చద్దన్నం.. ఓ పవిత్రాహారం
ABN , Publish Date - Jun 08 , 2025 | 01:25 PM
రాత్రంతా చల్లలో నానిన అన్నాన్ని ఉదయాన్నే గ్రామదేవతలకు చద్దినైవేద్యం పెడతారు. దేవతల ఉగ్ర రూపానికి శాంతి కలగాలని! చలిదన్నం, చలిది, చద్ది అంటే చల్లన్నమే! వేసవిలో వడకొట్టనీయని గొప్ప ఉపాయం ఇది! వేడి శరీర తత్త్వం ఉన్నవారికి మేలుచేస్తుంది. శాస్త్రవేత్తలు దీన్ని ‘ప్రోబయాటిక్’ అంటారు.

‘‘ఎంత భాండశుద్ధి! ఎటువంటి గృహశుద్ధి!
యెట్టి చిత్తశుద్ధి! యిచటఁ జలిది
కూడు దక్కునెడఁ బురోడాశమువనకు
నో, యమ్మ! సాటివచ్చు; నదియఁగాక’’
పాండురంగ మహాత్మ్యంలో తెనాలి రామకృష్ణ పద్యం ఇది. శ్రీకృష్ణుడే ఒక వటువు రూపంలో, వేళకాని వేళవచ్చి, అన్నం పెట్టమని సుశీల అనే ఇల్లాల్ని అడుగుతాడు. వండే పాత్రలు, ఇల్లు, ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉండి, చిత్తశుద్ధితో వండితే చద్దన్నం అయినా పురోడాశంతో సమానం అనీ, ‘‘అశనస్థితికి సందియంబు వలదు’’ చద్దన్నాన్ని తినటానికి సందేహించనక్కర లేదంటాడు కృష్ణుడు.
‘‘ఇమం మే అగ్నే పురోఢాశం గృహాణ’’ పురోడాశం స్వీకరించమని అగ్నిని కోరుతుందీ వేద వాక్యం. ‘పురస్’ లోంచే పురోడాశం, ‘పురస్కారం’ పదాలు ఏర్పడ్డాయి! పురస్కారం కూడా ఎదురుగా తెచ్చిపెట్టి స్వీకరించమనేదే!
వ్రీహి(వరి) లేదా యవ(బార్లీ) పిండిని ఆవిరిమీద ఉడికించిన ముద్ద ఇది! పశుబలి, నరబలి ఆచారాలకు బదులుగా ఏర్పడింది. పవిత్రతకు జీవకారుణ్యానికి సంకేతం పురోడాశం!
‘‘చద్దికి వేడికి వచ్చి సనకాదులు పాడేరు’’ అంటాడు అన్నమయ్య! ప్రొద్దున తినేది చద్దన్నం. మధ్యాహ్నం, రాత్రి తినేది వేడన్నం. ముప్పొద్దులా సనకాది మహామునులు స్వామిని కీర్తిస్తారట. ‘‘మీఁగడ పెరుగుతో మేళవించిన చల్దిముద్ద’’... బాలకృష్ణుడు తక్కిన గోపబాలురతో మీగడ పెరుగు కలిపిన చద్దన్నాన్ని ఎడమచేతిలో పెట్టుకుని కుడిచేతి వేళ్లమధ్య ఊరుగాయ ముక్కల్ని ఇరికించుకుని నంజుకొంటూ తినే దృశ్యాన్ని పోతన వర్ణిస్తాడు. చద్దన్నం పురోడాశంతో సమానం ఇందుకే! భగవంతుడు తిన్నది చద్దన్నం!
రాత్రంతా చల్లలో నానిన అన్నాన్ని ఉదయాన్నే గ్రామదేవతలకు చద్దినైవేద్యం పెడతారు. దేవతల ఉగ్ర రూపానికి శాంతి కలగాలని! చలిదన్నం, చలిది, చద్ది అంటే చల్లన్నమే! వేసవిలో వడకొట్టనీయని గొప్ప ఉపాయం ఇది! వేడి శరీర తత్త్వం ఉన్నవారికి మేలుచేస్తుంది. శాస్త్రవేత్తలు దీన్ని ‘ప్రోబయాటిక్’ అంటారు. పేగుల్ని శక్తిమంతం చేస్తుంది. అమీబియాసిస్, పెప్టిక్ అల్సర్లకు ఇదే మందు!
వేడి చల్లారిన అన్నాన్ని మోజు తగ్గిన ప్రేమతో పోల్చి, ‘చద్దివలపు బేరము’ అంటాడు అన్నమయ్య. అన్నాన్ని కాలం దాటిపోయాక తింటే ఎక్స్‘పైరీ డేట్ దాటిన ఔషధం అవు తుంది. పర్యుషితాన్నం అంటే పాచిన అన్నమే! చద్దన్నం, పాచిన అన్నం వేర్వేరు. ఏడుగంట లప్పుడు మజ్జిగ కలిసిన రాగి అంబలి లేదా జొన్న అంబలి, తొమ్మిది గంటలకు చద్దన్నం, మధ్యా హ్నం ఘనంగా భోజనం, సాయంత్రం ఉప్పు కలిపిన వేడివేడి గంజి, రాత్రికి స్వల్ప ఆహారం- ఇది ఉష్ణమండలంలో జీవించే మనకి అనువైన జీవిత విధానం.
