AP Chambers Request: అమరావతిలో ఎన్ఐఆర్డీ అండ్ పీఆర్
ABN , Publish Date - May 27 , 2025 | 05:15 AM
అమరావతిలో జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ సంస్థ (ఎన్ఐఆర్డీ అండ్ పీఆర్) ఏర్పాటు చేయాలని ఏపీ పరిశ్రమల సమాఖ్య కేంద్ర ప్రభుత్వానికి వినతి చేసింది. రాష్ట్రంలో గ్రామీణ ఉపాధి పథకాలు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు, మరియు పరిశ్రమల అభివృద్ధికి మద్దతు ఇవ్వాలని కూడా సూచించారు.

ఏర్పాటుకు పరిశ్రమల సమాఖ్య వినతి
అమరావతి, మే 26(ఆంధ్రజ్యోతి): అమరావతిలో జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ సంస్థ (ఎన్ఐఆర్డీ అండ్ పీఆర్)ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర వాణిజ్య, పరిశ్రమల సమాఖ్య (ఏపీ చాంబర్స్) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఏపీ చాంబర్స్ అధ్యక్షుడు పొట్లూరి భాస్కరరావు నేతృత్వంలోని ప్రతినిధి బృందం సోమవారం కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ను కలిసి వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర గ్రామీణ, పారిశ్రామికాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై మంత్రితో చర్చించారు. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలకు మద్దతుగా నరేగా (ఎంఎన్ఆర్ఈజీఏ) తరహాలో గ్రామీణ ఉపాధి పథకాన్ని ప్రారంభించాలని కేంద్ర మంత్రిని కోరారు. నిరుద్యోగ యువతకు పరిశ్రమల సంబంధిత నైపుణ్యాలను పెంపొందించేందుకు గ్రామీణ నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. పంట ప్రాసెసింగ్, ఎగుమతులకు మద్దతుగా మామిడి, అరటి, పామాయిల్ కోసం కమోడిటీ బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. పెద్ద పరిశ్రమలను ప్రోత్సహించడానికి ఎంపిక చేసిన ప్రదేశాల్లో రక్షణ, ఏరోస్పేస్ తయారీ క్లస్టర్లను ఏర్పాటు చేయాలని చెప్పారు. నెట్వర్క్ నాణ్యతను పెంచడానికి సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించడం ద్వారా ఏపీలోని వెనుకబడిన ప్రాంతాల్లో టెలికం కవరేజీని మెరుగుపరచాలని సూచించారు.