Unclaimed Pension: చనిపోయినా.. మూడేళ్లుగా పెన్షన్
ABN , Publish Date - May 14 , 2025 | 03:14 AM
చనిపోయిన వ్యక్తి మూడు సంవత్సరాలుగా ఆసరా పెన్షన్ డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ అవుతూనే ఉన్నాయి. ఈ విషయం గౌరీశంకర్ ద్వారా బ్యాంకు అధికారులకు తెలియచేయబడినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

నెలనెలా మృతుడి ఖాతాకు ఆసరా డబ్బులు
ప్రస్తుతం బ్యాంకు ఖాతాలో రూ.71,337
రెజిమెంటల్బజార్, మే 13(ఆంధ్రజ్యోతి): ఆ వృద్ధుడు చనిపోయి మూడేళ్ల వుతున్నా.. ఆసరా పథకం పెన్షన్ డబ్బులు ఇంకా బ్యాంకు ఖాతాలో జమ అవుతూనే ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శంగా ఉన్న ఈ ఉదంతం వివరాలు ఇలా వున్నాయి. హైదరాబాద్ రెజిమెంటల్ బజార్కు చెందిన అరుణ్ అంథోని ఆసరా పెన్షన్ లబ్ధిదారుడు. అతనికి కుటుంబ సభ్యులు ఎవరూ లేక పోవడంతో ఒంటరిగా ఉంటూ రాష్ట్ర ప్రభుత్వం అందించే ఆసరా పెన్షన్తో జీవనం సాగించేవాడు. అతనికి ఫోన్ కూడా లేక పోవడంతో ఇంటి దగ్గర ఉన్న గౌరీశంకర్ అనే వ్యక్తికి చెందిన ఫోన్ నెంబరును బ్యాంకులో ఇచ్చాడు. ఫోన్ మెసేజ్ రాగానే పెన్షన్ డబ్బులు తెచ్చుకునేవాడు. అయితే, అరుణ్ అనారోగ్యంతో మూడేళ్ల క్రితం మృతి చెందాడు. అయినా నెలనెలా పెన్షన్ రూ.2016లు సెబాస్టియన్ రోడ్డులో ఉన్న యూనియన్ బ్యాంకులోని అతని ఖాతాకు జమ అవుతున్నాయి. ప్రస్తుతం అతని బ్యాంకు అకౌంట్లో రూ.71,337 బ్యాలెన్స్ ఉంది. ఈ విషయాన్ని గౌరీశంకర్.. బ్యాంకు అధికారులకు తెలియజేసినా ప్రయోజనం లేకపోయింది. ఈ విషయమై బ్యాంకు మేనేజర్ను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా.. పెన్షన్కు సంబంధించిన విషయాలు తమ పరిధిలోకి రావని, పెన్షన్ అందజేసే అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే వారే చర్యలు తీసుకుంటారని చెప్పారు.