Publish Date - May 23 , 2025 | 05:19 AM
విజయనగరంలో పేలుళ్లకు కుట్ర పన్నిన కేసులో సిరాజ్, సమీర్లను పోలీస్ కస్టడీలోకి తీసుకున్నారు. ఎన్ఐఏ, ఏటీఎస్ బృందాలు విచారణను ముమ్మరం చేశాయి.

గుర్తించకుంటే భారీ నష్టమే జరిగేది
కొనసాగుతున్న ఎన్ఐఏ దర్యాప్తు
నేడు పోలీసు కస్టడీకి సిరాజ్, సమీర్
విజయనగరం/క్రైం మే22(ఆంధ్రజ్యోతి): ఊపిరి పోసుకున్న నేలపైనే రక్తపుటేర్లు పారించాలని చూశాడా! జన్మనిచ్చిన స్థలంలోనే అమాయక ప్రజల మృత్యుఘోషను వినాలనుకున్నాడా? విజయనగరంలో భారీ పేలుళ్ల కుట్ర కేసులో ఎఫ్ఐఆర్ను పరిశీలిస్తే అవుననే భావన కలగకమానదు. మతోన్మాదంతో నిందితుడు సిరాజ్ పెద్ద కుట్రే పన్నినట్లు భావిస్తున్నారు. ఈ నెల 21, 22 తేదీల్లో పేలుళ్లకు పక్కా ప్రణాళిక వేసినట్టు పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. గగుర్పాటు కలిగించే అంశాలు బయటపడటంతో జిల్లా వాసులు ఉలిక్కిపడుతున్నారు. విజయనగరం వాసి సిరాజ్ కదలికలపై ఆంధ్రా, తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు గత ఆరు నెలలుగా ప్రత్యేక నిఘా పెట్టారు. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు ఇచ్చిన సమాచారంతో కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు మూడునెలలుగా జిల్లా కేంద్రంలోనే ఉంటూ సిరాజ్ కదలికలను డేగ కన్నుతో పరిశీలిస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పేలుళ్లకు కుట్రలు పన్నినట్లు నిర్ధారణకు వచ్చి తరచూ జిల్లా పోలీస్ ఉన్నతాధికారులను సంప్రదిస్తున్నారు. స్థానిక పోలీసుల సహకారంతో ఈ నెల 16న సిరాజ్ను వల వేసి పట్టుకున్నారు. స్టేషన్కు తరలించి విచారించటంతో పోలీసు అధికారులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. అతని వద్ద ఉన్న పేలుళ్ల సామగ్రిని స్వాధీనం చేసుకుని దర్యాప్తును వేగవంతం చేశారు. ఇందులో భాగంగా ఈ నెల 17 నుంచి విజయనగరంలోని వివిధ ప్రాంతాల్లో సోదాలు చేశారు. అనుమానం వచ్చిన ప్రతి అంశాన్నీ కూలంకషంగా పరిశీలించి మరిన్ని క్లూలు సేకరిస్తున్నారు. వీరికి తోడుగా జిల్లా పోలీస్ యంత్రాంగం సిరాజ్ కుటుంబీకులతో పాటు స్కూల్ వయసు నుంచి అతనితో పరిచయం ఉన్న స్నేహితుల వివరాలపై ఆరా తీస్తోంది.
ఆయా విభాగాల అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. సిరాజ్ పలువురితో ప్రత్యేక కోడ్ భాషలో మాట్లాడినట్టు కూడా గుర్తించారు. సిరాజ్ పేలుళ్లకు కుట్ర పన్నినట్లు తెలిశాక ఎన్ఐఏ అధికారులు ఢిల్లీ నుంచే ఆపరేషన్ మొదలు పెట్టారు. ఆపై ఆంధ్రా, తెలంగాణల్లో విధులు నిర్వర్తించే ఆ సంస్థ అధికారులు నగరానికి వచ్చి వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ సమాచారం సేకరిస్తున్నారు. జిల్లా కేంద్రంలో సిరాజ్కు ఎవరైనా సహకరించారా అని ఆరా తీస్తున్నారు. స్థానికంగా సిరాజ్కు పేలుడు సామగ్రి అమ్మిన వ్యాపారులతో దర్యాప్తు అధికారులు ఇప్పటికే మాట్లాడారని తెలిసింది.
రంగంలోకి ఏటీఎస్!
పేలుళ్ల కుట్రలో దర్యాప్తు మరింత వేగవంతం చేసేందుకు ఉగ్రవాద వ్యతిరేక దళం(ఏటీఎస్) రంగంలోకి దిగినట్టు సమాచారం. కాగా, సిరాజ్ పేరున అనేక బ్యాంకు ఖాతాలు ఉన్నట్లు తెలిసింది. జిల్లా కేంద్రంలోని డీసీసీబీలో సిరాజ్ పేరున ఖాతా ఉండగా తండ్రి పేరున లాకర్ ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. సిరాజ్ను రిమాండ్కు తరలించిన తరువాత లాకర్ను తెరిచేందుకు ఆయన తండ్రి విఫలయత్నం చేశారు. లాకర్ తెరిచేందుకు ఎందుకు ఆరాట పడుతున్నాడు? లాకర్లో ఏముంది? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
పోలీస్ కస్టడీకి సిరాజ్, సమీర్..
పేలుళ్ల కుట్ర కేసులో ఏ1 సిరాజ్ , ఏ2 సమీర్ నుంచి మరింత సమాచారాన్ని రాబట్టేందుకు వారిని పోలీస్ కస్టడికీ ఇవ్వాలని టూటౌన్ పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. రెండు రోజుల పాటు వాదనలు విన్న తరువాత వారిద్దరినీ ఏడు రోజుల కస్టడికీ ఇస్తూ విజయనగరం అదనపు జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీచేశారు. దీంతో వారిద్దరినీ శుక్రవారం జైలు నుంచి విజయనగరం తీసుకురానున్నారు. వీరి పోలీస్ కస్టడీతో మరిన్ని కీలక ఆధారాలు బయట పడే అవకాశం ఉంది.