Kalyanadurgam : అదిరిందయ్యా.. దుర్గం..!
ABN , Publish Date - Mar 14 , 2025 | 12:34 AM
పట్టణం అంటేనే గుర్తొచ్చేవి ఇరుకు రోడ్లు, వాటిపైనే మురుగు ప్రవాహాలు, దుర్గంధం, ఎటుచూసినా చెత్తాచెదారం. పట్టణ ప్రజలు నిత్య నరకం అనుభవించేవారు. దశాబ్దాలుగా పట్టణ సమస్యలు అలానే ఉండేవి. గత వైసీపీ హయాంలో ఒకట్రెండు పనులు హడావుడిగా చేపట్టారు, అర్ధంతరంగా ఆపేశారు. దీంతో పట్టణ ప్రజలకు కష్టాలు తప్పలేదు. కూటమి అధికారం చేపట్టాక అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి. ఎటుచూసినా రోడ్ల విస్తరణ పనులు చేపడుతున్నారు. రోడ్లపై మురుగు ..

కళ్యాణదుర్గంలో అభివృద్ధి పరుగులు
జోరుగా రోడ్ల విస్తరణ, డ్రైనేజీ కాల్వల నిర్మాణం
ప్రజలకు తప్పిన మురుగు నీటి కష్టాలు
కళ్యాణదుర్గం, మార్చి 13(ఆంధ్రజ్యోతి): పట్టణం అంటేనే గుర్తొచ్చేవి ఇరుకు రోడ్లు, వాటిపైనే మురుగు ప్రవాహాలు, దుర్గంధం, ఎటుచూసినా చెత్తాచెదారం. పట్టణ ప్రజలు నిత్య నరకం అనుభవించేవారు. దశాబ్దాలుగా పట్టణ సమస్యలు అలానే ఉండేవి. గత వైసీపీ హయాంలో ఒకట్రెండు పనులు హడావుడిగా చేపట్టారు, అర్ధంతరంగా ఆపేశారు. దీంతో పట్టణ ప్రజలకు కష్టాలు తప్పలేదు. కూటమి అధికారం చేపట్టాక అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి. ఎటుచూసినా రోడ్ల విస్తరణ పనులు చేపడుతున్నారు. రోడ్లపై మురుగు
ప్రవాహాలను ఆపే దిశగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు నిర్మిస్తున్నారు. కల్వర్టులు సైతం కడుతున్నారు. ప్రస్తుతం దాదాపు రూ.15 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. మరో రూ.30 కోట్ల పనులు ప్రతిపాదన దశలో ఉన్నాయి. దీంతో మురుగునీటి కష్టాలు తీరుతున్నాయని పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీ పాలనలో అటకెక్కిన అభివృద్ధి
మేజర్ పంచాయతీగా ఉన్న కళ్యాణదుర్గాన్ని 2012లో మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేశారు. తొలి కౌన్సిల్ ఏర్పడినపుడు పట్టణంలో అక్కడక్కడా సీసీ రోడ్లు వేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక మున్సిపాలిటీలో అభివృద్ధి అటకెక్కింది. ఏఐబీబీ పథకం ద్వారా నీరందించే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి, పునాదుల దశలోనే ఆపేశారు. పట్టణంలోని ప్రధాన రోడ్లపై మురుగు చేరి, చెత్తాచెదారంతో అధ్వానంగా ఉండేది. కూటమి అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. కాలువల ఏర్పాటు, ఆదాయ వనరుల పెంపు తదితర పనులు జోరుగా సాగుతున్నాయి.
మారుతున్న రూపురేఖలు
పట్టణంలో డ్రైనేజీ సమస్య దశాబ్దాలుగా ఉంది. టీడీపీ హయాంలో అనంతపురం-రాయదుర్గం ప్రధాన రహదారిని విస్తరించి, కాలువలు నిర్మించారు. హిందూపురం రోడ్డు దిశగా పనులు చేపట్టారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ వాల్మీకి సర్కిల్ నుంచి కంబదూరు రింగు రోడ్డు వరకు హడావుడిగా రోడ్డు పనులు మొదలెట్టింది. కొంత వరకు చేసి, ఆపేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక పట్టణాభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వాల్మీకి, గాంధీ, టీ సర్కిళ్లలోని ప్రధాన రహదారులన్నింటినీ విస్తరిస్తున్నారు. అంతటితో ఆగకుండా వాటి పక్కనే అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు సైతం నిర్మిస్తున్నారు. దీంతో ఇరుకు రోడ్లు, మురుగు సమస్యలు తీరనున్నాయి. ఈ పనులతో పట్టణ రూపురేఖలే మారిపోతున్నాయి. పాత బస్టాండులో కల్వర్టు సైతం కడుతున్నారు. అలా.. పట్టణమంతా అభివృద్ధి పనులు చేస్తున్నారు. శెట్టూరు రోడ్డు పక్కనే డంపింగ్ యార్డు ఉండేది. అక్కడ చెత్త వేస్తుండడంతో స్థానికులు ఇబ్బందులు పడేవారు. ఆ చెత్తను రీసైక్లింగ్ చేయడం ద్వారా దుర్గంధానికి చెక్ పెట్టారు. ఆ స్థలం కబ్జా కాకుండా మున్సిపాలిటీ పేరున రిజిస్ట్రేషన చేశారు. ప్రహరీ నిర్మాణానికి సైతం చర్యలు చేపడుతున్నారు. ఆ స్థలంలో మున్సిపాలిటీ, మార్కెట్ భవనాలు నిర్మించాలని యోచిస్తున్నారు.
రూ.30 కోట్లతో ప్రతిపాదనలు
డంపింగ్ యార్డు స్థలంలో రూ.3 కోట్లతో మున్సిపల్ భవన, రూ.5 కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్, పాత బస్టాండులో రూ.1.80 కోట్లతో డ్రైనేజీ, టీ సర్కిల్లో రూ.15 కోట్లతో వాణిజ్య సముదాయం నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాం. పట్టణంలో అభివృద్ధి పనులకు రూ.30 కోట్లు అవసరమని ప్రతిపాదించాం.
- వంశీకృష్ణ భార్గవ్, మున్సిపల్ కమిషనర్, కళ్యాణదుర్గం
ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం
కళ్యాణదుర్గాన్ని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం. వైసీపీ హయాంలో రోడ్లపైనే మురుగు నీరు పారుతూ, చెత్తాచెదారం నిండిపోయి అధ్వానంగా ఉండేది. కూటమి అధికారం చేపట్టాక రోడ్డు విస్తరణ, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, కల్వర్టు పనులు వేగంగా సాగుతున్నాయి. మున్సిపాలిటీకి ప్రత్యేక నిధులు కేటాయించాలని సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లాం. - అమిలినేని సురేంద్రబాబు, ఎమ్మెల్యే
మరిన్ని అనంతపురం వార్తల కోసం....