Seethakka On Operation Kagar: ఆపరేషన్ కగార్పై మంత్రి సీతక్క రియాక్షన్
ABN , Publish Date - Apr 29 , 2025 | 03:06 PM
Seethakka On Operation Kagar: ప్రభుత్వాలు రాజ్యాంగానికి లోబడే వ్యవహరించాలని మంత్రి సీతక్క సూచించారు. బల ప్రయోగంతో కాకుండా, చర్చల ద్వారా సమస్య పరిష్కారం జరిగేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాలని ఆదివాసి బిడ్డగా కోరుకుంటున్నానని తెలిపారు.

వరంగల్, ఏప్రిల్ 29: మావోయిస్టు పార్టీలను సమూలంగా అంతమొందించడమే లక్ష్యంగా కొనసాగుతున్న ఆపరేషన్ కగార్పై (Operation Kagar) మంత్రి సీతక్క (Minister Seethakka) స్పందించారు. మంగలవారం మీడియాతో మాట్లాడుతూ.. ఆదివాసీల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆపరేషన్ కగార్ను తక్షణం నిలిపివేయాలని డిమాండ్ చేశారు. శాంతియుత వాతావరణం నెలకొల్పడమే ప్రభుత్వాల లక్ష్యంగా ఉండాలన్నారు. తెలంగాణ, చత్తీస్గడ్ సరిహద్దుల్లో శాంతియుత వాతావరణం నెలకొనాలని అన్నారు. మధ్యభారతంలోని ఆదివాసి ప్రాంతాలు రాజ్యాంగంలోని షెడ్యూల్ 5 పరిధిలోకి వస్తాయని తెలిపారు. అక్కడ ఆదివాసీలకు ప్రత్యేక హక్కులుంటాయన్నారు. ఆదివాసి ప్రాంతాల్లో ప్రత్యేక పరిపాలన విధానాలు ఉంటాయని చెప్పుకొచ్చారు.
అందుకే ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించి వారి శాంతియుత జీవన విధానానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని అన్నారు. ప్రభుత్వాలు రాజ్యాంగానికి లోబడే వ్యవహరించాలని సూచించారు. బల ప్రయోగంతో కాకుండా, చర్చల ద్వారా సమస్య పరిష్కారం జరిగేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాలని ఆదివాసి బిడ్డగా కోరుకుంటున్నానని తెలిపారు. ఆదివాసీల హక్కులను ఎవరూ కాలరాయవద్దన్నారు. ఆ జాతి బిడ్డగా ఆదివాసులకు అండగా నిలుస్తానని స్పష్టం చేశారు. ఆపరేషన్ కగార్తో ఆదివాసీలు తీవ్ర భయాందోళనతో ఉన్నారన్నారు. మావోయిస్టుల శాంతి చర్చల ప్రతిపాదనకు కేంద్రం సానుకూలంగా స్పందించాలని కోరారు. రెండు వైపుల ప్రాణ నష్ట నివారణకు శాంతి చర్చలు మార్గం చూపుతాయని అన్నారు. కాగా.. మంత్రి సీతక్కను పీఎస్ కమిటీ బృందం కలిసింది.
AP ECET- 2025: ఏపీ ఈసెట్ పరీక్ష షెడ్యూల్ విడుదల
కాగా.. తెలంగాణ - ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టలపై ఎనిమిదవ రోజు భద్రతా బలగాల కుంబింగ్ కొనసాగుతోంది. హెలికాఫ్టర్ ద్వారా కర్రెగుట్టలపైకి భారీగా బలగాలు చేరుకుంటున్నాయి. కర్రెగుట్టలపై తాత్కాలిక బేస్ క్యాంపు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. బేస్ క్యాంప్ కోసమే బలగాలు, ఆయుధ సామాగ్రిని హెలికాఫ్టర్ ద్వారా భద్రతా బలగాలు తరలిస్తున్నాయి. ఆపరేషన్ కర్రెగుట్టలపై కేంద్రం ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. ఛత్తీస్గఢ్, కేంద్ర ప్రభుత్వాల సమన్వయంతో కేంద్ర బలగాలు, ఛత్తీస్గఢ్ బలగాలు గత వారం రోజులుగా కూంబింగ్ కొనసాగుతోంది. ఆపరేషన్ కర్రెగుట్టలు నిలిపివేయాలని ఓ వైపు ప్రజాసంఘాలు, పౌరహక్కుల నేతలు డిమాండ్ చేస్తున్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోని పరిస్థితి. అటు మావోయిస్టులు కూడా ఇప్పటికే మూడు నాలుగు సార్లు లేఖలు రాసినప్పటికీ కేంద్రం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అంతేకాకుండా కర్రెగుట్టలపై బేస్ క్యాంప్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈరోజు ఒక్కరోజే వెంకటాపురం సీఆర్పీఎఫ్ క్యాంపు నుంచి కర్రెగుట్టలపైకి రెండు హెలికాఫ్టర్లు నాలుగు సార్లు అక్కడకు వెళ్లి బలగాలు, మందుగుండు సామాగ్రిని తరలించాయి. ఇటీవల వడదెబ్బ కారణంగా 40 మంది జవాన్లు వెనక్కి వచ్చినప్పటికీ రెట్టింపు సంఖ్యలో బలగాలను చేరవేస్తూ కూంబింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
Rahul letter to PM: పహల్గామ్ ఉగ్రదాడిపై ప్రధానికి రాహుల్ లేఖ
Pakistani Citizens: హైదరాబాద్ను వీడిన పాకిస్థానీలు
Read Latest Telangana News And Telugu News