Union Minister Srinivasa Varma: ఆక్వా సమస్యపై కేంద్రం దృష్టి
ABN , Publish Date - Apr 09 , 2025 | 04:21 AM
అమెరికా సుంకాలు రాష్ట్రంలోని ఆక్వా రైతులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయని మంత్రి శ్రీనివాసవర్మ తెలిపారు. రొయ్యల ఎగుమతులపై ప్రభావం పడకుండా కేంద్రం తగిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు

సుంకాల ప్రభావం పడకుండా చూస్తాం
నేడు భీమవరంలో ఆక్వా రైతు సదస్సు: శ్రీనివాసవర్మ
రాజమహేంద్రవరం అర్బన్, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): అమెరికా సుంకాలు రాష్ట్రంలోని ఆక్వా రైతులను తీవ్రంగా ఇబ్బంది పెట్టే విషయమని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. ఆక్వా రైతు నష్టపోకుండా కేంద్రం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. రాజమహేంద్రవరంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అమెరికాకు మన దేశం నుంచి ఎగుమతయ్యే రొయ్యల్లో 45-50 శాతం ఏపీ నుంచే వెళతాయన్నారు. ట్రంప్ విధించిన టారిఫ్ ఆక్వా పరిశ్రమకు శరాఘాతంగా మారిందన్నారు. ఈ సమస్యపై వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్తో మాట్లాడానన్నారు. 9వ తేదీన భీమవరంలో ఆక్వా రైతులతో సదస్సు నిర్వహిస్తున్నామని, సుంకాల ప్రభావం నేరుగా ఆక్వా రైతులపై పడకుండా చూస్తామని చెప్పారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, ఆక్వా పరిశ్రమను కాపాడుకుంటామని కేంద్ర మంత్రి చెప్పారు.