Andhra Pradesh Liquor Sales: సీన్ రివర్స్
ABN , Publish Date - May 24 , 2025 | 04:15 AM
ఏపీ సరిహద్దులోని కర్ణాటకలో మద్యం అమ్మకాలు తగ్గడంతో, కర్ణాటక మద్యం ప్రియులు ఏపీ బ్రాండ్లు తాగుతూ మద్యం షాపుల దగ్గరకు వస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం మద్యం పాలసీ మార్పుల ద్వారా మంచి, తక్కువ ధరల బ్రాండ్లు అందుబాటులో ఉంచినట్లు ఆబ్కారీ శాఖ తెలిపింది.

కర్ణాటక సరిహద్దులో తగ్గిన మద్యం అమ్మకాలు
జగన్ హయాంలో ‘ఏపీ బ్రాండ్లు’ తాగలేక కర్ణాటకకు...
ఇప్పుడు ఏపీకే పోతున్నారు
దీంతో అమ్మకాలు పడిపోయాయి
కర్ణాటక ప్రభుత్వానికి ఆబ్కారీ శాఖ నివేదిక
(బళ్లారి ఆంధ్రజ్యోతి)
‘ఏపీ బ్రాండ్లా...అమ్మ బాబోయ్’ అన్నది నిన్నటి మాట! ‘ఏపీ మద్యం బ్రాండ్లు సూపర్బ్..’ అనేది ఈనాటి మాట! అయితే, ఇవి మన మాటలు కావు. ఏపీకి సరిహద్దులోని కర్ణాటక స్వయంగా చేసిన ప్రకటన! ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ రాష్ట్రం లో అన్ని రకాల బ్రాండ్లు లభిస్తుండటం, కర్ణాటక కంటే ఏపీలో కొన్ని బ్రాండ్లు తక్కువ ధరకు దొరుకుతున్నాయని కర్ణాటక ప్రభుత్వానికి ఆబ్కారీ శాఖ నివేదించింది. దీనివల్ల ‘మన మద్యం అమ్మకాలు పడిపోయాయి’ అని తెలిపింది. నిజానికి, మాజీ సీఎం జగన్ పాలించిన ఐదేళ్లూ కర్ణాటకలో మద్యం వ్యాపారం మూడు చీర్స్, ఆరు పెగ్గులుగా వర్ధిల్లింది. తాను ఇచ్చిన మద్యం బ్రాండ్లే తాగాలి అనే రీతిలో జగన్ పాలన సాగించారు. కొందరు అక్కడి బ్రాండ్లు తాగలేక కర్ణాటక నుంచి మద్యం తీసుకువెళ్లి తాగేవారు. ఊరి దేవరలు, ఇతర వేడుకలకు, రాజకీయ కార్యక్రమాలకు కర్ణాటక నుంచి మద్యాన్ని తీసుకువెళ్లేవారు. ఈ కారణంగా అప్పట్లో కర్ణాటక ప్రభుత్వానికి మద్యం ద్వారా వచ్చే ఆదాయం ఎక్కువగా ఉండేది. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. కర్ణాటక మద్యం ప్రియులే సరిహద్దు దాటి ఏపీలోని మద్యం షాపుల వద్ద బారులు తీరుతున్నారని ఆ నివేదికలో ఆబ్కారీ శాఖ తెలిపింది.
ఏపీకే కర్ణాటక బ్రాండ్లు
కర్ణాటకలోని బళ్లారి, విజయనగర, రాయచూరు, కొప్పళ, చిత్రదుర్గం జిల్లాలు ఏపీ సరిహద్దులో ఉన్నాయి. కర్నూలు, అనంతపురం, పుట్టపర్తి జిల్లాల్లోని చాలా గ్రామాలు కర్ణాటకలోకి చొచ్చుకువచ్చినట్లు ఉంటాయి. వైసీపీ హయాంలో కర్ణాటక సరిహద్దులో బార్లు, బ్రాందీ షాపులు భారీగా ఉండేవి. సుమారు 200 మద్యం దుకాణాలు, హోటళ్లు, సీఎల్-2, సీఎల్-4, సీఎల్-7 (కంట్రీ లిక్కర్) షాపులు ఉండేవి. కానీ చంద్రబాబు మరోమారు ముఖ్యమంత్రి అయ్యాక మద్యం పాలసీ మార్చారు. అన్ని రకాల మద్యం బ్రాండ్లను అందుబాటులో ఉంచారు. మైసూరులో తయారవుతున్న మద్యం బ్రాండ్లను కూడా చంద్రబాబు ప్రభుత్వం టెండర్లు వేయడానికి ఆహ్వానిస్తోంది. ఈ చర్యలన్నీ కర్ణాటక మద్యం ఆదాయంపై ప్రభావం చూపుతున్నట్లు ఆబ్కారీ శాఖ తన నివేదికలో పేర్కొంది.
ఏపీలో తక్కువ రేటుకు మంచి బ్రాండ్లు
‘‘ఆంధ్రా సరిహద్దులోని కర్ణాటక ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు బాగా తగ్గాయి. ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత అక్కడ మద్యం పాలసీ మారింది. అన్ని రకాల బ్రాండ్లు దొరుకుతున్నాయి. రేటు కూడా తక్కువగా ఉంది. ఇంతకు ముందు జగన్ సీఎంగా ఉన్నపుడు అక్కడ లిక్కర్ బాగలేదని కర్ణాటక నుంచి ఎక్కవగా తీసుకుపోయేవారు. ఇప్పుడు అక్కడ పరిస్థితి మారింది. కొన్ని లిక్కర్ బ్రాండ్లు కర్ణాటకతో కూడా టయ్యప్ అయ్యారు. అక్కడ అన్ని రకాల మంచి మద్యం బ్రాండ్లు, బీర్లు, విస్కీ, బ్రాందీ లభిస్తున్నాయి. ఇదే విషయాన్ని కర్ణాటక ప్రభుత్వానికి నివేదించాం’’
- ఆబ్కారీ శాఖ కమిషనర్ మల్లిఖార్జున