Share News

Mahesh Kumar Goud: మా నేతలకూ మంత్రివర్గంలో స్థానం కల్పించండి

ABN , Publish Date - Jun 13 , 2025 | 04:55 AM

తమ వర్గం నేతలకు క్యాబినెట్‌లో స్థానం కల్పించడంతో పాటు నామినేటెడ్‌, పార్టీ కీలక పదవుల్లో అవకాశం కల్పించాలంటూ వివిధ కుల సంఘాల నేతలు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.

Mahesh Kumar Goud: మా నేతలకూ మంత్రివర్గంలో స్థానం కల్పించండి

  • నామినేటెడ్‌, పార్టీ పదవుల్లో అవకాశమివ్వండి

  • మహేశ్‌ గౌడ్‌ను కోరిన వివిధ కుల సంఘాలు

హైదరాబాద్‌, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): తమ వర్గం నేతలకు క్యాబినెట్‌లో స్థానం కల్పించడంతో పాటు నామినేటెడ్‌, పార్టీ కీలక పదవుల్లో అవకాశం కల్పించాలంటూ వివిధ కుల సంఘాల నేతలు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. గురువారం గాంధీభవన్‌లో మహేశ్‌ గౌడ్‌తో ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య నేతృత్వంలో కురుమ, గొల్ల కులాల ప్రతినిధులు భేటీ అయ్యారు. ప్రభుత్వంలో తమ వర్గానికి ప్రాతినిధ్యం లభించలేదంటూ గొల్ల, కురుమ ప్రతినిధులు ఈ సందర్భంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో గొల్ల, కురుమలు లేకుండా క్యాబినెట్‌ ఏర్పడలేదని గుర్తు చేశారు. రాష్ట్రంలో గొల్లలు 22 లక్షలు, కురుమలు 6 లక్షలకు పైగా ఉన్నారన్నారు. కురుమ, గొల్లలకు ఓ మంత్రి పదవి, ప్రభుత్వ సలహాదారు, ఒక ఎమ్మెల్సీతో పాటు కార్పొరేషన్‌ చైర్మన్లు, కమిషన్‌ సభ్యుల పదవులతో పాటు పార్టీ ముఖ్య పదవులను ఇవ్వాలని బీర్ల కోరారు. గొల్ల, కురుమల న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తామని.. పార్టీ పదవుల్లో ప్రాధాన్యత కల్పిస్తామని మహేశ్‌ గౌడ్‌ హామీనిచ్చారు. తమ సామాజిక వర్గం నేత, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివా్‌సకు మంత్రి పదవి ఇవ్వాలని కోరుతూ మున్నూరు కాపు సంఘం ప్రతినిధులు మహేశ్‌ గౌడ్‌కు విజ్ఞప్తి చేశారు. 33 జిల్లాలకు చెందిన మున్నూరు కాపు సంఘం ప్రతినిధులు మహేశ్‌ గౌడ్‌తో భేటీ అయ్యారు. పీసీసీ కార్యవర్గంలోనూ తమ వర్గం నేతలను అధిక సంఖ్యలో నియమించాలని కోరారు.


బీసీలకు మరింత ప్రాధాన్యత కల్పించాలి..

పార్టీ పదవులతో పాటు ప్రభుత్వ సంస్థల్లో.. నామినేటెడ్‌ పోస్టుల్లో బీసీలకు మరింత ప్రాధాన్యత కల్పించాలని బీసీ సంఘాల ప్రతినిధులు మహేశ్‌ గౌడ్‌కు విజ్ఞప్తి చేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ నేతృత్వంలో వారు మహేశ్‌ గౌడ్‌తో భేటీ అయ్యారు. ఇటీవల ఎమ్మెల్సీ పదవులు, మంత్రివర్గ విస్తరణలోనూ బీసీ, ఎస్సీలకు ప్రాధాన్యత పెంచడానికి మహేశ్‌ గౌడ్‌ చేసిన కృషిని ప్రశంసిస్తూ సన్మానించారు. అలాగే పార్టీ కమిటీల్లో 70 శాతం పదవులు బడుగులకు ఇచ్చారని బీసీ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. అయితే సమాచార కమిషనర్ల నియామకంలో బీసీలకు అన్యాయం జరిగిందని.. దాన్ని సరిచేయాలని కోరారు. భేటీలో బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్‌ కుందారం గణేశ్‌ చారి, కన్వీనర్‌ బాలగోని బాలరాజు గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కూలిన విమానంలో గుజరాత్ మాజీ సీఎం.. ఆయన చివరి ఫొటో ఇదే..

లోపం ఉందని ముందే చెప్పినా.. పట్టించుకోని ఎయిర్ ఇండియా

For National News And Telugu News

Updated Date - Jun 13 , 2025 | 04:55 AM