AP Government : ఆర్టీసీలో కారుణ్యానికి పచ్చజెండా
ABN , Publish Date - Feb 20 , 2025 | 04:16 AM
ఏపీఎస్ఆర్టీసీలో ఉద్యోగం చేస్తూ ప్రాణాలు కోల్పోయిన వారి పిల్లలకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించింది.

ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్నవారికి ఉపశమనం
ఇచ్చిన హామీ అమలు చేసిన చంద్రబాబు
800 మంది ఉద్య్ఠోగుల కుటుంబాలకు లబ్ధి
గతంలో అందరికీ ఇవ్వబోమన్న జగన్
అమరావతి, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): కుటుంబ యజమానిని కోల్పోయి తలకిందులైన కుటుంబాలపై కూటమి ప్రభుత్వం కరుణ చూపించింది.ఏపీఎస్ఆర్టీసీలో ఉద్యోగం చేస్తూ ప్రాణాలు కోల్పోయిన వారి పిల్లలకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించింది. జగన్ ప్రభుత్వంలో అన్యాయానికి గురైన వారందరికీ ఈ నిర్ణయంతో ఉపశమనం లభించనుంది. ఆర్టీసీలో ఉద్యోగం చేస్తూ ఎవరైనా మరణిస్తే ఆ కుటుంబంలో అర్హులైన వారికి కండక్టర్, డ్రైవర్, శ్రామిక్ లాంటి ఉద్యోగాలు బ్రెడ్ విన్నర్(కారుణ్య నియామకం) స్కీమ్ కింద కార్పొరేషన్ ఉద్యోగాలు ఇస్తోంది. అయితే, 2020 జనవరి 1న రాష్ట్ర ప్రభుత్వంలో సిబ్బందిని విలీనం చేసిన వైసీపీ సర్కారు, 2016 జూలై నుంచి 2019 డిసెంబరు మధ్య చనిపోయిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు మాత్రమే కారుణ్యం కింద ఉద్యోగాలిస్తామని ప్రకటించింది. అంతకు ముందు ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల పిల్లల గోడు వినిపించుకోలేదు. కారుణ్య నియామకాలు అందరికీ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు వినతులిచ్చినా పట్టించుకోలేదు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు దృష్టికి బాధితులు ఈ విషయాన్ని తీసుకెళ్లగా తాము అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామంటూ మాటిచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలువురు బాధితులు రవాణా మంత్రి రామ్ప్రసాద్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణలకు వినతి పత్రాలు సమర్పించారు. ఇటీవల ఆర్టీసీపై సమీక్ష చేసిన చంద్రబాబు 2016కు ముందు చనిపోయిన వారి కుటుంబసభ్యులకు కారుణ్య నియామకాలు చేపట్టాలని ఆదేశించారు. దీనికి అనుగుణంగా కారుణ్య నియామకాలను పూర్తి చేసేందుకు ఏపీఎ్సఆర్టీసీ చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 800మందికి ఈ నిర్ణయం ఉపశమనం కల్పిస్తుందని అధికారులు తెలిపారు.