Share News

ఆహా ఏమిరుచి.. గుమ్మడి ఇగురు కూర ఇలా చేస్తే ఇక మీరు..

ABN , Publish Date - Jun 01 , 2025 | 12:49 PM

గుమ్మడి ఇగురు కూర ఎలా చేయాలో మీకు తెలుసా.., అలాగే ఆ వంటకంలో ఏమేమి వాడతారో కూడా తెలుసా.. అసలు ఇది ఎలా తయారు చేయాలో, ఆ వంటకంలో ఏమేమి వాడతారో తెలుసుకుందాం పందండి. ఇంకెందుకు ఆలస్యం.. చదివేయండి మరి..

ఆహా ఏమిరుచి.. గుమ్మడి ఇగురు కూర ఇలా చేస్తే ఇక మీరు..

‘‘అమ్ల మారీచ లవణ గుడాదికములు

దండిగా వండి గొప్ప పసిండగరిటె

వేఁడివేఁడి, వడ్డించె వేఁడివేఁడి,

నాతి కూష్మాండఖండ కాండంబు లొకతె’’

దామరల వెంగళ భూపాలుడు తెలుగు వంటకాలను అత్యధికంగా ప్రస్తావించిన ‘బహులాశ్వచరితం’లో పద్యం ఇది. చింత పండు, మిరియాలపొడి, ఉప్పు, బెల్లం కలిపి దండిగా మగ్గించిన గుమ్మడికాయ ఇగురు కూరని వేడివేడిగా వేడి వేడి, బంగారు గరిటెతో వడ్డించారట!

మనిషి శాకాహారానికి అలవాటు పడ్డాక మొదటగా వండుకున్నది ఇగురు కూరనే! కొన్ని వేల ఏళ్ళ ప్రాచీనత ఇగురుకూరకు ఉంది! ఒక్కో ఆహార ద్రవ్యం రుచిని తెలుసుకుంటూ, వాటితో ఇగురుకూరలు వండుకుంటూ వచ్చాడు మనిషి! కానీ, ఇప్పట్లా అమితంగా అల్లం వెల్లుల్లి పేస్టు, నూనె, చింతపండు అధిక రసగతాలను మేళవించకుండా సహజంగా వండిన ఆరోగ్యకరమైన కూర ఇగురుకూర.

రాయలవారు ఆముక్తమాల్యదలో ‘‘ముకు మందై యేర్చు నావం జిగుర్కొను పచ్చళ్లు’’ అంటూ, ఇగురుకూరలో కొద్దిగా ఆవపిండి కలిపితే దానిఘాటుకు జలుబు నీళ్ళు వదిలి పోయి, ముక్కుమందులా పనిచేస్తుందని చెప్పాడు. క్రీడాభిరామంలో వల్లభరాయుడు ‘ఇగురావకూర’ గురించి ప్రస్తావించాడు. ‘తరుణం సర్షపశాకం’ అనే ప్రయోగాన్ని బట్టి ఆవకూర అంటే లేత ఆవ ఆకులతో వండిన కూర అని, ఉత్తరాదివారు రోటీల్లో నంజుకోవటానికి ఆవాకుల కూర వాడతారనీ ఆచార్య తిరుమల రామచంద్ర రాశారు. కానీ, ఆవాకులతో కూర వండే అలవాటు తెలుగు వారికి ఏనాడూ లేదు. అవి వాతం చేస్తాయని భోజనకుతూహలం గ్రంథం పేర్కొంది!


ఈ పద్యంలో గుమ్మడికాయ కూరనిదండిగా అంటే ఇగురించి వండినట్టు పేర్కొన్నారు. తడంతా పోయి, కూరమెత్తగా దగ్గర కొచ్చేదాకా మగ్గించింది ఇగురుకూర! తాలింపు కూర అనీ పిలుస్తారు. ఒక కిలో కూరగాయ ముక్కలకు రెండు టేబుల్‌ స్పూన్ల నూనె (30 ఎం.ఎల్‌) సరిపెట్టాలి!

‘ఇగ్‌.. చిగ్‌’ అని రెండు మూలద్రావిడ ధాతు వులున్నాయి. ‘ఇగ్‌’ లోంచి ఇగురు (ఇగిరి పోవ టం, మొగ్గ తొడగటం), ‘చిగ్‌’ లోంచి చిగురు (మారాకు వేయటం) ఏర్పడ్డాయి. తెలుగులో ఇగురుని కన్నడంలో ‘ఇగరు’ అంటారు.


‘‘ఒకరికి ఇగురుకూర ఇష్టం, ఒకరికిపులుసు కూర ఇష్టం’’గా కాకుండా మనుషులు

ఐకమత్యంగా ఉండాలని సామెత. మిరప కాయలు మనకు పరిచయం అయ్యేవరకూ పులుసు కూరలు విందు భోజనాలకే పరిమితంగా ఉండేవి. తమిళంలో పోరియల్‌, కన్నడంలో పల్య, మలయాళంలో ‘పురట్టి’, తెలుగులో పొరటు, హిందీలో ‘సబ్‌జీ’ ఇలా ఇగురుకూర్లని పిలుస్తారు.

