Vantalu: ఆ పేరుతో ఓ బూరె వంటకం ఉందన్న సంగతి మీకు తెలుసా..
ABN , Publish Date - Nov 09 , 2025 | 11:37 AM
అంగ, వంగ, కళింగ, బంగాళ, నేపాళ, ఘూర్జర, టెంకణ, చోళ, సింధు, మరాట, లాట, మత్స్య, విదర్భ, సౌరాష్ట బర్బర, మగధ, ఆంధ్ర... ఇలా ప్రాచీనకాలంలో భారతదేశంలో అంతర్భాగమైన అనేక రాజ్యాలలో బర్బర ఒకటి. ఈ బర్బర పేరుతో ఒక బూరె వంటకం గురించి క్షేమకుతూహలం పేర్కొంది. ఘారాపూపకం పేరుతో గోధుమ పిండి బూరెల్ని. బర్బరాపూపకం పేరుతో బియ్యప్పిండి బూరెల్ని పేర్కొన్నాడు.
- ‘బర్బర’ అప్పాలు
అంగ, వంగ, కళింగ, బంగాళ, నేపాళ, ఘూర్జర, టెంకణ, చోళ, సింధు, మరాట, లాట, మత్స్య, విదర్భ, సౌరాష్ట బర్బర, మగధ, ఆంధ్ర... ఇలా ప్రాచీనకాలంలో భారతదేశంలో అంతర్భాగమైన అనేక రాజ్యాలలో బర్బర ఒకటి. ఈ బర్బర పేరుతో ఒక బూరె వంటకం గురించి క్షేమకుతూహలం పేర్కొంది. ఘారాపూపకం పేరుతో గోధుమ పిండి బూరెల్ని. బర్బరాపూపకం పేరుతో బియ్యప్పిండి బూరెల్ని పేర్కొన్నాడు.
ఘారాపూపకాలు : ఘార అనే సంస్కృత పదానికి ‘చల్లటం’ అని అర్థం. నేతిని చేతిలో పోసుకుని అన్నం మీద చల్లి అప్పుడు కలుపుకుని తినేవాళ్లు. అభిఘారం అంటే ఇదే! అలా నెయ్యి గానీ, పాలు గాని చల్లుతూ గోధుమ పిండిని తడిపి ముద్దలా చేసి ఉండలు కట్టి, ఒక్కో ఉండనీ బిళ్ళలుగా చేసి నేతిలో వేగించి పంచదార పాకం పట్టిన బూరెలు ఘారాపూపకాలు.
బర్బరాపూపకాలు: బియ్యప్పిండిని పందార నీళ్ళతో తడుపుతూ ముద్దగా చేసి ఉండలు కట్టి ఒక్కో ఉండను బిళ్ళలుగా నొక్కి నేతిలో వేగించినవి బర్బరా పూపకాలు లేదా బర్బరలంటారు. తెలుగులో అప్పచ్చి, మూలద్రావిడ భాషలో అప్పం, రుగ్వేద కాలంలో అపూపంగా ప్రసిద్ధి పొందిందని భాషావేత్తలు చెప్తారు. అపూపం అంటే మన అప్పం లేదా అప్పచ్చే!
ఒక విధంగా ఇవి అప్పటికప్పుడు అనుకుని చేసెయ్యగల తీపి అప్పచ్చులే! వీటి కోసం బియ్యాన్నో గోధుమల్నో నానబెట్టటం, మరకు తీసుకువెళ్లి మరపట్టించటం లాంటి తలనొప్పులేవీ లేని తేలిక వంటకాలివి.
శివపురాణం ప్రకారం బర్బరులు అవర్ణులు. అంటే వర్ణవ్యవస్థకి చెందని వాళ్లు. నాలుగు వర్ణాల్లో ఉన్నవాళ్లే నాగరికులు అనేఅభిప్రాయం ఉన్న రోజుల్లో వీళ్ళని అనాగరికులుగా పరిగణించే వాళ్లు, బార్బేరియన్స్ అనే ఆంగ్ల పదం వీరినుండే పుట్టి ఉండవచ్చు. క్రీ.శ. 2వ శతాబ్ది నాటి టోలమీ ‘పెరిప్లస్ ఆఫ్ ది ఎర్త్’లో పేర్కొన్న దేశాల పట్టికలో ఆంధ్రతో పాటుగా బర్బరిక కూడా ఉంది.
బహుశా ఆనాటి ప్రధాన రాజకీయ స్రవంతితో కలవని జాతిగా బర్బరుల్ని భావించ వచ్చు. వారి వంటకం కాబట్టి దాన్ని వారి పేరుతో బర్బర అని పిలిచి ఉండవచ్చు.
ఈ బర్బరతోనూ, బర్బ రులతోనూ సంబంధం లేదు గానీ, ఇక్కడో విషయాంతరం ఉంది. ఇజ్రాయేల్, జెరుసలేమ్ లాంటి ప్రాంతాలలో క్రైస్తవులు ప్రతి ఏడాది డిసెంబరు 4న సెయింట్ బార్బరా దినోత్సవం (ఈద్ అల్-బుర్బారా) జరుపుకుంటారు. ఆ రోజుతో వారికి క్రిస్మస్ వేడుకలు ప్రారంభం అవుతాయి. బర్బరా అనే పవిత్ర స్త్రీ క్రైస్తవం లోకి మారినందుకు ఆమె పై దాడి జరిగితే ఆమె పంటపొలంలోకి తప్పించుకుందని, ఆమె ముందుకు వెడుతుంటే వెనుక అప్పటికప్పుడు గోధుమ మొక్కలు మొలిచి ఆమెను శతృవులకు కనిపించకుండా కాపాడాయని ఒక ఐతిహ్యం.
