AP EAPCET 2025: ఈఏపీసెట్లో అబ్బాయిల హవా
ABN , Publish Date - Jun 09 , 2025 | 02:42 AM
ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఏపీ ఈఏపీసెట్లో అబ్బాయిలు రికార్డు సృష్టించారు. ఇంజనీరింగ్ సహా అగ్రి, ఫార్మసీలో తొలి 10 ర్యాంకులను అబ్బాయిలే దక్కించుకున్నారు. అయితే..

టాప్-10 ర్యాంకులు వారికే సొంతం
ఇంజనీరింగ్లో తెలంగాణ విద్యార్థి,
అగ్రికల్చర్, ఫార్మసీలో ఏపీ విద్యార్థి ఫస్ట్
అయినా.. మన సీట్లు మన వారికే
మొత్తంగా 75.67 శాతం మందికి అర్హత
ఫలితాలు వెల్లడించిన జేఎన్టీయూ కాకినాడ
అమరావతి/జేఎన్టీయూకే, జూన్ 8(ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఏపీ ఈఏపీసెట్లో అబ్బాయిలు రికార్డు సృష్టించారు. ఇంజనీరింగ్ సహా అగ్రి, ఫార్మసీలో తొలి 10 ర్యాంకులను అబ్బాయిలే దక్కించుకున్నారు. అయితే.. టాప్-10లో అమ్మాయిలు లేకపోయినా.. ఉత్తీర్ణత పరంగా అబ్బాయిలకన్నా వారే కొంత ఎక్కువ సంఖ్యలో అర్హత సాధించడం గమనార్హం. మొత్తంగా ఏపీ ఈఏపీసెట్లో 75.67 శాతం విద్యార్థులు అర్హత సాధించారు. ఇంజనీరింగ్ విభాగంలో 71.65 శాతం మంది, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 89.8 శాతం మంది అర్హులయ్యారు. ఏపీఈఏపీసెట్-2025 ఫలితాలను జేఎన్టీయూ(కాకినాడ) వీసీ సీఎ్సఆర్కే ప్రసాద్ ఆదివారం విడుదల చేశారు. ఇంజనీరింగ్ విభాగంలో 2,64,840 మంది పరీక్షలు రాశారు. వారిలో 1,89,748(71.65శాతం) మంది అర్హత సాధించారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 75,460 మంది పరీక్షకు హాజరయ్యారు. వారిలో 67,761(89.8శాతం) మంది అర్హత సాధించారు. ఇంజనీరింగ్లో అమ్మాయిలు 73.37 శాతం మంది, అబ్బాయిలు 70.33 శాతం మంది... అగ్రికల్చర్, ఫార్మసీలో అమ్మాయిలు 89.76 శాతం, అబ్బాయిలు 89.92 శాతం అర్హత సాధించారు.
రెండు విభాగాల్లో టాప్-10లో అందరూ అబ్బాయిలే ఉన్నారు. ఇంజనీరింగ్ విభాగంలో తెలంగాణకు చెందిన ఎ. అనిరుధ్రెడ్డి ఫస్ట్ ర్యాంకు సాధించాడు. శ్రీకాళహస్తికి చెందిన ఎం. భానుచరణ్ రెడ్డి, పాలకొల్లుకు చెందిన కె. యశ్వంత్ సాత్విక్ రెండు, మూడు ర్యాంకులు సాధించారు.
అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో విజయవాడకు చెందిన ఆర్. వెంకటనాగసాయి హర్షవర్ధన్ ప్రథమ ర్యాంకు సాధించాడు.
తెలంగాణకు చెందిన ఎ. షణ్ముఖ నిషాంత్, కోనసీమకు చెందిన డి. అకీరానంద వినయ్ మల్లేశ్కుమార్ రెండు, మూడు ర్యాంకులు సాధించారు.
మొత్తంగా ఇంజనీరింగ్ టాపర్లలో ఇద్దరు, అగ్రి, ఫార్మసీలో ఇద్దరు చొప్పున తెలంగాణ విద్యార్థులున్నారు.
