ACB: ఏసీబీ వలలో ఎక్సైజ్ శాఖ సీనియర్ అసిస్టెంట్
ABN , Publish Date - May 03 , 2025 | 05:09 AM
వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగికి రూ.76 వేల టీఏ బిల్లు రావాల్సి ఉంది.

టీఏ బిల్లు మంజూరుకూ రూ.8,000 లంచం డిమాండ్
వికారాబాద్, మే 2 (ఆంధ్రజ్యోతి): వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగికి రూ.76 వేల టీఏ బిల్లు రావాల్సి ఉంది. ఆ ఫైల్ ముందుకెళ్లడానికి 11 శాతం లంచం కావాలని కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్ డిమాండ్ చేశాడు. రూ.76 వేలల్లో 11 శాతం అంటే రూ.8,150కి బదులు రూ.8,000 ఇస్తే ఫైల్ కదులుతుందని చెప్పాడు.
అడిగినంత ఇస్తానని సదరు ఉద్యోగి హామీ ఇవ్వడంతో టీఏ బిల్లు ఫైల్ పై అధికారులకు వెళ్లడం.. ఆమోదం పొంది.. ఆయన ఖాతాలో టీఏ బిల్లు డబ్బులు జమ అయ్యాయి. నాటి నుంచి రోజూ డబ్బుల కోసం శ్రీధర్ తరుచుగా ఫోన్చేస్తుండటంతో ఉద్యోగి విసుగెత్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు శుక్రవారం సాయంత్రం కార్యాలయంలోనే శ్రీధర్కు నగదు ఇచ్చాడు. అక్కడే మాటువేసి ఉన్న ఏసీబీ అధికారులు శ్రీధర్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.