ఆమె పేరుతో సెయింట్ బార్బరా ఉత్సవం రోజున బర్బర అనే వంటకాన్ని వాళ్లు పవిత్రా హారంగా వండుకుంటారు. ఇది వారికి శాకా హార వంటకం. గోధుమ విత్తనాలను నానబెట్టి, మృదువుగా ఉడికించి, దాల్చినచెక్క, సోంపు, అనాసపువ్వు వంటి సుగంధద్రవ్యాలు చేర్చి, తీపి కలిపి గుజ్జుగా వండిన హల్వా లాంటి వంటకం బర్బర.
10వ శతాబ్దిలో రాజశేఖరుడుకావ్యమీమాంస అనే విమర్శనా గ్రంథంలో బర్బర లేదా బర్బరి కని ఉత్తర వాయువ్య భారతదేశంలో ఒక భాగంగా పేర్కొన్నారు. సింధూనది పడమర ప్రవాహం దగ్గర బెలూచిస్థాన్ ప్రాంతంలో ఈ బర్బర ఉన్నదని భావిస్తారు. గంధం చెట్లు అక్కడ ఎక్కువ. బర్బరిక చందనం ప్రసిద్ధి.
మొత్తం మీద క్షేమ కుతూహలంలో ప్రస్తా వించిన ‘బర్బర’ అప్పం భారతదేశంలో క్రీస్తు పూర్వం నాటి ప్రాచీన వంటకం అని భావిం చాలి. వీటిని ఇప్పటికీ అప్పాలనే పేరుతో మన ఇళ్ళలో చేస్తూనే ఉన్నారు. రూపాయి బిళ్ళంత పరిమాణంలో చిన్నవిగా చేసిన బర్బరఅప్పాల్ని ఆంజనేయస్వామి ప్రసాదంగా నివేదిస్తుంటారు.
- డా. జి వి పూర్ణచందు, 94401 72642
బన్ దోశ
కావలసిన పదార్థాలు: బియ్యం-రెండు కప్పులు, మెంతులు-అర స్పూను, అటుకులు-కప్పు, పచ్చి కొబ్బరి- కప్పు, పోపు గింజలు- స్పూను, కరివేపాకు రెబ్బలు - కొన్ని, పచ్చి మిర్చి- స్పూను, ఉప్పు, నీళ్లు, నూనె - తగినంత.
తయారుచేసే విధానం: ఓ గిన్నెలో బియ్యం, మెంతుల్ని నానబెట్టాలి. నాలుగు గంటల తరవాత మిక్సీలో రుబ్బి పక్కన పెట్టుకోవాలి. అదే మిక్సీలో పచ్చి కొబ్బరి, అటుకుల్ని రుబ్బి బియ్యం పిండిలో కలిపేయాలి. అవసరమైతే కాస్త నీళ్లనీ జతచేయాలి. మూత పెట్టి ఎనిమిది గంటలు నానబెట్టాలి. ఆ తరవాత ఈ పిండిలో పోపుపెట్టి, ఉప్పు కలిపి బన్ దోశలు వేసుకోవాలి. పెనం మీద రెండు గరిటెల దోశపిండి వేసి మూతపెట్టాలి. కాసేపటి తరవాత మూత తీసి కాస్త నూనె వేసిఅటూ ఇటూ కాలిస్తే బన్ దోశ తయారు. మామూలు దోశగా పిండి వేసి పెనం అంతా సర్దకూడదు. అప్పుడే బన్ దోశ చక్కగా వస్తుంది.
ముర్మరాల చిక్కీ
కావలసిన పదార్థాలు: ముర్మరాలు-80 గ్రాములు, బాదం పలుకులు -రెండు స్పూన్లు, గుమ్మడి గింజలు-రెండు స్పూన్లు, బెల్లం-350 గ్రాములు, నెయ్యి-స్పూను, నీళ్లు- పావు కప్పు, యాలకుల పొడి - పావు స్పూను.
తయారుచేసే విధానం: ఓ మందపాటి బాణలిలో తక్కువమంట మీద ముర్మరాలను వేయించాలి. కరకరలాడుతుంటే బాణలినుంచి తీసేసి ఆరబెట్టాలి. అదే బాణలిలో బాదం పలుకులను, గుమ్మడి గింజలను వేయించి ముర్మరాల పళ్లెంలోనే వేయాలి. పెద్ద బాణలిలో బెల్లం, స్పూను నెయ్యి, పావు కప్పు నీళ్లు వేసి మరిగించాలి. బెల్లం పాకంలా మారాక స్టవ్ కట్టేయాలి. వెంటనే ఈ ద్రావకంలో వేయించిన ముర్మరాలు, యాలకుల పొడి, బాదం, గుమ్మడి పలుకుల్ని వేసి అంతా కలిపి, నెయ్యి పూసిన పళ్లెంలోకి వంపేయాలి. మొత్తం చదునుగా చేసి ముక్కలుగా కోస్తే ముర్మరాల చిక్కీ తయారు.