Nara Lokesh: రాజీనామా చేస్తా.. జగన్కి లోకేష్ ఓపెన్ ఛాలెంజ్, ఫన్నీ.. ఫన్నీ కౌంటర్స్
ABN , Publish Date - Jun 02 , 2025 | 06:51 PM
వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓపెన్ ఛాలెంజ్, ఫన్నీ.. ఫన్నీ సెటైర్లు విసిరారు నారా లోకేష్. ఎకరం రూపాయికే భూములు కట్టబెట్టారంటూ జగన్ చేసిన ఆరోపణలపై విరుచుకుపడ్డారు లోకేష్. బురద జల్లి ప్యాలస్లో దాక్కోవడం కాదు.. చేసిన ఆరోపణలు నిరూపించండంటూ సవాల్ చేశారు.

ఇంటర్నెట్ డెస్క్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓపెన్ ఛాలెంజ్, ఫన్నీ.. ఫన్నీ సెటైర్లు విసిరారు ఏపీ మంత్రి నారా లోకేష్. ఉర్సా కంపెనీకి విశాఖపట్నంలో ఎకరం రూపాయికే భూములు కట్టబెట్టారు అంటూ జగన్ చేసిన ఆరోపణలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు లోకేష్. బురద జల్లి ప్యాలస్లో దాక్కోవడం కాదు.. చేసిన ఆరోపణలు నిరూపించండంటూ సవాల్ చేశారు. ఈ మేరకు నారా లోకేష్ తన సోషల్ మీడియా హ్యాండిల్ 'ఎక్స్' లో.. ' ఫేక్.. ఫ్యాక్ట్' అంటూ జగన్ ఫొటోతో కూడిన ఒక పోస్ట్ చేశారు.
ఆ పోస్ట్ లో లోకేష్ ఏం చెప్పారంటే.. 'వైఎస్ జగన్ గారికి ఓపెన్ ఛాలెంజ్.. మీరు చేసిన ఆరోపణలు నిరూపిస్తే నేను నా మంత్రి పదవికి రాజీనామా చేస్తాను. మీరు చేసిన ఆరోపణలు తప్పని తేలితే రాష్ట్ర యువతకు క్షమాపణ చెప్పండి చాలు. ఆరోపణలు చేయడం, పారిపోవడం జగన్ రెడ్డి గారికి కొత్తేమీ కాదు. ఉర్సా కంపెనీకి విశాఖపట్నంలో ఎకరం రూపాయికే భూములు కట్టబెట్టారు అంటూ మీరు తీవ్ర ఆరోపణ చేశారు. నేను స్పష్టంగా మరోసారి చెబుతున్నా.. ఉర్సా కంపెనీకి విశాఖలోని ఐటి పార్క్ హిల్ - 3 లో ఎకరం కోటి రూపాయలు చొప్పున మూడున్నర ఎకరాలు కేటాయించాం. కాపులుప్పాడలో ఎకరం యాభై లక్షల చొప్పున 56.36 ఎకరాలు కేటాయించాం. బురదజల్లి ప్యాలస్ లో దాక్కోవడం కాదు.. చేసిన ఆరోపణలు నిరూపించండి. ఛాలెంజ్కు సిద్ధమా జగన్ రెడ్డి గారు?' అంటూ సవాల్ చేశారు నారా లోకేష్.
ఇంకా, నారా లోకేష్ తన పోస్ట్లో ఏమన్నారంటే.. 'మీ ఐదేళ్ల విధ్వంస పాలనలో ఒక్క కంపెనీ తీసుకురాకపోగా ఉన్న కంపెనీలను ఇతర రాష్ట్రాలకు తరిమేశారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తరువాత 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నాం. పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబడుతున్నాం. కంపెనీలు రావడం, యువతకు ఉద్యోగ అవకాశాలు రావడం చూసి మీరు తట్టుకోలేకపోతున్నారు. ఈనో వాడండి కాస్త రిలీఫ్ వస్తుంది.' అంటూ సెటైరికల్ చురకలంటించారు నారా లోకేష్. మరి ఈ సవాల్ను వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటారో.. లేదో చూడాలి.
ఇవి కూడా చదవండి:
ఏఐతో మానవ సమాజం ఉనికికే ముప్పు: భారత సంతతి ప్రొఫెసర్
పెళ్లితో ప్రయోజనాలపై యువతి పోస్టు.. నెట్టింట పెద్ద చర్చ