దుంపకూరలు, ములక్కాడల్లాంటి కఠిన పదార్థాల్ని నీళ్ళలో ఉడికించి, తర్వాత కొద్దిగా నూనె వేసి మగ్గబెట్టాలి. వంకాయ, బెండకాయ లాంటి కూరల్ని ఉడికించకుండానే మగ్గబెట్ట వచ్చు! ఎక్కువగా నీరుండే బీర, సొర, పొట్ల, కాకర, దొండ లాంటి కూరగాయల్ని ఉప్పు వేసి పిసికి నీరు పిండేసి తక్కువ నూనెలో మగ్గబెట్టాలి.


కోమలమైన ఒక ఆడపిల్లని ‘ఇగురుబోడి’ అన్నట్టే, కూరగాయల కోమలత్వం చెడకుండా వండే కూరని ఇగురుకూర అంటారు. నీరు ఇగిరేలా వండాల్సిన ఇగురు కూరని నీళ్ళు పోసి హోటళ్ళవాళ్లు కేటరర్లు అశాస్త్రీయంగా వండు తున్నారు. ఇగురు కూరని ముద్దకూరగా వండుకుంటే, ఎక్కువ కూర, తక్కువ అన్నం కమ్మగా తినటానికి అనువుగా ఉంటుంది!

భాండీలో రెండు చెంచాల నూనె వేసి ఇంగువ, తాలింపు గింజలు, మిర్చి, కరివేపాకు వగైరా వేగించి, ఎర్రగుమ్మడి కాయముక్కల్ని అందులో వేసి నీళ్ళ మూతబెట్టి కాసేపు మగ్గ నిచ్చి, అందులో తగినంత చింతపండు రసం, ఉప్పు, కొబ్బరి, కొత్తిమీర, రెండు బెల్లంముక్కలు కూడా వేసి ఇంకొంచెం మగ్గనిస్తే అదే గుమ్మడి కాయ ఇగురుకూర! చరిత్రకందని వేలయేళ్ల నాటి తెలుగు కూర ఇది. విందు భోజనాలకు ఆనాడూ గుమ్మడి ఇగురుకూర ప్రసిద్ధి! ఎర్ర గుమ్మడినీ, బూడిదగుమ్మడినీ దిష్టి తీయటానికి తప్ప కూరగాయగా వండుకోవటం మరచిన తెలుగువారికి ఈ పద్యం ఓ గమనింపు.

- డా. జి వి పూర్ణచందు, 94401 72642


గుల్‌ఖండ్‌ మిల్క్‌షేక్‌

కావలసిన పదార్థాలు: చల్లని పాలు - కప్పు, గుల్‌ఖండ్‌ - రెండు స్పూన్లు, రోజ్‌ సిరప్‌ - రెండు స్పూన్లు, ఏదైనా ఐస్‌క్రీమ్‌ - ఓ స్కూప్‌.

తయారుచేసే విధానం: గుల్‌ఖండ్‌, పాలు, సగం స్కూప్‌ ఐస్‌క్రీమ్‌, రోజ్‌ సిరప్‌ను మిక్సీలో తిప్పాలి. ఈ ద్రావణాన్ని గ్లాసుల్లో వేసి పైన మిగతా ఐస్‌క్రీమ్‌, కాస్త సిరప్‌ వేస్తే సరి.

కొత్తిమీర ఉల్లి పరాటా

book10.2.jpg


కావలసిన పదార్థాలు:

గోధుమ పిండి - 3 కప్పులు, కొత్తిమీర తరుగు - కప్పు, జీలకర్ర- స్పూను, ఉల్లి ముక్కలు - అర కప్పు, పచ్చి మిర్చి ముక్కలు - స్పూను, మిరియాలు - స్పూను, నీళ్లు, నూనె, ఉప్పు - తగినంత.

తయారుచేసే విధానం: మిరియాలు, జీలకర్రను వేయించి పొడి చేసుకోవాలి. లోతైన, వెడల్పాటి గిన్నెలో గోధుమ పిండి, కొత్తిమీర తరుగు, ఉల్లి, జీలకర్ర, మిరియాల పొడి, ఉప్పు వేసి అన్నిటినీ బాగా కలపాలి. తగినంత నీళ్లను చేర్చి పిండిలా చేసుకోవాలి. దీన్ని 15 చిన్న ముద్దలుగా విభజించి, ఒక్కో ముద్దను రొట్టెలా వత్తుకుని పెనం మీద కాస్త నూనె వేసి, అటూ ఇటూ దోరగా కాలిస్తే కొత్తిమీర, ఉల్లి పరాటా సిద్ధం.


ఈ వార్తలు కూడా చదవండి.

నేడు స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఎంతకు చేరాయంటే..

చిన్న తేడానైనా పసిగట్టేస్తున్నారు...

Read Latest Telangana News and National News

Updated Date - Jun 01 , 2025 | 12:50 PM