Accident: కారును ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు.. ముగ్గురు యువకుల మృతి
ABN , Publish Date - Jun 12 , 2025 | 04:53 AM
స్నేహితుడి పుట్టిన రోజు వేడుకలకు వెళ్లి తిరుగు ప్రయాణమైన యువకులు ప్రయాణిస్తున్న కారును ఓ ట్రా వెల్స్ బస్సు ఢీకొనడంతో ముగ్గురు మరణించగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

నలుగురికి తీవ్ర గాయాలు.. రంగారెడ్డి జిల్లా యాచారంలో ఘటన
యాచారం, మూసాపేట, జూన్ 11 (ఆంధ్రజ్యోతి): స్నేహితుడి పుట్టిన రోజు వేడుకలకు వెళ్లి తిరుగు ప్రయాణమైన యువకులు ప్రయాణిస్తున్న కారును ఓ ట్రా వెల్స్ బస్సు ఢీకొనడంతో ముగ్గురు మరణించగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం గుడిబండకు చెందిన వాస సాయితేజ, పవన్కుమార్, రాఘవేందర్, శివకుమార్గౌడ్, సాయికుమార్, మేకల సందీప్, శివకుమార్ స్నేహితులు, దాయాదులు. వీరంతా హైదరాబాద్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అయితే, తమ స్నేహితుడు వాస శివకుమార్ పుట్టినరోజు వేడుకల కోసం వీరంతా మంగళవారం నల్లగొండ జిల్లా దేవరకొండ సమీపంలోని వైజాగ్కాలనీకి వెళ్లారు.
వేడుకల అనంతరం తిరిగి వస్తుండగా అర్థరాత్రి యాచారం మండలం మాల్ వద్ద వీరి కారును ఎదురుగా వస్తున్న ట్రావెల్స్ బస్సు బలంగా ఢీకొట్టింది. దీంతో కారులోని ఏడుగురిలో సాయితేజ(24), పవన్కుమార్ (26), రాఘవేందర్ (22) అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడిన నలుగురిని ఆస్పత్రులకు తరలించారు. మృతుల్లో ఒకరైన పవన్ కుమార్(26)కు భార్య వరలక్ష్మి, కుమార్తె దీక్షిత(1), తల్లిదండ్రులు ఉన్నారు. కాంక్రీట్ మిషన్ ఆపరేటర్గా పని చేసే పవనే ఆ కుటుంబానికి ఆధారం. పవన్ భార్య వరలక్ష్మి ప్రస్తుతం నిండు గర్భిణి. ఇక, సాయితేజ డ్రైవర్గా, రాఘవేందర్ కోళ్ల పరిశ్రమలో పని చేస్తున్నారు.