Car Accident: కారు ఢీకొని ఇద్దరు ఉపాధి కూలీల దుర్మరణం
ABN , Publish Date - May 13 , 2025 | 05:55 AM
ఉపాధి పనుల కోసం వెళ్తున్న ఇద్దరు కూలీలను కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందారు. మరో కూలీకి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సిద్దిపేట జిల్లా అక్బర్పేట-భూంపల్లి మండలంలో జరిగింది.

మరొకరికి గాయాలు.. గ్రామస్థుల ఆందోళన
దుబ్బాక, మే 12 (ఆంధ్రజ్యోతి): ఉపాధి పనుల కోసం వెళ్తున్న ఇద్దరు కూలీలను కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందారు. మరో కూలీకి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సిద్దిపేట జిల్లా అక్బర్పేట-భూంపల్లి మండలంలో జరిగింది. పోతరెడ్డిపేటకి చెందిన బ్యాగరి చంద్రవ్వ(45), గోప దేవవ్వ(48), బైండ్ల లాస్య సోమవారం ఎల్కతుర్తి- మెదక్ జాతీయ రహదారిపై వెళ్తుండగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన జ్ఞాన్సింగ్ కారు ఢీకొట్టింది. దీంతో చంద్రవ్వ, దేవవ్వ మృతిచెందారు.
లాస్యకు తీవ్రగాయాలవగా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు జాతీయ రహదారిపై బైఠాయించారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని ఆందోళన చేశారు. కాగా, బాధిత కుటుంబాలను ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పరామర్శించారు. ప్రభుత్వం ఆదుకునేలా, పరిహారం అందించేలా చూస్తానని హామీ ఇచ్చారు.