Nizamabad: ‘వక్ఫ్’ సవరణను అమలు కానివ్వం: షబ్బీర్
ABN , Publish Date - Apr 21 , 2025 | 03:41 AM
ఎట్టి పరిస్థితుల్లోనూ వక్ఫ్ బోర్డు చట్ట సవరణను అమలు కానివ్వబోమని, చట్ట ప్రకారం కోర్టుల ద్వారా అడ్డుకుంటామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్ అన్నారు.

నిజామాబాద్లో ముస్లింల భారీ ర్యాలీ
సుభాష్నగర్, ఏప్రిల్ 20(ఆంధ్రజ్యోతి): ఎట్టి పరిస్థితుల్లోనూ వక్ఫ్ బోర్డు చట్ట సవరణను అమలు కానివ్వబోమని, చట్ట ప్రకారం కోర్టుల ద్వారా అడ్డుకుంటామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బోధన్ రోడ్డులో వక్ఫ్ బోర్డు చట్ట సవరణకు వ్యతిరేకంగా ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. వక్ఫ్ ఆస్తులను తమ ఆధీనంలోకి తీసుకుని ముస్లిం మైనార్టీ సమాజాన్ని బలహీనపర్చేలా కేంద్రం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. వక్ఫ్ బోర్డు చట్ట సవరణను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. దానిని వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వక్ఫ్ బోర్డు చట్ట సవరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ తరపున సుప్రీంకోర్టులో సొంత ఖర్చులతో పిటిషన్ దాఖలు చేశానని తెలిపారు. ఈ సవరణ చట్టబద్ధతపై సుప్రీంకోర్టు ఇప్పటికే విచారణ మొదలు పెట్టి కేంద్ర ప్రభుత్వానికి మొట్టికాయలు వేస్తూ వివరణ కోరిందని షబ్బీర్ అలీ చెప్పారు. గతంలో ముస్లింలు మాత్రమే వక్ఫ్ కౌన్సిల్ బోర్డులో భాగమని, సవరణ తర్వాత హిందువులు కూడా భాగం కావచ్చునని, ఇది పార్లమెంటరీ చట్టం ప్రాథమిక హక్కులను ప్రత్యక్షంగా ఉల్లంఘించడమేనని ఆయన పేర్కొన్నారు. భారత అత్యుత్తమ న్యాయస్థానం సుప్రీంకోర్టుపై తమకు పూర్తి నమ్మకం ఉందని, తప్పక న్యాయం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బిన్ హందాన్, రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, జావీద్ అక్తర్, ఖుద్దుస్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Also Read:
క్రికెట్ ఆడుతోండగా పిడుగు పడి.. యువకులు మృతి
థాకరే, రాజ్ మధ్య సయోధ్యపై బీజేపీ ఆసక్తికర వ్యాఖ్యలు
గుజరాత్లో పటేల్ విగ్రహాన్ని పరిశీలించిన మంత్రి
For More Telangana News and Telugu News..