చద్దన్నం అనగానే ‘‘అయ్యా! మీరు చల్ది వణ్ణం తించారా...?’’అనే కన్యాశుల్కం నాటకంలో బుచ్చమ్మ ఎవరికైనా గుర్తు కొస్తుంది. పొద్దున్నే చద్దన్నం తినే వాడయితే ఇంకా పెళ్లి కానివాడని ఓ లెక్క! ‘చద్దన్నం ఇంకెన్నాళ్లు?’ అనే ప్రశ్నకి పెళ్లెప్పుడు చేసుకుంటావని భావం. పరాయివాడితో లేచిపోతూ ‘‘అత్తా! నీకొడుక్కి చద్దన్నం అలవాటుందట’’ అని ఓ కొత్త కోడలు అందట! పెళ్లయ్యాక కూడా చద్దన్నం వదల్లేదనిఆరోపణ! ఆచార సంపన్నులైన గృహస్థులు కూడా అనుష్టానాలయ్యాక ఉదయం ఉపాహారంగా చల్ది తినేవాళ్లు. ఇప్పటి జనం చద్దన్నాన్ని తక్కువగా చూస్తున్నారు.. ఒళ్లొస్తుందనేది ఓ వంక!
పూరీలు, మైసూరు బజ్జీలకు ‘సై’ అంటారు, పెరుగన్నానికి ‘నై’ అంటారు!
ఫ్రిజ్జులోంచి తీసి కర్డ్ రైస్ అని హోటళ్లలో పెడ్తుంటే తింటారు గానీ, చద్దన్నంలో పెరుగేసుకుని తినటానికి నామోషీ పడతారు. ఏ ఐదునక్షత్రాల హోటల్లోనో ‘చలిదన్నం కలదు’ అని బోర్డు పెడితే అందరూ తింటారు. ధనియా, జీరా, శొంఠి పొడి నంజుకుంటే చద్దన్నం కమ్మగా బావుంటుంది. చద్దన్నాన్ని పవిత్రాహారం అనే బావనతో తింటే అది రుచికరం! ఆరోగ్యకరం! చద్దన్నానికి స్వాగతం!
- డా. జి వి పూర్ణచందు, 94401 72642
వెర్మిసెల్లి పులావ్
కావలసిన పదార్థాలు : వేయించిన సేమ్యా-కప్పు, కొత్తిమీర-అర కప్పు, పుదీనా-అర కప్పు, పచ్చి మిర్చి-ఒకటి, నెయ్యి-రెండు స్పూన్లు, యాలకులు - మూడు, బిర్యానీ ఆకు - ఒకటి, దాల్చిన చెక్క- ఒకటి, లవంగాలు - రెండు, జీరా - స్పూను, జీడి పప్పులు -పది, క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్ ముక్కలు - అర కప్పు, పచ్చి బఠానీ-రెండు స్పూన్లు, అల్లంవెల్లుల్లి పేస్టు - స్పూను, గరం మసాలా - ముప్పావు స్పూను, నిమ్మరసం - రెండు స్పూన్లు, ఉప్పు, నీళ్లు - తగినంత.
తయారుచేసే విధానం: పుదీనా, కొత్తిమీర, మిర్చిని మిక్సీలో తిప్పి పేస్టులా చేసుకోవాలి. ఓ వెడల్పాటి బాణలిలో నెయ్యి వేసి బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, జీడిపప్పులు దోరగా వేయించాలి. ఇందులోనే ఉల్లి, వెల్లుల్లి పేస్టు, కూరగాయ ముక్కలు, బఠానీ వేసి రెండు నిమిషాలు వేయించాలి. ఆ తరవాత పుదీనా పేస్టు, గరం మసాలా, ఉప్పు జతచేయాలి. అన్నీ బాగా కలిశాక ఒకటిన్నర కప్పు నీళ్లు పోయాలి. నీళ్లు మరిగాక సేమ్యా కలపాలి. మూతపెట్టి ఏడు నిమిషాల పాటు ఉడికించాలి. ఆ తరవాత మూత తీసి మరో రెండు నిమిషాలు ఉడికిస్తే వెర్మిసెల్లి పులావ్ రెడీ. అయితే పైన నిమ్మరసం పిండడం మరచిపోకూడదు.
సొరకాయ పకోడా
కావలసిన పదార్థాలు: సొరకాయ-సగం, ఉల్లి ముక్కలు- అరకప్పు, కొత్తిమీర-రెండు స్పూన్లు, పచ్చి మిర్చి ముక్కలు-స్పూను, ఇంగువ- చిటికెడు, అల్లం పేస్టు-స్పూను, కారం-అరస్పూను, పసుపు-అరస్పూను, ఛాట్ మసాలా-అర స్పూను, శనగ పిండి -కప్పు, బియ్యప్పిండి - పావుకప్పు, ఉప్పు, నీళ్లు, నూనె- తగినంత.
తయారుచేసే విధానం: సొరకాయ తొక్కతీసి, తురుముకోవాలి. అందులోంచి జ్యూస్ను తీసి ఓ వెడల్పాటి గిన్నెలోకి వేయాలి. ఇందులోనే ఉల్లి, కరివేపాకు, కొత్తిమీర, కారం, ఇంగువ, శనగ పిండి, బియ్యప్పిండి, ఉప్పు వేసి కలపాలి. నీళ్లు మాత్రం అస్సలు కలపకూడదు. చిన్న చిన్న ముద్దలుగా చేసి నూనెలో వేయిస్తే సరి.