ఏఐతో నియామక పరీక్షల్లో వివాదాలు తగ్గించొచ్చు
ABN , Publish Date - Jun 13 , 2025 | 03:33 AM
రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు నిర్వహించే పరీక్షల్లో వివాదాలను కృత్రిమ మేధ (ఏఐ)తో తగ్గించవచ్చని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) చైర్మన్ అజయ్ కుమార్ అన్నారు.

8యూపీఎస్సీ చైర్మన్ అజయ్ కుమార్
హైదరాబాద్, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు నిర్వహించే పరీక్షల్లో వివాదాలను కృత్రిమ మేధ (ఏఐ)తో తగ్గించవచ్చని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) చైర్మన్ అజయ్ కుమార్ అన్నారు. యూపీఎస్సీ పరీక్షల్లో ఏఐని ఇప్పటికే వినియోగిస్తున్నామని తెలిపారు. రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లలో వివాదాలు, కోర్టు సమస్యలు, ఇతర అంశాలపై చర్చించేందుకు రెండు రోజుల జాతీయ సదస్సు గురువారం నల్సార్ యూనివర్సిటీలో ప్రారంభమైంది. టీజీపీఎస్సీ, నల్సార్ వర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సదస్సులో 18 రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్మన్లు, సభ్యులు, కార్యదర్శులు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అజయ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తులు లక్షల్లో వస్తున్నందున వివాదరహితంగా, కోర్టు కేసులులేకుండా నిర్వహించడం కత్తిమీద సాములా మారిందని, దీనికి సాంకేతిక పరిజ్ఞానం పరిష్కారమన్నారు.
పరీక్షలు పూర్తి పారదర్శకంగా నిర్వహించేందుకూ ఏఐ, లార్డ్ లాంగ్వేజ్ మాడ్యూల్స్ (ఎల్ఎల్ఎం) వినియోగించాలని సూచించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్లు డిజిటలైజేషన్కు అత్యంత ప్రాధాన్యమివ్వాలన్నారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఏఐ వినియోగంలో తెలంగాణ దేశంలోనే ప్రథమస్థానంలో ఉందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో వచ్చినప్పటి నుంచి టీజీపీఎస్సీలో పూర్తి పారదర్శకత పాటిస్తున్నామని, వివాదాలు లేకుండా నియామక పరీక్షలు జరుగుతున్నాయన్నారు. టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం మాట్లాడుతూ.. నోటిఫికేషన్ ఇచ్చిన ప్రతి పరీక్షను పూర్తి పారదర్శకతతో నిర్వహిస్తున్నామన్నారు. తాము నిర్వహించే ప్రతి పరీక్షకు, ప్రతి అభ్యర్థికి పూర్తి జవాబుదారీగా ఉంటున్నామన్నారు.