GST Record AP: ఏప్రిల్లో జీఎస్టీ వసూళ్లు రూ.3,354 కోట్లు
ABN , Publish Date - May 02 , 2025 | 05:17 AM
ఏప్రిల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీఎస్టీ ద్వారా రూ.3,354 కోట్లు వసూలవగా, ఇది 2017 నుంచి ఇప్పటి వరకు అత్యధికం. అన్ని రకాల పన్నుల ద్వారా మొత్తం ఆదాయం రూ.4,946 కోట్లు నమోదై రాష్ట్ర ఆర్థిక పురోగతికి నిదర్శనంగా నిలిచింది

రాష్ట్రంలో 2017 నుంచి ఇదే అత్యధికం
మొత్తం పన్నుల రాబడి రూ.4,946 కోట్లు
అమరావతి, మే 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రం సాధిస్తున్న ఆర్థిక ప్రగతికి అనుగుణంగా జీఎస్టీ వసూళ్లు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. 2024 నవంబరు, డిసెంబరుల్లో నమోదైన క్షీణత నుంచి బయటపడ్డామని, ఈ ఏడాది ఏప్రిల్ నికర జీఎస్టీ వ సూళ్లు రూ.3,354 కోట్లకు చేరాయని రాష్ట్ర పన్నుల శాఖ చీఫ్ కమిషనర్ ఎ.బాబు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 2017లో జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇవే అత్యధిక వసూళ్లుగా పేర్కొన్నారు. పెట్రోలియం, మద్యంపై పన్నులు, వృత్తి పన్ను.. ఇలా అన్ని రకాల పన్నుల రాబడి ఏప్రిల్లో రూ.4,946.21 కోట్లు వచ్చిందన్నారు. గత ఆరు నెలల్లో ఇదే అత్యధికమని తెలిపారు. రాష్ట్రంలో ఊపందుకున్న ఆర్థిక వృద్ధికి, అభివృద్ధి కార్యకలాపాలకు ఇది సంకేతమన్నారు. ఏప్రిల్లో రూ.1,943 కోట్ల ఐజీఎస్టీ సెటిల్మెంట్ వచ్చిందని, జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇదే అత్యధికమని పేర్కొన్నారు. 2024 జనవరిలో రూ.1,930.95 కోట్లు వచ్చాయని తెలిపారు.