Anakapalli: అమెరికా పౌరులే టార్గెట్..
ABN , Publish Date - May 23 , 2025 | 05:24 AM
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం కేంద్రంగా అమెరికా పౌరులను టార్గెట్ చేస్తూ సైబర్ మోసాలు చేసిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వీఓఐపీ కాల్స్ ద్వారా అమెజాన్ కస్టమర్లను మోసం చేసి కోట్లు కాజేశారు.

అమెజాన్ కస్టమర్లకు మెసేజ్లు పంపి ఎర
గిఫ్ట్ కోడ్ పేరిట ఖాతాల్లో డబ్బులు మాయం
అచ్యుతాపురం కేంద్రంగా సైబర్ మోసాలు..33 మంది అరెస్ట్
అనకాపల్లి, మే 22 (ఆంధ్రజ్యోతి): అమెరికాలోని అమెజాన్ కస్టమర్లను టార్గెట్ చేసుకుని.. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం కేంద్రంగా సైబర్ మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈశాన్య, ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన యువతీ యువకులతో కాల్ సెంటర్ నిర్వహిస్తూ అమెరికా, తదితర దేశాల ప్రజలను లక్ష్యంగా చేసుకున్నట్టు గుర్తించినట్టు ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. సైబర్ ముఠా వివరాలను వెల్లడించారు. ఈ నెల 20వ తేదీ అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి అందించిన సమాచారంతో అచ్యుతాపురం భోగాపురం వీధిలో పవన్ రెసిడెన్సీతో పాటు మరో రెండు అపార్టుమెంట్లలో ఆకస్మిక సోదాలు నిర్వహించి మేఘాలయ,సిక్కం తదితర ఈశాన్య రాష్ట్రాలకు చెందిన 33 మంది సైబర్ నేరగాళ్లను అరెస్టు చేసినట్టు చెప్పారు. 3 లక్షలు నగదు, 32 హార్డ్ డిస్క్లు, 32 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ముంబై, రాజస్థాన్కు చెందిన పునీత్గోస్వామి, అవిహంత్ దాగా ఆధ్వర్యంలో మోసాలు సాగినట్టు తెలిపారు. 15 కోట్ల నుంచి 20కోట్ల వరకు కాజేసినట్టు గుర్తించామన్నారు.
ఎలా మోసం చేస్తారంటే... సైబర్ ముఠా వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్ (వీఓఐపీ)ను ఉపయోగించుకుని అమెరికాలోని అమెజాన్ కస్టమర్లకు మెసేజ్లు పంపుతుంటారు. ముందుగా..ఏదైనా వస్తువు కొన్నారా..? అని మెసేజ్ పంపుతారు.అటు నుంచి కస్టమర్ స్పందించి... కొనలేదని సమాధానమిస్తే.. మీ బ్యాంకు అకౌంట్ను వాడుకొని ఎవరో వస్తువు కొనుగోలు చేసినట్టు పక్కనే ఉండే మరో ముఠా సభ్యుడు కనెక్ట్ అవుతాడు. మీ అకౌంట్లో డబ్బు పోకుండా ఉండాలంటే గిఫ్ట్ కోడ్ను ఎంటర్ చేయాలని సూచిస్తారని, నిజమేనని నమ్మి వారు అడిగిన బ్యాంకు ఖాతాల వివరాలు చెప్పగానే.. డబ్బులు కాజేస్తున్నారని ఎస్పీ తెలిపారు.