Share News

AP Teacher Unions: టీచర్ల కౌన్సెలింగ్‌ పై కుదరని ఏకాభిప్రాయం

ABN , Publish Date - Jun 09 , 2025 | 02:35 AM

సెకండరీ గ్రేడ్‌ టీచర్ల కౌన్సెలింగ్‌ విషయంలో పాఠశాల విద్యాశాఖ, ఉపాధ్యాయ సంఘాల మధ్య సఖ్యత కుదరడం లేదు. మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ కావాలని సంఘాలు పట్టుబడుతుంటే, సమయం లేనందున వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారానే చేపడతామని విద్యాశాఖ చెబుతోంది.

AP Teacher Unions: టీచర్ల కౌన్సెలింగ్‌ పై కుదరని ఏకాభిప్రాయం

  • స్లాట్లవారీగా చేపడతామన్న పాఠశాల విద్యాశాఖ

  • వెబ్‌ విధానానికి అంగీకరించని టీచర్ల సంఘాలు

  • నేడు నిరాహార దీక్షలు.. రేపు విద్యాభవన్‌ ముట్టడి

అమరావతి, జూన్‌ 8(ఆంధ్రజ్యోతి): సెకండరీ గ్రేడ్‌ టీచర్ల కౌన్సెలింగ్‌ విషయంలో పాఠశాల విద్యాశాఖ, ఉపాధ్యాయ సంఘాల మధ్య సఖ్యత కుదరడం లేదు. మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ కావాలని సంఘాలు పట్టుబడుతుంటే, సమయం లేనందున వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారానే చేపడతామని విద్యాశాఖ చెబుతోంది. ఇదే అంశంపై పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ వి.విజయరామరాజు ఆదివారం గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో నిర్వహించిన వెబెక్స్‌లో స్లాట్ల వారీగా కౌన్సెలింగ్‌ చేపడతామని తెలిపారు. అంటే ఒక జిల్లాలో సీనియారిటీ ఆధారంగా తొలుత 500 మందికి ఆప్షన్లు ఇస్తారు. వారు పాఠశాలలను ఎంపిక చేసుకున్న తర్వాత మరో 500 మందికి అవకాశం కల్పిస్తారు. మొదటి జాబితాలో వారు ఎంపిక చేసుకున్న స్థానాలను ఆ తర్వాత వారికి చూపించరని డైరెక్టర్‌ వివరించారు. అయితే ఈ విధానానికి కూడా ఉపాధ్యాయ సంఘాలు అంగీకరించలేదు. పూర్తిగా మాన్యువల్‌ విధానంలోనే కౌన్సెలింగ్‌ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో ఏకాభిప్రాయం రాకపోవడంతో సోమవారం నుంచి ఉద్యమబాట పట్టాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక నిర్ణయించింది. దీనిపై డైరెక్టర్‌కు ఆన్‌లైన్‌లో నోటీసు పంపింది. సోమవారం ఉదయం 10 గంటల నుంచి అన్ని డీఈవో కార్యాలయాల ఎదుట నిరాహార దీక్షలు చేయాలని, మంగళవారం మంగళగిరిలోని విద్యా భవన్‌ను ముట్టడించాలని పిలుపునిచ్చింది. ఈ కార్యాచరణను మంత్రి లోకేశ్‌కు కూడా మెయిల్‌ ద్వారా పంపారు.


స్లాట్‌ ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌: పాఠశాల విద్యాశాఖ

సెకెండరీ గ్రేడ్‌ టీచర్ల బదిలీలకు స్లాటెడ్‌ ఆన్‌లైన్‌ విధానం అమలుచేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఈ విధానంలో తొలుత ప్రభుత్వ, మున్సిపల్‌, మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేనేజ్‌మెంట్ల పాఠశాలలకు ఆప్షన్లు ఓపెన్‌ చేస్తారు. ఆ తర్వాత జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ పాఠశాలల్లో స్లాట్ల వారీగా టీచర్లకు ఆప్షన్లు పెట్టుకునే అవకాశం ఇస్తారు. ఉదాహరణకు జిల్లాలో సీనియారిటీ ఆధారంగా 1 నుంచి 500 మంది టీచర్లకు మొదట అవకాశం ఇస్తారు. వారికి అన్ని ఖాళీలూ కనిపిస్తాయి. 4 నుంచి 6గంటల సమయం ఇస్తారు. ఆప్షన్లు ఇచ్చిన తర్వాత బదిలీ ఆర్డర్లు జారీ అవుతాయి. మిగిలిన ఖాళీలతో ఆ తర్వాతి 500 మందికి ఆప్షన్లు ఓపెన్‌ చేస్తారు. ఇలా స్లాట్ల విధానంలో 1 నుంచి చివరి వరకూ ఆప్షన్లకు అవకాశం ఇచ్చి, ఎప్పటికప్పుడు బదిలీ ఆర్డర్లు ఇస్తారు. సాధారణంగా అయితే అందరికీ ఒకేసారి అవకాశం కల్పించి రెండు మూడు రోజుల సమయం ఇస్తారు. అందరూ ఆప్షన్లు పెట్టుకున్నాక సీనియారిటీ వారీగా ప్రాధాన్యతా క్రమంలో బదిలీ ఆర్డర్లు ఒకేసారి జనరేట్‌ చేస్తారు. ఇప్పుడు వెబ్‌ కౌన్సెలింగ్‌లోనే స్లాట్ల విధానం తీసుకొచ్చారు. దీనివల్ల అందరూ ఎక్కువ ఆప్షన్లు పెట్టుకోవాల్సిన అవసరం తప్పుతుందని అధికారులు చెబుతున్నారు.

Updated Date - Jun 09 , 2025 | 02:40 AM