ఇతర రాష్ర్టాల కోటాలో ఇంజనీరింగ్లో 8,233 మంది, అగ్రి- ఫార్మసీలో 1,162 మంది అర్హత సాధించారు. అయితే ఇతర రాష్ర్టాల వారికి సీట్లు కేటాయించకూడదని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
ఏపీ విద్యార్థులకు సీట్లు ఇవ్వకూడదని తొలుత తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడంతో, ఏపీ కూడా అదే బాటలో ‘మన సీట్లు మనకే’ అని ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.
ఇంజనీరింగ్ టాపర్లు
1. ఎ. అనిరుధ్రెడ్డి(రంగారెడ్డి, తెలంగాణ), 2. ఎం. భాను చరణ్రెడ్డి(తిరుపతి), 3. కె. యశ్వంత్ సాత్విక్(పశ్చిమగోదావరి), 4. యు. రామచరణ్ రెడ్డి(నంద్యాల), 5. ఎ. భూపతి నితిన్(అనంతపురం), 6. టి. విక్రమ్ (గుంటూరు), 7. డి. మనిదీప్ రెడ్డి(చిత్తూరు), 8. ఎస్. త్రిశూల్(హన్మకొండ, తెలంగాణ) 9. డి. జ్ఞాన రుత్విక్ సాయి(శ్రీకాకుళం), 10. బి. వెంకటమణి ప్రీతమ్(నెల్లూరు).
అగ్రికల్చర్, ఫార్మసీ టాపర్లు
1. ఆర్. వెంకటనాగ సాయి హర్షవర్ధన్(కృష్ణా), 2. ఎ. షణ్ముఖ నిషాంత్(రంగారెడ్డి, తెలంగాణ), 3. డి. అకీరానంద వినయ్ మల్లేశ్ కుమార్(కోనసీమ), 4. వై. షణ్ముఖ్(హన్మకొండ, తెలంగాణ), 5. వై. సత్య వెంకట్(పశ్చిమగోదావరి), 6. ఎస్. శ్రీసాయి గోవర్థన్(కాకినాడ), 7. జి. లక్ష్మీ చరణ్(విశాఖపట్నం), 8. డి. కార్తీక్ రామ్ కిరీటి(తూర్పుగోదావరి), 9. కె. మోహిత్ శ్రీరామ్(తూర్పుగోదావరి), 10. డి. సూర్య చరణ్(కాకినాడ).
ఇంజనీరింగ్లో 2వ ర్యాంకు
చదువుల భానుడు!
శ్రీకాళహస్తి పట్టణం శ్రీరామ్నగర్కాలనీకి చెందిన భానుచరణ్రెడ్డి ఈఏపీసెట్ ఇంజనీరింగ్ విభాగంలో రాష్ట్రస్థాయి రెండో ర్యాంకు సాధించాడు. భాను చరణ్రెడ్డి తల్లిదండ్రులు జయభారత్రెడ్డి, సురేఖలు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. ఇటీవల విడుదలైన జేఈఈ అడ్వాన్స్డ్ ఓపెన్ కేటగిరిలో భానుచరణ్రెడ్డి 51వ ర్యాంకు సాధించాడు. రెండు రోజుల క్రితం సీఎం చంద్రబాబు విజయవాడలో భానును అభినందించారు. ఆదివారం విడుదలైన ఈఏపీసెట్ ఫలితాల్లో భానుచరణ్రెడ్డి రెండో ర్యాంకు సాధించాడు. ఐఐటీ ముంబైలో కంప్యూటర్ సైన్స్ చదవనున్నట్టు భానుచరణ్రెడ్డి తెలిపాడు.
వ్యవసాయ కూలీ బిడ్డకు 3వ ర్యాంకు
ముంబై ఐఐటీ లక్ష్యం: యశ్వంత్
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన వ్యవసాయ కూలీ కుటుంబానికి చెందిన వ్యక్తి యశ్వంత్ సాత్విక్ ఇంజనీరింగ్ విభాగంలో మూడోర్యాంకు సాధించి తల్లిదండ్రుల కలలు నెరవేర్చాడు. ఇటీవల విడుదలైన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలలో ఈడబ్ల్యూఎస్ కేటగిరిలో జాతీయ స్థాయిలో టాపర్గా నిలిచాడు. ఓపెన్ కేటగిరిలో 53వ ర్యాంక్ సాధించాడు. ముంబై ఐఐటీలో చదవాలన్నదే తన లక్ష్యమని యశ్వంత్ చెప్పాడు.
