Share News

APSRTC Bribe Row: డబ్బులిస్తేనే ప్రమోషన్లా

ABN , Publish Date - May 05 , 2025 | 05:39 AM

ఆర్టీసీలో పదోన్నతుల కోసం ఆరేళ్లుగా ఎదురుచూస్తున్న సిబ్బందికి ఇప్పటికీ న్యాయం జరగలేదు. అధికారులకు డబ్బులిచ్చి పదోన్నతులు పొందినా, సిబ్బందిని నిర్లక్ష్యం చేయడంపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

APSRTC Bribe Row:  డబ్బులిస్తేనే ప్రమోషన్లా

  • అధికారులకు ఇచ్చి.. సిబ్బందికి ఇవ్వని వైనం

  • లంచాలు ఇచ్చుకోలేం అంటూ సిబ్బంది ఆవేదన

  • ఆర్టీసీ చరిత్రలో ఎన్నడూ వసూళ్లు లేవని ఆగ్రహం

అమరావతి, మే 4 (ఆంధ్రజ్యోతి): ‘‘ప్రయాణికుల్ని భద్రంగా గమ్యం చేరు స్తాం.. రేయింబవళ్లు డ్యూటీ చేస్తాం.. మేం పదోన్నతులకు అర్హులం కాదా..? ప్రమోషన్ల కోసం ఆరేళ్లుగా ఎదురు చూస్తు న్నాం.. చివరకు ఆ ఆశ తీరకుండానే రిటైర్‌ అవుతున్నాం. మా గోడు పట్టించుకోరా..’’ అంటూ ప్రజా రవాణా సంస్థ (పీటీడీ) సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు పదోన్నతులు కల్పించి... సిబ్బంది ఫైలును మాత్రం పక్కన పడేసిన ఉన్నతాధికారుల తీరుపై మూడు వేల మంది మండిపడుతున్నారు. తాము లంచాలు ఇచ్చుకోలేమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీఎ్‌సఆర్టీసీలో ఎప్పటికప్పుడు పదోన్నతులు పొందే సిబ్బందికి.. ప్రభుత్వంలో విలీనంతో గత ఆరేళ్లుగా బ్రేకులు పడ్డాయి. వైసీపీ ప్రభుత్వంలో నాలుగేళ్లుగా ప్రమోషన్ల కోసం అసోసియేషన్లు ఎన్ని వినతులిచ్చినా సర్కారు నుంచి స్పందన రాలేదు. కార్పొరేషన్‌గా ఉన్నప్పుడు మెరిట్‌ రేటింగ్‌ రిపోర్ట్‌ (ఎంఆర్‌ఆర్‌) ఆధారంగా ఎప్పటికప్పుడు వచ్చే ప్రమోషన్లకు.. ప్రభుత్వంలో ఉన్న వార్షిక రహస్య నివేదిక (ఏసీఆర్‌) మార్గదర్శకాలు అడ్డుపడ్డాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తర్వాత ఆర్టీసీ ఉన్నతాధికారులు తమ ప్రమోషన్ల కోసం రవాణాశాఖ ద్వారా పదోన్నతుల కమిటీ (డీపీసీ)కి ఫైలు పంపించారు.


ఏడాది నిరీక్షణ తర్వాత ఈ ఫైలు కదలికలో భారీగా డబ్బులు చేతులు మారినట్లు ఆర్టీసీ హౌస్‌లో చర్చ జరుగుతోంది. కనీసం 30 వేల నుంచి లక్ష రూపాయల వరకూ ఇచ్చిన తర్వాతే ప్రమోషన్లకు ఆమోదం లభించిందని, అలా ఇవ్వనంత వరకూ ఏదో ఒక అభ్యంతరం చెబుతూ జాప్యం చేశారని బహిరంగంగా చెబుతున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పదోన్నతుల్లో ఏసీఆర్‌ ప్రధానమంటూ ఆపేసి.. డబ్బులు చేతులు మారిన తర్వాత ప్రభుత్వ అనుమతి తీసుకుని ఈ ఒక్కసారికి ఎంఆర్‌ఆర్‌ను పరిగణలోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. అయితే డిపో మేనేజర్‌ నుంచి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వరకూ ఆరు కేటగిరీల్లోని 110 మంది అధికారులకు ఈ నెల 2న ప్రభుత్వం పదోన్నతులు ఇచ్చింది. సిబ్బందికి సంబంధించిన ప్రమోషన్ల ఫైలులో మాత్రం కదలిక లేదు. రాష్ట్రవ్యాప్తంగా 129 బస్‌ డిపోల పరిధిలో ఏడీ, పీడీ, ఎంఈడీ, ఓపీడీ విభాగాల్లో మూడు వేల మంది సిబ్బంది ప్రమోషన్ల కోసం ఆరేళ్లుగా ఎదురు చూస్తున్నారు. కండక్టర్‌ నుంచి ఎస్‌టీఐ దాకా.. జూనియర్‌ అసిస్టెంట్‌ నుంచి సూపరింటెండెంట్‌ వరకూ ప్రమోషన్లు వస్తాయని ఎదురు చూసిన 3వేల మంది తమపై ఎందుకింత వివక్ష అంటూ ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు. ఏపీఎ్‌సఆర్టీసీ చరిత్రలో ప్రమోషన్లకు లంచాలు ఇవ్వడం ఎప్పుడూ లేదని అంటున్నారు. ఏ ఫైలు అయినా 48 గంటల్లో కదలాలని చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు తమపై దయ చూపించి ప్రమోషన్లు వచ్చేలా చూడాలని వారు కోరుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తిరుమలలో భారీ వర్షం.. భక్తుల పరుగులు.. (ఫోటో గ్యాలరీ)

నకిలీ దేశ గురువు మాయాజాలం

For More AP News and Telugu News

Updated Date - May 05 , 2025 | 05:39 AM