Anitha: లోకేశ్ ఛాలెంజ్ స్వీకరించే దమ్ము జగన్కు లేదా?: హోంమంత్రి అనిత..
ABN , Publish Date - Jun 14 , 2025 | 05:46 PM
రాజకీయ ముసుగులో ఉన్న నేరస్థుడు కాబట్టే ఏపీలో జరుగుతున్న అభివృద్ధి చూసి జగన్ ఓర్వలేకపోతున్నాడని హోంమంత్రి అనిత మండిపడ్డారు. పోలీసులు, మహిళలపై రాళ్లు విసిరితే తమకు బీపీలు రావా? అంటూ వైసీపీ నేతలను హోంమంత్రి ప్రశ్నించారు.

అమరావతి, జూన్ 14: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత మరోసారి నిప్పులు చెరిగారు. శనివారం నాడు అమరావతిలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఉన్నంత వరకూ వైఎస్ జగన్ ఆటలు సాగవని స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు ఎలాగైనా విఘాతం కలిగించాలని చూసే జగన్ కుట్రలు రాష్ట్రంలో సాగనివ్వబోమని ఆమె కుండ బద్దలు కొట్టారు. రాష్ట్రంలో మహిళలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని వివరించారు. దీనికి ఎవ్వరు విఘాతం కలిగించాలని చూసినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
మహిళల్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయాలనుకుంటున్న జగన్కు సిగ్గనిపించట్లేదా? అంటూ ఆమె సందేహం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా పొదిలిలో పోలీసులు తిరిగి ఎదురు రాళ్ల దాడి చేసి ఉంటే వైఎస్ జగన్ చుట్టూ ఎంత మంది మిగిలే వారో గుర్తుపెట్టుకోవాలంటూ వైసీపీ నేతలను మంత్రి అనిత హెచ్చరించారు. కేజీ పొగాకు ధర కూడా తెలియకుండా రైతుల పరామర్శకు వెళ్లిన జగన్ మానసిక పరిస్థితి అర్ధం చేసుకోవచ్చంటూ ఈ సందర్బంగా హోంమంత్రి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పులివెందులకు మాత్రమే పరిమితమైన ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డని, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ఎద్దేవా చేశారు.
కూటమి ప్రభుత్వంలో మహిళలు, తల్లులు సంతోషంగా ఉండటాన్ని వైసీపీ జీర్ణించుకోలేకపోతోందని విమర్శించారు. ప్రతిపక్ష హోదా కూడా లేని ఓ విపక్ష పార్టీ కడుపు మంట చూస్తే నవ్వొస్తుందని ఎద్దేవా చేశారు. అమరావతి గురించి కొందరు వెధవలు చేసిన వ్యాఖ్యల్ని జగన్ సమర్ధించటం సిగ్గు చేటు అంటూ వ్యాఖ్యనించారు. సాక్షి జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు నిర్దోషి అంటూ సుప్రీంకోర్టు ఎక్కడా నిర్ధారించలేదని గుర్తు చేశారు. ఎలాంటి టీవీ డిబేట్లు నిర్వహించకూడదని కొమ్మినేనికి సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మాత్రమే మంజూరు చేసిందని సోదాహరణగా మంత్రి వంగలపూడి అనిత వివరించారు.
వైఎస్ జగన్, వైఎస్ భారతీతో క్షమాపణలు చెప్పించడానికి సమావేశం పెట్టుకోవాలంటూ వైసీపీ నేతలకు మంత్రి అనిత హితవు పలికారు. సాటి మహిళల్ని కించపరిస్తే ఆ అంశాన్ని సమర్ధించుకోవడానికి వైసీపీ మహిళా నేతలు సమావేశం పెట్టుకోవడాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. పులివెందుల ఎమ్మెల్యేగా కూడా మిగలని పరిస్థితిని వైఎస్ జగన్ తెచ్చుకుంటున్నాడని జోస్యం చెప్పారు. తల్లికి వందనం నిధులపై మంత్రి లోకేశ్ విసిరిన ఛాలెంజ్ స్వీకరించే దమ్ము ఒక్కరికి కూడా లేకపోయిందంటూ వైసీపీ నేతలపై మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన శక్తి యాప్కు, గత ప్రభుత్వం తెచ్చిన బూటకపు దిశ యాప్కు పొంతనే లేదన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే అభివృద్ధిని అడ్డుకోవచ్చనే కుట్రతో జగన్ కిందా మీద పడుతున్నారని విమర్శించారు.
రాజకీయ ముసుగులో ఉన్న నేరస్థుడు కాబట్టే ఏపీలో జరుగుతున్న అభివృద్ధి చూసి జగన్ ఓర్వలేకపోతున్నాడన్నారు. పోలీసులు మీద రాళ్లు విసిరితే మాకు బీపీలు రావా? అని ప్రశ్నించారు. మాకు బీపీలు వచ్చినా, చేసిన అవమానాలకు కడుపు మండినా సంయమనం పాటిస్తున్నామని మంత్రి వంగలపూడి అనిత చెప్పుకొచ్చారు. డైవర్షన్ పాలిటిక్స్ను జగన్ పేటెంట్ తీసుకున్నాడని ఎద్దేవా చేశారు. జగన్ తన నియోజకవర్గానికి వస్తే ఐదుగురు పిల్లల ఉన్న తల్లులకు తల్లికి వందనం నగదు పడిన వారిని చూపిస్తానని చెప్పారు. డీఎస్సీ నిలుపుదల చేయటానికి సుప్రీంకోర్టు వరకూ వెళ్లి కుట్రలు చేయలేదా? అంటూ వైసీపీ నేతలపై హోంమంత్రి అనిత మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి..
మాజీ సీఎం ప్రాణం తీసిన సెంటిమెంట్
గుడ్ న్యూస్.. ఆధార్ ఆప్డేట్ గడువు పొడిగింపు
For AndhraPradesh News And Telugu News