Damacharla Janardhana Rao: ఆంధ్రజ్యోతి ఆలోచనలను ఆచరిస్తాం
ABN , Publish Date - Jun 29 , 2025 | 03:49 AM
సమాజ హితం కోసం ఆంధ్రజ్యోతి చేసే ప్రతి ఒక్క ఆలోచననూ అమలు చేస్తామని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ హామీ ఇచ్చారు.

సమాజ హితం కోసం పాటుపడతాం
‘అక్షరం అండగా’ సభలో ఎమ్మెల్యే జనార్దన్
కార్యక్రమ రూపకర్త, ‘ఆంధ్రజ్యోతి’ డైరెక్టర్ వేమూరి ఆదిత్యకు ప్రత్యేక అభినందనలు
ఒంగోలు ఎన్టీఆర్ పార్కులో 70.50 లక్షల అభివృద్ధి పనులు ప్రారంభం
ఒంగోలు, జూన్ 28(ఆంధ్రజ్యోతి): సమాజ హితం కోసం ‘ఆంధ్రజ్యోతి’ చేసే ప్రతి ఒక్క ఆలోచననూ అమలు చేస్తామని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ హామీ ఇచ్చారు. ఒంగోలు నగరంలోని 37వ డివిజన్ ఎన్టీఆర్పార్కులో శనివారం రాత్రి జరిగిన ‘అక్షరం అండగా’ సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పట్టణ ప్రాంత సమస్యల పరిష్కారం కోసం ‘అక్షరం అండగా... పరిష్కారమే అజెండాగా’ పేరుతో కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. దీన్ని రూపకల్పన చేసిన ‘ఆంధ్రజ్యోతి’ డైరెక్టర్ వేమూరి ఆదిత్యను ప్రత్యేకంగా అభినందించారు. నిధుల కొరత తీవ్రంగా ఉన్నప్పటికి 37వ డివిజన్లో ఐదు నెలల్లో రూ.2.60 కోట్లతో పనులు చేపట్టామని తెలిపారు. ప్రజలకు మేలుచేసే ఇలాంటి కార్యక్రమాలను ఇంకా కొనసాగించాలని కోరారు.
‘ఆక్షరం అండగా’ కార్యక్రమంలో ప్రజలు ప్రస్తావించిన అన్ని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. సంస్థ డైరెక్టర్ వేమూరి ఆదిత్య మాట్లాడుతూ ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ పేరుతో ‘ఆంధ్రజ్యోతి’ చేపట్టిన కార్యక్రమానికి ఒంగోలులో మంచి స్పందన వచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా పెద్దఎత్తున అభివృద్ధి పనులు చేపట్టడంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. తొలుత ఎన్టీఆర్ పార్కులో చేపట్టిన రూ.70.50 లక్షల విలువైన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే జనార్దన్, వేమూరి ఆదిత్య ప్రారంభించారు. అందుకు సంబంధించిన శిలాఫలకాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. పార్కులో జరిగిన లెవలింగ్, వాకింగ్ ట్రాక్ ఆధునికీకరణ పనులు, పిల్లల కోసం ఏర్పాటుచేసిన ఆట వస్తువులు తదితరాలను వారు పరిశీలించారు. ‘ఆంధ్రజ్యోతి’ ఒంగోలు యూనిట్ మేనేజర్ ఐవీ సుబ్బారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ వెంకటేశ్వరరావు, స్థానిక కార్పొరేటర్ చెన్నుపాటి వేణుగోపాల్, పెద్దసంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు.