Kishan Thanda: మద్యం అమ్మితే రూ.లక్ష జరిమానా
ABN , Publish Date - Jun 06 , 2025 | 03:48 AM
ఎవరో వస్తారు.. ఏదో చేస్తారని ఎదురు చూడకుండా... తమ ఊరి బాగు కోసం గిరిజనమంతా ఏకమయ్యారు.

మెదక్ జిల్లా కిషన్ తండావాసుల తీర్మానం
రామాయంపేట, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): ఎవరో వస్తారు.. ఏదో చేస్తారని ఎదురు చూడకుండా... తమ ఊరి బాగు కోసం గిరిజనమంతా ఏకమయ్యారు. యువత భవిష్యత్తును, కుటుంబాలను నాశనం చేస్తోన్న మద్యం మహమ్మారికి వ్యతిరేకంగా ఒక్కతాటిపైకి వచ్చారు. తమ గ్రామంలో మద్యం అనేదే లేకుండా చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఊళ్లో అడ్డగోలుగా వెలసిన బెల్టు షాపులను మూసేయించడంతోపాటు ఎవరైనా గుట్టుగా మద్యం విక్రయిస్తే రూ.లక్ష జరిమానా విధించాలని నిర్ణయిస్తూ తీర్మానం చేశారు.
మెదక్ జిల్లా రామాయంపేట మండల పరిధి కిషన్ తండా గ్రామ పంచాయతీలో పెద్దలంతా కలిసి గురువారం ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేశారు. గ్రామంలో గుట్టుగా మద్యం విక్రయించిన వారికి జరిమానాలు విధించడంతోపాటు వారిని పోలీసులకు అప్పగించాలని తీర్మానించారు. అంతేనా.. తాము చేసిన తీర్మానాన్ని వివరిస్తూ గ్రామ పెద్దలంతా కలిసి రామాయంపేట ఎస్సైకు ఓ లేఖ కూడా రాశారు.