Share News

Land Grab: భూకబ్జాల భూమన

ABN , Publish Date - May 07 , 2025 | 04:14 AM

వైసీపీ హయాంలో భూమన కరుణాకర్‌రెడ్డి 16.3 ఎకరాల ప్రభుత్వ, ఇనాం, నదీ పరీవాహక భూములను ఆక్రమించినట్టు విజిలెన్స్ నివేదిక తేల్చింది. ప్రభుత్వం తక్షణ సర్వే, స్వాధీనం, క్రిమినల్ చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది

Land Grab: భూకబ్జాల భూమన

  • వైసీపీ హయాంలో 16.30 ఎకరాల చెర

  • తిరుచానూరు, తిమ్మినాయినిపాలెంలో ఇనాం,

  • స్వర్ణముఖి, పోరంబోకు భూముల ఆక్రమణ

  • నిర్ధారించిన విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌

  • తాజాగా సర్కారుకు నివేదిక

  • తక్షణ చర్యలకు ఆదేశించిన ప్రభుత్వం

  • సర్వే జరిపి కబ్జాగా తేలిన భూములు వెనక్కి

  • క్రిమినల్‌, సివిల్‌ చర్యలకు మంత్రి ఆదేశం

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

కమ్యూనిజం అంటూనే శ్రీవారి సేవలో తరిస్తుంటారు. ప్రగతిశీల సూక్తులతో రాయలసీమ అభినవ శ్రీశ్రీలా తనను తాను ప్రమోట్‌ చేసుకుంటూ.. తనలోని అన్నమయ్యను బయటకు తీస్తారు. ఇన్ని విద్యలున్న ఆయన మరో విషయంలోనూ సిద్ధహస్తుడినని నిరూపించుకున్నారు. విలువైన ప్రభుత్వ, పోరంబోకు భూములు, స్వర్ణముఖి నదీ పరీవాహకాన్ని సైతం ఆయన చెరపట్టారు. ఈ బాగోతాన్ని విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బయటపెట్టింది. ఆయనలోని కబ్జాకోరు కోణాన్ని ఆవిష్కరించింది. ఆయన మరెవరో కాదు.. భూమన కరుణాకర్‌రెడ్డి. వైసీపీ నేత. వైసీపీ హయాంలో శాసనసభ్యుడిగా ప్రజాసేవలో తరించాల్సిన ఆయన భూములను చెరపట్టడంలో ఆరితేరిపోయారంటూ విజిలెన్స్‌ సర్కారుకు తాజాగా నివేదించింది. రాజకీయ కక్ష తో ఆ నివేదిక ఇచ్చారంటే పొరపాటే. సర్వే నంబర్ల వారీగా భూములు, వాటి సరిహద్దులు, నదీ పరివాహకాన్ని సమగ్రంగా పరిశీలించి అన్ని నివేదికలు, రికార్డులను పరిశీలించి భూమన భూ బాగోతాన్ని వెలికితీసి సర్కారుకు నివేదిక ఇచ్చింది. ఈ నేపథ్యంలో భూమనపై సివిల్‌, క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని తిరుపతి కలెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. ఆక్రమించుకున్న భూములపై సమగ్ర సర్వే చేయాలని, వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది.


జరిగింది ఇదీ!

భూమన కరుణాకర్‌రెడ్డిపై ఇటీవలి కాలంలో విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు అనేక ఫిర్యాదులు వచ్చాయు. అందులో భూ ఆక్రమణలకు సంబంధించిన ఆరోపణల్లో కొన్నింటిపై విజిలెన్స్‌ అధికారుల బృందం ప్రత్యేకంగా విచారణ జరిపింది. తిరుపతి గ్రామీణ మండలం తిరుచానూర్‌, తిరుపతి అర్బన్‌(నగర) మండలం మంగళం గ్రామంలోని తిమ్మినాయుడిపాలెం తదితర గ్రామాల పరిధిలో ఆయన 16.30 ఎకరాలు ఆక్రమించారని విజిలెన్స్‌ నిర్ధారించింది. ఆ భూముల విలువ రూ.కోట్లలో ఉంటుందని అంచనావేసింది. నివేదికలోని ముఖ్యాంశాలు...

