Malegaon blast case: కీలక నిందితుడు లెఫ్టినెంట్ కల్నల్ పురోహిత్కు చుక్కెదురు
ABN , First Publish Date - 2023-01-02T14:20:16+05:30 IST
సంచలనం సృష్టించిన మాలేగావ్ పేలుడు కేసు నుంచి తనకు విముక్తి కల్పించాలని కోరుతూ ప్రధాన నిందితుడు లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ శ్రీకాంత్ పురోహిత్..

ముంబై: సంచలనం సృష్టించిన మాలేగావ్ పేలుడు కేసు (Malegaon blast case) నుంచి తనకు విముక్తి కల్పించాలని కోరుతూ ప్రధాన నిందితుడు లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ శ్రీకాంత్ పురోహిత్ (Prasad Shrikant Purohit) చేసిన విజ్ఞప్తిని ముంబై హైకోర్టు సోమవారంనాడు తోసిపుచ్చింది. 2008 సెప్టెంబర్లో జరిగిన పేలుడు కేసులో ఆరుగురు మృతి చెందగా, 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ కేసులో బీజేపీ ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ సహా పురోహిత్, మరో ఆరుగురు విచారణను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం వీరంతా బెయిలుపై ఉన్నారు.
కాగా, ఈ కేసు నుంచి విముక్తి కల్పించాలంటూ శ్రీకాంత్ పురోహిత్ చేసిన వాదనను న్యాయమూర్తులు ఏఎస్ గడ్కరి, ప్రకాష్ నాయక్లతో కూడిన ధర్మాసనం తోసిప్చుచింది. అధికారిక డ్యూటీలో లేనందుకు ఆయనను ప్రాసిక్యూషన్ చేసేందుకు ఎలాంటి అనుమతులు అవసరం లేదని పేర్కొంది. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో మతపరంగా అత్యంత సున్నిత ప్రాంతంగా పేరున్న మాలేగావ్లో 2008 సెప్టెంబర్ 29న భారీ పేలుడు చోటుచేసుకుంది. అక్కడి మసీదుకు సమీపంలో ఒక మోటారు సైకిలుకు పేలుడు పదార్ధాన్ని అమర్చి పేల్చేశారు. ఆరుగురు ప్రాణాలు కోల్పోగా,100 మందికి పైగా గాయపడిన ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. మహారాష్ట్ర పోలీసులు ఈ కేసులో ప్రాథమిక దర్యాప్తు జరిపి పేలుడు జరిగిన మోటారు బైక్ ప్రగ్యాఠాగూర్ పేరుతో రిజిస్టరయినట్టు గుర్తించి ఆమెను అరెస్టు చేశారు. ఆ తర్వాత కేసును ఎన్ఐఏకి అప్పగించారు.