Central Law Secretary : ఉత్తరాఖండ్ హైకోర్టు సీజేగా జస్టిస్ నరేందర్
ABN , Publish Date - Dec 24 , 2024 | 04:41 AM
ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జి.నరేందర్ నియమితులయ్యారు.

కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ
అమరావతి, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జి.నరేందర్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి సోమవారం నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రస్తుతం ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న ఆయనను పదోన్నతిపై ఉత్తరాఖండ్ హైకోర్టు సీజేగా నియమించాలని సెప్టెంబరులో అప్పటి సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. దీనికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలపడంతో కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. జస్టిస్ నరేందర్ 1964 జనవరి 10న తమిళనాడులో జన్మించారు. బీఏ, ఎల్ఎల్బీ పూర్తి చేసి1989 ఆగస్టు 23న తమిళనాడు బార్ కౌన్సిల్లో పేరు నమోదు చేసుకున్నారు. 1992 వరకు మద్రాసు హైకోర్టులో ప్రాక్టీస్ చేసి, 1993లో కర్ణాటకకు మార్చుకొని బార్ కౌన్సిల్లో పేరు నమోదు చేయించుకున్నారు. ఓబీసీ వర్గానికి చెందిన ఆయన 2015 జనవరి 2న కర్ణాటక హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2017లో శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. 2023 అక్టోబరులో ఏపీ హైకోర్టుకు బదిలీపై వచ్చారు.