AP CM Compensation: 25 లక్షల పరిహారం
ABN , Publish Date - May 01 , 2025 | 05:29 AM
సింహాచలంలో గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందగా, ముఖ్యమంత్రి చంద్రబాబు 25 లక్షల పరిహారం ప్రకటించారు. నేషనల్ లీడర్లు, పవన్ కల్యాణ్, హోం మంత్రి అనిత స్పందించారు.

కుటుంబంలో ఒకరికి ఔట్సోర్సింగ్ ఉద్యోగం
క్షతగాత్రులకు రూ.3 లక్షల సాయం
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు
అమరావతి, విశాఖ, నెల్లూరు, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): సింహాచలం క్షేత్రంలో గోడకూలి భక్తులు మృతి చెందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా అధికారులు, మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, డోలా బాలవీరాంజనేయస్వామి, వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, విశాఖ ఎంపీ భరత్, సింహాచల దేవాలయ ధర్మకర్త అశోక్ గజపతిరాజుతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఘటన జరిగిన తీరు అడిగి తెలుసుకున్నారు. ఘటనపై ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీని సీఎం నియమించారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం, క్షతగాత్రులకు రూ.3 లక్షల సాయం అందించనున్నట్లు ప్రకటించారు. మృతుల కుటుంబాల్లో ఒకరికి దేవదాయశాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వాలని, గోడ కూలిన ప్రదేశంలో శిథిలాలను వెంటనే తొలగించి భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశించారు. భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు నిర్దేశించారు. బాధిత కుటుంబాలను పరామర్శించి, ధైర్యం చెప్పాల్సిందిగా మంత్రులను ఆదేశించారు. విచారణ కమిటీకి మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేశ్కుమార్ను చైర్మన్గా, ఐపీఎస్ అధికారి ఆకే రవికృష్ణ, ఇరిగేషన్ ఈఎన్సీ వెంకటేశ్వరరావును సభ్యులుగా నియమించారు. ఈ మేరకు సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీచేశారు. కమిటీ 72 గంటల్లోగా ప్రాథమిక నివేదిక ఇవ్వాలని, 30 రోజుల్లోగా పూర్తిస్థాయి నివేదిక అందజేయాలని ఆదేశించారు.
అర్ధరాత్రి ఏమి జరగిందంటే..
సింహగిరిపై గోడ కూలి ఏడుగురు భక్తులు మృతిచెందిన ఘటనపై విశాఖ జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక పంపింది. స్వామిని దర్శించుకునేందుకు రూ.300 టికెట్ క్యూలైన్లో నిల్చొన్న భక్తులపై కొత్తగా నిర్మించిన గోడ కూలడంతో ఏడుగురు మృతిచెందగా, మరో భక్తుడు తీవ్రంగా గాయపడినట్టు పేర్కొంది. తీవ్రంగా గాయపడిన ప్రవీణ్కుమార్ కాలు ఫ్రాక్చర్ కావడంతో విమ్స్లో చికిత్స పొందుతున్నారని వివరించింది.
రాష్ట్రపతి, ప్రధాని విచారం
చందనోత్సవంలో గోడ కూలిన ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. ఇది బాధాకరమని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు. దైవదర్శనం కోసం వేచి ఉన్న భక్తుల్లో మహిళలు సహా అనేక మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘నా ఆలోచనలు, ప్రార్థనలు దుఃఖిస్తున్న కుటుంబాలతో ఉన్నాయి. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు ఎక్స్ గ్రేషియా అందిస్తాం’’ అని మోదీ వెల్లడించారు.
పవన్ కల్యాణ్ దిగ్ర్భాంతి
సింహచలంలో గోడకూలిన ఘటనలో ఏడుగురు భక్తులు మరణించడం దురదృష్టకరమని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలిసి తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యానని తెలిపారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతిచెందిన వారిలో ఇద్దరు జనసైనికులు ఉన్నారని తెలిసి చింతించినట్టు తెలిపారు.
ఆసాంతం బాధితుల వెంట అనిత
హోంమంత్రి తీరుకు పవన్ అభినందన
ప్రమాద ఘటన గురించి తెలిసినప్పటినుంచీ, బాధిత కుటుంబాలు మృతదేహాలతో కేజీహెచ్ నుంచి ఇళ్లకు చేరుకునేవరకు హోం మంత్రి అనిత్ వారి వెంటే నిలిచారు. బాధిత కుటుంబసభ్యులకు ధైర్యం చెబుతూ ఆస్పత్రిలో ఆసాంతం వారితోనే గడిపారు. సంఘటన జరిగిన వెంటనే హోంమంత్రి అనిత స్పందించిన తీరును డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఒక ప్రకటనలో అభినందించారు. బాధిత కుటుంబ సభ్యులను మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, విష్ణుకుమార్రాజు, వంశీకృష్ణ శ్రీనివాస్ తదితరులు పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. మధ్యాహ్నం కేజీహెచ్ మార్చురీ వద్దకు వచ్చి బాధితుల కుటుంబ సభ్యులను ఓదార్చారు.
Also Read:
సామ్ కర్రన్ సూపర్ ఇన్నింగ్స్.. ఛాహల్ హ్యాట్రిక్
రిటైర్మెంట్పై బాంబు పేల్చిన ధోని
ఇలాంటి దోపిడీ ఎక్కడైనా చూశారా..
For More Andhra Pradesh News and Telugu News..