స్వర్ణముఖి: తొమ్మిది ఎకరాలు

తిరుచానూరు గ్రామంలోని సర్వే నంబర్‌ 472, 473, 474 లో 15.36 ఎకరాల భూమి భూమన కుమారుడు, ఆయన భార్య రేవతి పేరిట ఉంది. కానీ పొజిషన్‌లో ఉన్న భూమిని సర్వే చేయగా మొత్తం 24.36 ఎకరాల ఉన్నట్లు తేలింది. ఆ భూమిలో మామిడి సాగు చేస్తున్నారు. అయితే, ఇందులో ఇనాం భూమి ఉన్నట్లు విజిలెన్స్‌ గుర్తించింది.ఆ భూమి స్వర్ణముఖీ నదీ పరీవాహకంలో ఉంది. నదీ పరీవాహకంలోని తొమ్మిది ఎకరాల భూమిని భూమున ఆక్రమించుకొని తన ఖాతాలో వేసుకున్నట్లు విజిలెన్స్‌ నిర్ధారించింది. భూమిని చదును, మెరక చేయడానికి దాదాపు లక్ష టన్నుల మట్టిని వాడినట్టు గుర్తించారు. అయితే, ఆక్రమణకు గురైన ఇనాం భూమి నాలుగు ఎకరాలా? ఐదున్నర ఎకరాలా అనేది స్పష్టత రావడానికి సమగ్ర సర్వే చేయాలని విజిలెన్స్‌ సర్కారుకు సిఫారసు చేసింది. ఇనాం, స్వర్ణముఖి నదీ పరీవాహకాన్ని కలిపేసుకొని అదంతా తన భూమి అని చెప్పడానికి చుట్టూ భూమన భారీ ప్రహరీగోడ నిర్మించారని విజిలెన్స్‌ పేర్కొంది.


మంగళం: 7.30 ఎకరాలు

మంగళం గ్రామం తిమ్మినాయినిపాలెంలోని సర్వే నంబర్‌ 47లో 12.91 ఎకరాలు పశువుల గ్రాసం కోసం ప్రభుత్వం రిజర్వ్‌ చేసింది. సర్వే నంబర్‌ 47ను ఐదు సబ్‌ డివిజన్‌లు చేశారు. సర్వే నంబర్‌ 47-1, 47-5లో మొత్తం 7.30 ఎకరాల భూమిని భూమన ఆక్రమించారని విజిలె న్స్‌ నిర్ధారించింది. ఇందులో తొలుత ఐదు ఎకరాల భూమిని ఆక్రమించి రోడ్డువేసి, మరో రెండు ఎకరాలను ప్రైవేటు అవసరాలకు వినియోగిస్తున్నట్లుగా గుర్తించింది. దీంతోపాటు సర్వే నంబర్‌ 47-2లోని మరో 3.07 ఎకరాల భూమిని కబ్జా చేశారని విజిలెన్స్‌ వెల్లడించింది. సంబంధిత రైతులను బెదిరించి ఆ భూమిని లాక్కొని తన ఖాతాలో వేసుకున్నారని పేర్కొంది. ఇలా ఒక్క మంగళంలోనే 47వ సర్వే నంబర్‌ పరిధిలో 10.37 ఎకరాల భూమి ఆయన ఆక్రమణలో ఉందని నివేదించింది. ఇందులో ప్రభుత్వ భూమి 7.30 ఎకరాలు అని స్పష్టం చేసింది.

తక్షణ చర్యలకు ప్రభుత్వం ఆదేశం

ప్రభుత్వ భూములను తక్షణమే ఆక్రమణ నుంచి విడిపించి రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని, భూమనపై ఇనాం, నదీ సంరక్షణ చట్టాల కింద క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది. ప్రభుత్వ భూములను కబ్జా చేసినందుకు భూ కబ్జా నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేయాలని సూచించింది. స్వర్ణముఖి నదీ పరీవాహకాన్ని కబ్జా చేసినందుకు నదీ సంరక్షణ చట్టం కింద భూమనపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో రెవెన్యూ, నీటిపారుదల శాఖలు సంయుక్తంగా చర్యలు చేపట్టాలని విచారణ సంస్థ సిఫారసు చేసింది. ఈ నివేదిక ఇటీవల రెవెన్యూశాఖకు చేరింది.


విజిలెన్స్‌ నివేదిక నేపఽథ్యంలో తీసుకోవాల్సిన తదుపరిచర్యలపై రెవెన్యూమంత్రి అనగాని సత్యప్రసాద్‌ ఉన్నతాధికారులతో సమీక్షించారు. తిరుపతి కలెక్టర్‌తో మాట్లాడినట్లు తెలిసింది. విజిలెన్స్‌ సిఫారసుల మేరకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన కలెక్టర్‌ వెంకటేశ్వర్లును ఆదేశించినట్లు తెలిసింది. భూమన చెరలో ఉన్న ప్రభుత్వ, ఇనాం, స్వర్ణముఖి నదీ పరీవాహకంలోని భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలని, విజిలెన్స్‌ సిఫారసుల మేరకు భూమనపై సివిల్‌, క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని మంత్రి అనగాని ఆదేశించారు. తిరుచానూరు, తిమ్మినాయినిపాలెంలో భూమన చెరలో ఉన్న భూముల్లో సమగ్ర సర్వేచేసి పోలీసుల సహాయంతో ప్రభుత్వ భూములను కాపాడేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తిరుచానూరులోని భూమన తోటకు తరలించిన మట్టి ఎక్కడి నుంచి తీసుకొచ్చారో గుర్తించాలని, దానికోసం వాడిన మట్టి ఎంత మేరకు ఉందో గుర్తించి దానికి గనుల చట్టం మేరకు సీనరేజీ వసూలు చేయాలని మంత్రి ఆదేశించారు. గనుల శాఖతో సమన్వయం చేసుకోవాలన్నారు.

Updated Date - May 07 , 2025 | 04:14 AM