ఇంజనీరింగ్లో 4వ ర్యాంకు
సివిల్స్ సాధించడమే లక్ష్యం
ఉడగండ్ల రామ్చరణ్రెడ్డి
సివిల్స్ సాధించడమే లక్ష్యమని ఏపీఈఏపీసెట్ ఇంజనీరింగ్ విభాగంలో 4వ ర్యాంకు సాధించిన నంద్యాల జిల్లా అవుకు మండలానికి చెందిన ఉడగండ్ల రామ్చరణ్ రెడ్డి చెప్పాడు. ఐఐటీలో టాప్-1, టాప్-2 కాలేజీలైన మద్రాస్, కాన్పూర్లో ఐఐటీలో సీఎ్సఈ సీటు వస్తుందని ఆశతో ఉన్నట్టు తెలిపాడు. జేఈఈ మొయిన్స్లో 53వ ర్యాంకు, అడ్వాన్స్డ్లో 170 వ ర్యాంకు సాధించినట్టు పేర్కొన్నాడు. ఈఏపీ సెట్లో 4వ ర్యాంకు సాధించడం సంతోషంగా ఉందన్నాడు. పేదలకు సేవ చేయాలని ఆశగా ఉన్నట్టు తెలిపాడు. కా గా.. రామ్చరణ్రెడ్డి తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడు, తల్లి సచివాలయం ఉద్యోగి.
ప్రణాళికతో చదివా!
ఫార్మసీ టాపర్ హర్షవర్ధన్
ఈఏపీసెట్ ఫార్మసీ విభాగంలో కృష్ణాజిల్లా కానూరుకు చెందిన విద్యార్థి రామాయణం నాగసాయి హర్షవర్థన్ రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించాడు. ‘‘డాక్టర్ కావాలన్నది నా భవిష్యత్తు ప్రణాళిక. ఇంటర్ ప్రారంభం నుంచి ప్రణాళికాబద్ధంగా చదవడం వల్లే మొదటి ర్యాంకు సాధ్యమైంది. దీనివెనుక నా తల్లిదండ్రులు, అధ్యాపకుల కృషి ఎంతో ఉంది. నన్ను డాక్టర్గా చూడాలన్నది వారి కల. దాన్ని నేరువేరుస్తా.’’ అని తెలిపాడు.
కార్డియాలజిస్ట్ కావాలని..!
ఫార్మసీ 3వ ర్యాంకర్ అకీరానంద
ఏపీ ఈఏపీసెట్ అగ్రికల్చర్, ఫార్మశీ విభాగంలో అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలానికి చెందిన డేగల అకీరానంద వినయ్ మల్లేశ్కుమార్ రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంకు సాధించాడు. మూడో ర్యాంకు సాధించడం సంతోషంగా ఉందని, నీట్లో ర్యాంక్ సాధించి కార్డియాలజిస్ట్ గా సేవలందించాలని ఉందని తెలిపాడు. తన విజయానికి కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉందన్నాడు.
నాన్న బాటలో నడుస్తా
ఫార్మసీ 5వ ర్యాంకర్ సత్యవెంకట్
నాన్న బాటలో తాను కూడా నడుస్తానని ఈఏపీసెట్ ఫార్మసీ విభాగంలో రాష్ట్రస్థాయి 5వ ర్యాంకు సాధించిన సత్యవెంకట్ తెలిపాడు. ‘‘నాన్న రామకృష్ణ పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ప్రముఖ వైద్యులు. ఆయన నడిచిన దారిలోనే వెళ్లాలన్నది నా కోరిక. చిన్నప్పటి నుంచి ఆ కలతోనే చదివాను. ఇటీవల నీట్ పరీక్షలు రాశాను. ఏపీఈపీసెట్లో రాష్ట్ర స్థాయిలో అయిదో ర్యాంకు రావడం ఎంతో ఆనందంగా ఉంది. ఇదే ఉత్సాహంతో అనుకున్నది సాధిసా.’’ అని చెప్పాడు.