Uttam: రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ
ABN , Publish Date - Jan 23 , 2025 | 03:57 AM
గతంలో మీసేవ, ప్రజావాణి సర్వేలలో సమర్పించిన దరఖాస్తులన్నీ పరిశీలించి అర్హత ఉన్న వారందరికీ రేషన్ కార్డులను జారీ చేస్తామని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి చెప్పారు.

40 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇస్తాం: మంత్రి ఉత్తమ్
ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయి: మంత్రి పొన్నం
తిమ్మాపూర్ (మానకొండూర్) గంగాధర/సిరిసిల్ల, జగిత్యాల, హైదరాబాద్, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): గతంలో మీసేవ, ప్రజావాణి సర్వేలలో సమర్పించిన దరఖాస్తులన్నీ పరిశీలించి అర్హత ఉన్న వారందరికీ రేషన్ కార్డులను జారీ చేస్తామని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి చెప్పారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతాయని హామీ ఇచ్చారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి, కరీంనగర్ జిల్లా రేణికుంట, నారాయణపూర్, జగిత్యాల జిల్లా జైనాలో జరిగిన గ్రామసభలలో మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి పాల్గొన్న మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడారు. 2014లో రాష్ట్రవ్యాప్తంగా 90 లక్షల రేషన్ కార్డులుంటే గత పది సంవత్సరాల్లో కేవలం 40 వేల మందికి మాత్రమే అవి ఇచ్చారని చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం 40లక్షల కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోందని పేర్కొన్నారు. గ్రామసభల్లో ప్రకటించిన జాబితాలో పేర్లు లేకుంటే అదే సభలో మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులందరికి రేషన్ కార్డులు అందిన తర్వాత ప్రతి వ్యక్తికి ఆరు కిలోల సన్న బియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఏ ప్రభుత్వం చేయని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే ప్రతిపక్షం సూచనలు, సలహాలు ఇవ్వకుండా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు.