AP Government: సాగుకు సర్కారు అండ
ABN , Publish Date - Jun 06 , 2025 | 04:12 AM
రాష్ట్రంలో ఆగ్రో ప్రాసెసింగ్ వృద్ధి చెందేలా చూడాలి. సంక్షోభ సమయంలోనే తెలివిగా కష్టపడాలి. సమస్య పరిష్కారమయ్యే వరకు అధికారులు, మంత్రులు ప్రజల్లోకి వెళ్తూ ఉండాలి. వ్యవసాయానికి ప్రభుత్వం అండగా ఉందనే భరోసా రైతుల్లో కలిగించాలి.

రైతుల ప్రయోజనాలే ముఖ్యం
మార్క్ఫెడ్ ద్వారా బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోలు
కిలో మామిడికి రూ.4, కోకోకు రూ.50 సాయం: సీఎం
గిట్టుబాటు ధరలు, కొనుగోళ్లపై సమీక్ష
అమరావతి, జూన్ 5(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రంలో ఆగ్రో ప్రాసెసింగ్ వృద్ధి చెందేలా చూడాలి. సంక్షోభ సమయంలోనే తెలివిగా కష్టపడాలి. సమస్య పరిష్కారమయ్యే వరకు అధికారులు, మంత్రులు ప్రజల్లోకి వెళ్తూ ఉండాలి. వ్యవసాయానికి ప్రభుత్వం అండగా ఉందనే భరోసా రైతుల్లో కలిగించాలి. రైతుల ప్రయోజనాలే ప్రభుత్వానికి ముఖ్యం’ అని సీఎం చంద్రబాబు స్పష్టంచేశారు. గురువారం ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో కోకో, మామిడి, పొగాకు గిట్టుబాటు ధర, కొనుగోళ్లపై సీఎం సమీక్ష చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘ధాన్యం సేకరణ, ఉద్యాన పంటలు, ఆక్వా విషయంలో రైతులకు ఈ ప్రభుత్వం ఎంతో మేలు చేసింది. రైతుల్లో అసంతృప్తి లేకుండా చూడాలి. పీఎం కిసాన్ డేటాకు అనుగుణంగానే అన్నదాత-సుఖీభవ లబ్ధిదారుల జాబితాను రూపొందించాలి. ప్రభుత్వ సాయం దళారులకు, వ్యాపారులకు కాకుండా రైతాంగానికి అందేలా చూడాలి. మంత్రులు, ఎంపీలు కేంద్రమంత్రులను కలిసి, పామాయిల్పై కేంద్రం తగ్గించిన దిగుమతి సుంకం రైతులను ఏవిధంగా నష్టపరుస్తుందో చెప్పి, నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ఒప్పించాలి’ అని సూచించారు. ‘వైట్ బర్లీ పొగాకు రకాన్ని ఒప్పందం మేరకే సాగు చేయించి, కంపెనీలే కొనుగోలు చేయాలి. హెచ్డీ(బ్లాక్) బర్లీ పొగాకుకు ప్రత్యామ్నాయంగా అపరాలు, చిరుధాన్యాలు పండించేలా ఆయా గ్రామాల్లో చర్చించి, రైతులను ప్రోత్సహించాలి. పర్చూరు, ఇంకొల్లు, మద్దిపాడు, గుంటూరు, పెదనందిపాడు, ప్రత్తిపాడు, చిలకలూరిపేట మార్కెట్ యార్డుల్లో బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోళ్లను వెంటనే చేపట్టాలి. బ్లాక్ బర్లీని ఐటీసీ, జీపీఐ కలిసి 25వేల మిలియన్ కిలోలు కొనుగోలు చేయాలి.
బ్లాక్ బర్లీలో సెకండ్, థర్డ్ గ్రేడ్ల కొనుగోలుపై కంపెనీలతో సంప్రదింపులు జరపాలి. కోకో పాలసీ తీసుకురావాలి. కోకో రైతుల వద్ద 465 టన్నుల కోకో గింజలు కొనుగోలు చేయగా, ఇంకా 745 టన్నులు మిగిలి ఉన్నాయి. కోకో రైతుకు కనీసం కిలోకు రూ.500 ధర తగ్గకుండా చూడాలి. కంపెనీలు రూ.450 చెల్లిస్తే, ప్రభుత్వం రూ.50 ఇస్తుంది. 43 వేల మెట్రిక్ టన్నుల మామిడి పల్ప్ ప్రాసెసింగ్ కంపెనీల దగ్గర నిలిచిపోయాయి. కిలో మామిడికి రూ.12 చొప్పున వ్యాపారులు తక్షణం కొనుగోలు జరపాలి. వ్యాపారులు రూ.8చెల్లిస్తే.. ప్రభుత్వం రూ.4 నేరుగా రైతులకు చెల్లిస్తుంది. రాష్ట్రంలో రైతుబజార్లను 116 నుంచి 200కు పెంచాలి. మొబైల్ రైతుజార్లను కూడా ప్రవేశపెట్టాలి’ అని మార్కెటింగ్శాఖను సీఎం ఆదేశించారు.
నేటి నుంచే పొగాకు కొనుగోళ్లు: అచ్చెన్న
పొగాకు రైతులెవరూ ఆందోళన చెందనవసరం లేదని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఉండవల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ’శుక్రవారం నుంచే కొనుగోలు ప్రారంభమౌతుంది. పొగాకు నాణ్యతను పరిశీలించి, మార్క్ఫెడ్ కొనేలా క్వింటా రూ.12వేలకు తగ్గకుండా కొనుగోలు చేస్తాం. రూ.350కోట్లు ఖర్చయినా ప్రభుత్వం మార్కెఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తుంది. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో 5.5 లక్షల టన్నుల తోతాపురి మామిడి ఉత్పత్తి వచ్చింది’ అని తెలిపారు.