Share News

Tummala: ఈటల, హరీశ్‌ తప్పుడు సమాచారం ఇచ్చారు

ABN , Publish Date - Jun 12 , 2025 | 03:21 AM

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు.. మంత్రివర్గ ఉపసంఘానికి సంబంధం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

Tummala: ఈటల, హరీశ్‌ తప్పుడు సమాచారం ఇచ్చారు

  • వారిపై తగిన చర్యలు తీసుకోవాలి

  • కాళేశ్వరానికి, మంత్రివర్గ ఉపసంఘానికి సంబంధం లేదు

  • జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌కు తుమ్మల లేఖ

హైదరాబాద్‌, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు.. మంత్రివర్గ ఉపసంఘానికి సంబంధం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. నాటి మంత్రివర్గ ఉప సంఘంలో సభ్యుడైన తుమ్మల ఈ మేరకు జస్టిస్‌ పీసీ ఘోష్‌కు బుధవారం లేఖ రాశారు. 2016 ఫిబ్రవరిలోనే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంపై విధాన నిర్ణయం తీసుకున్నారని, 2016 మార్చి 1న మేడిగడ్డకు పరిపాలనాపరమైన అనుమతినిస్తూ గత ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు. 2016 మార్చి 15న హరీశ్‌రావు చైర్మన్‌గా, తాను, ఈటల సభ్యులుగా మంత్రివర్గ ఉపనసంఘం వేశారని గుర్తుచేశారు.


ఇటీవలి విచారణలో కమిషన్‌ ముందు ఈటల, హరీశ్‌ అబద్ధాలు చెప్పారని కమిషన్‌కు నివేదించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అప్పటి మంత్రివర్గ ఉపసంఘంలో చర్చే జరగలేదని స్పష్టం చేశారు. అన్ని ప్రాజెక్టుల రీడిజైన్‌, సమస్యల అధ్యయనం కోసమే మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారని, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కాదని తెలిపారు. కమిషన్‌కు తప్పుడు సమాచారం ఇచ్చిన హరీశ్‌రావు, ఈటలపై చర్యలు తీసుకోవాలని తుమ్మల కోరారు. ఈ మేరకు లేఖతో పాటు మంత్రివర్గ ఉపసంఘం జీవోలు, తీర్మానాలు పంపించారు.

Updated Date - Jun 12 , 2025 | 03:21 AM